Producer K Mahendra Passed Away: టాలీవుడ్లో విషాదం... శ్రీహరిని హీరో, కాజల్ అగర్వాల్ను హీరోయిన్ చేసిన సీనియర్ నిర్మాత కే మహేంద్ర మృతి
Producer K Mahendra Death News: తెలుగు చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ఏఏ ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత కె మహేంద్ర మరణించారు. శ్రీహరిని హీరో చేసింది ఆయన మాదాల రవికి మామగారు కూడా!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎఎ ఆర్ట్స్ అధినేత, సీనియర్ నిర్మాత కే మహేంద్ర (K Mahendra Producer) ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని రమేష్ హాస్పటల్స్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో కన్ను మూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గుంటూరులో ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చి...
ఎఎ ఆర్ట్స్ స్థాపించిన నిర్మాతగా మారిన మహేంద్ర
K Mahendra Wiki: కే మహేంద్ర అసలు పేరు కావూరి మహేంద్ర. ఆయనది గుంటూరు. ఫిబ్రవరి 4, 1946లో జన్మించారు. దర్శకుడు కావాలని అనుకున్నారు. సీనియర్ దర్శకులు కే ప్రత్యగాత్మ, కే హేమాంభరధర రావు దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు. ప్రొడక్షన్ కంట్రోలర్ కింద పలు చిత్రాలకు ఆయన సేవలు అందించారు.
K Mahendra Movies: 'ప్రేమించి పెళ్లి చేసుకో (1977)' సినిమాతో నిర్మాతగా మారారు మహేంద్ర. ఆ తర్వాత 'ఏది పుణ్యం? ఏది పాపం?', 'ఆరని మంటలు', 'తోడు దొంగలు', 'బందిపోటు రుద్రమ్మ', 'ఎదురలేని మొనగాడు', 'ఢాకూరాణి', ప్రచండ భైరవి', 'కనకదుర్గ వ్రత మహాత్మ్యం' తదితర చిత్రాలు మహేంద్ర ప్రొడ్యూస్ చేశారు.
శ్రీహరిని హీరో చేసిన నిర్మాత కే మహేంద్ర
కాజల్ అగర్వాల్ను హీరోయిన్ చేసిందీ ఈయనే!
శ్రీహరి కథానాయకుడు కావడం వెనుక మహేంద్ర ఉన్నారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ 'పోలీస్' ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత శ్రీహరితో 'దేవా', 'ఒక్కడు' సినిమాలు నిర్మించారు. చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమైన నందమూరి కళ్యాణ్ రామ్ - దర్శకుడు తేజల 'లక్ష్మీ కళ్యాణం' నిర్మించిందీ ఈయనే. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా 'అర్జున్', ఊహ నటించిన 'ప్రేమ లేని పుట్టిల్లు', కరోనాకు ముందు పోసాని కృష్ణమురళి నటించిన 'దేశముదుర్లు' సినిమాలు నిర్మించారు మహేంద్ర. రాజశేఖర్ 'అర్జునా' సినిమా ఇంకా విడుదల కాలేదు.
మాదాల రంగారావు వియ్యంకుడే మహేంద్ర
విప్లవ చిత్రాల దర్శకుడు మాదాల రంగారావుకు మహేంద్ర స్వయానా వియ్యంకుడు. మహేంద్ర కుమార్తెను రంగారావు తనయుడు మాదాల రవి వివాహం చేసుకున్నారు. కుమార్తెతో పాటు మహేంద్రకు ఓ కుమారుడు ఉన్నారు. ఆయన పేరు జీతు. కొంత కాలం క్రితం మరణించారు. కుమారుడి మరణం కూడా మహేంద్రను మానసికంగా కుంగదీసిందని సన్నిహితుల సమాచారం.
Also Read: 'పడక్కలం' రివ్యూ: జియో హాట్స్టార్లో మలయాళ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్





















