Keralam Assembly Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !
Keralam Elections: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేరళలో సుడిగాలి పర్యటనలు చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అగ్రనేతలను బీజేపీ వ్యూహాత్మక ప్రచారంలోకి దింపుతోంది.

Keralam Assembly Elections Devendra Fadnavis: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. దక్షిణాదిన కర్ణాటక తర్వాత కేరళను తన తదుపరి లక్ష్యంగా మార్చుకున్న కమలదళం, ఈసారి మిషన్ కేరళ' పేరుతో అత్యంత పకడ్బందీగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూనే, జాతీయ స్థాయి దిగ్గజాలను క్షేత్రస్థాయి ప్రచారంలోకి దించుతూ ప్రత్యర్థి పార్టీలైన ఎల్డిఎఫ్ , యుడిఎఫ్ లకు సవాల్ విసురుతోంది.
ఫడ్నవీస్ ప్రచారం - ఎర్నాకులంపై ప్రత్యేక దృష్టి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేరళలో సుడిగాలి పర్యటనలు చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. తాజాగా ఎర్నాకులం జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని, కేరళ అభివృద్ధికి మోదీ నాయకత్వమే శరణ్యమని ఉద్ఘాటించారు. ఎర్నాకులంను ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మారుస్తామని హామీ ఇస్తూ, స్థానిక ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కేరళలో కేవలం ఓట్లు పెంచుకోవడమే కాకుండా, ఈసారి గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
With @Dev_Fadnavis ji at the #NDA rally at #Tripunithura today. Twenty20 party leaders Sabu M Jacob, V Gopakumar, @BJP4India leaders @SVishnuReddy, A Anupkumar, @AdvKSS77, Srikkuttan Thundathil, PL Babu, candidate Anjali Nair are also seen. pic.twitter.com/DxafP8lbW0
— KVS Haridas 🇮🇳 (@keveeyes) April 2, 2026
విష్ణువర్ధన్ రెడ్డి సమన్వయం - క్షేత్రస్థాయిలో మకాం
ఆంధ్రప్రదేశ్కు చెందిన బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గత మూడు, నాలుగు వారాలుగా కేరళలోనే మకాం వేసి, ఎర్నాకులం జిల్లా ఇంచార్జ్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ నేతల పర్యటనలను సమన్వయం చేయడంతో పాటు, స్థానిక కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేయడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఎర్నాకులం జిల్లాలోని త్రిపునిత్తుర ఎన్డీయే అభ్యర్థి అంజలి నాయర్, ఇతర అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును పెంచేందుకు కృషి చేస్తున్నారు.
కేరళలో అభివృద్ధి రాజకీయాలు మానేసి అవినీతి రాజకీయాలు చేస్తున్నారు. కమ్యూనిస్టు ఉపన్యాసాలకు, చేస్తున్న పనులకు 100% తేడా ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గారు నిన్న జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. వారితో కలిసి సభలో పాల్గొన్నాను. ఈ సభ అనంతరం వారితో కేరళ ఎన్నికల… pic.twitter.com/fAb6tz8MTV
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 3, 2026
జాతీయ నేతల అండ - గెలుపుపై ధీమా
కేరళలో ఈసారి బిజెపి అగ్రనేతలంతా రంగంలోకి దిగుతున్నారు. జె.పి. నడ్డా, స్మృతి ఇరానీ వంటి నేతలు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. గతంలో త్రిపుర, అస్సాంలలో బిజెపి ఎలాగైతే అసాధ్యమైన విజయాలను సాధించిందో, కేరళలో కూడా అదే చరిత్ర పునరావృతమవుతుందని బిజెపి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి హామీలతో బిజెపి ఈసారి గట్టి పోటీనిస్తోంది.























