Bengal Assembly Elections: బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం కూటమి - మమతకు ముప్పు తప్పదా?
Bengal Elections: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఓవైసీ కూటమి ముప్పుగా మారింది. ఓటు బ్యాంక్ గా ఉన్న ముస్లింలలో చీలిక వస్తే మమతా బెనర్జీకి సమస్య తప్పదు.

Bengal Assembly Elections minority votes: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా తృణమూల్ కాంగ్రెస్ వెన్నంటి ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు లో ఈసారి అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యం అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం , మాజీ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ స్థాపించిన ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ జతకట్టడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసింది. ఈ కూటమి మమతా బెనర్జీ విజయ అవకాశాలను దెబ్బతీస్తుందా? లేక బీజేపీకి పరోక్షంగా లాభం చేకూరుస్తుందా?
కొత్త పొత్తు - పాత వ్యూహం
బెంగాల్ జనాభాలో సుమారు 30 శాతం ఉన్న ముస్లిం ఓటర్లు 2011 నుండి మమతా బెనర్జీకి రక్షణ కవచంగా నిలుస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి ఎంఐఎం-ఏజేయూపీ కూటమి 182 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం టీఎంసీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్ వంటి జిల్లాల్లో ఈ కూటమి ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. హుమాయున్ కబీర్ లాంటి క్షేత్రస్థాయి పట్టున్న నేత తోడవ్వడం ఒవైసీకి కలిసివచ్చే అంశం.
చురుకుగా తిరుగుతున్న ఓవైసీ
ఒవైసీ తన ప్రసంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూశారు తప్ప, వారికి రాజ్యాధికారంలో వాటా ఇవ్వలేదు అని ఆయన ఆరోపిస్తున్నారు. లక్షలాది మంది ముస్లింల ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేయడాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుని, మైనారిటీలలో అసంతృప్తిని రగిలిస్తున్నారు. కేరళ, తమిళనాడు ఎన్నికలకు దూరంగా ఉండి కేవలం బెంగాల్పైనే దృష్టి సారించడం ఒవైసీ సీరియస్నెస్ను తెలియజేస్తోంది.
బీజేపీకి బి టీమ్ ఆరోపణలు
టీఎంసీ శ్రేణులు ఈ కూటమిని బీజేపీకి బి టీమ్ అని అభివర్ణిస్తున్నాయి. ముస్లిం ఓట్లు చీలితే అది సహజంగానే బీజేపీకి లాభిస్తుందని, అందుకే కేంద్రంలోని పెద్దల కనుసన్నల్లోనే ఈ పొత్తు కుదిరిందని మమత ఆరోపిస్తున్నారు. అయితే, మమత అసమర్థ పాలన వల్లే బీజేపీ బెంగాల్లో 77 స్థానాలకు చేరుకుంది, దానికి మేము కారణం కాదు అని ఒవైసీ ధీటుగా సమాధానమిస్తున్నారు. ముస్లింలకు స్వతంత్ర రాజకీయ నాయకత్వం కావాలన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ కూటమి కేవలం ముస్లింలకే పరిమితం కాకుండా, దళితులు, ఆదివాసీలను కూడా కలుపుకుని వెళ్లాలని చూస్తోంది. ముఖ్యంగా భవానీపూర్లో మమతపై పూనమ్ బేగంను బరిలోకి దించడం ద్వారా సామాన్య ముస్లిం ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్నారు. దాదాపు 80 నుండి 90 నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపోటములను శాసించే స్థితిలో ఉండటంతో, అక్కడ పడే ప్రతి ఓటు మమతకు నష్టం, బీజేపీకి లాభం అన్నట్లుగా మారింది.
బెంగాల్ ప్రజలు ఈసారి సెక్యులరిజం పేరుతో మమతకు మద్దతు ఇస్తారా? లేక తమ సొంత గొంతుక కోసం ఒవైసీ-కబీర్ కూటమి వైపు మొగ్గు చూపుతారా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ముస్లిం ఓట్లలో స్వల్పంగా 5 నుండి 10 శాతం చీలిక వచ్చినా, అది బెంగాల్ పీఠంపై మమత కూర్చోవడానికి అడ్డంకిగా మారవచ్చు. మే 4న వెలువడే ఫలితాలు ఈ ముస్లిం రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
Before You Go
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















