Punjab Crisis: పంజాబ్ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
Punjab AAP MLAs: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఏమైనా జరగొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Will Punjab AAP MLAs merge with BJP: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు పంజాబ్లోని భగవంత్ మాన్ ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదంలో ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాఘవ్ చద్దా నిష్క్రమణ తర్వాత, పంజాబ్కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారనే వార్తలు అక్కడి రాజకీయ వర్గాల్లో దావానలంలా వ్యాపిస్తున్నాయి.
రాఘవ్ చద్దా నిష్క్రమణతో మొదలైన ముప్పు
పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రాఘవ్ చద్దా, బీజేపీలో చేరడం కేవలం వ్యక్తిగత మార్పు మాత్రమే కాదు, అది పంజాబ్ ప్రభుత్వ స్థిరత్వానికి గండంగా మారింది. పంజాబ్లోని 92 మంది ఆప్ ఎమ్మెల్యేలపై చద్దాకు పట్టు ఉంది. ఆయన వెళ్లిన వెంటనే, మంత్రులు , ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చద్దా నిష్క్రమణ పంజాబ్ ఆప్ యూనిట్లో భారీ చీలికకు నాంది పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ ఆపరేషన్ లోటస్?
సుమారు 30 నుండి 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారని పంజాబ్ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శైలిపై అసంతృప్తిగా ఉన్న వర్గం, చద్దా నాయకత్వంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోందని సమాచారం. గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలను కూల్చిన ఆపరేషన్ లోటస్ తరహా వ్యూహం ఇప్పుడు పంజాబ్లో అమలు కాబోతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
గతానుభవాలు – ఆప్ అప్రమత్తత
గతంలోనూ పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 25 కోట్లు ఆఫర్ చేసిందని భగవంత్ మాన్ ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, అప్పట్లో ఆప్ తన కేడర్ను కాపాడుకోగలిగింది. కానీ, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. పార్టీలోని అగ్రశ్రేణి నాయకత్వం చట్టపరమైన చిక్కుల్లో ఉండటం, పార్టీకి దిశానిర్దేశం చేసే చద్దా వంటి నేతలే ఫిరాయించడంతో ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు కోసం బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్లో బీజేపీకి పూర్వవైభవం తీసుకురావాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రంలో బలమైన పట్టు సాధించడం బీజేపీకి వ్యూహాత్మకంగా ముఖ్యం. రాఘవ్ చద్దా ద్వారా సిక్కు మతస్థులు , యువతను ఆకర్షించాలని బీజేపీ భావిస్తోంది.
ప్రభుత్వం మారే అవకాశం ఉందా?
పంజాబ్ శాసనసభలో ఆప్కు ఉన్న భారీ మెజారిటీని అధిగమించడం అంత సులభం కాకపోయినప్పటికీ, చట్టపరమైన లోసుగులను వాడుకుని చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవేళ మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు చీలిపోతే, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. అదే జరిగితే, పంజాబ్లో భగవంత్ మాన్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడం ఖాయం. ప్రస్తుతానికి పంజాబ్ ఆప్ నాయకత్వం అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నప్పటికీ, తెరవెనుక జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన తర్వాత మరిన్ని షాక్లు రాబోతున్నాయి అని వ్యాఖ్యానించడం పంజాబ్ ప్రభుత్వ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయని స్పష్టం చేస్తోంది. రాబోయే కొద్ది రోజులు పంజాబ్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి.
ట్రెండింగ్ వార్తలు






















