EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
EVM checking in India | భారత ఎన్నికల చరిత్రలో తొలిసారి ఎన్నికల అనంతరం అభ్యర్థులు, అధికారుల సమక్షంలో EVMలను తనిఖీ చేయనున్నారు. ఈ మేరకు బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది.

ముంబై: దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) తనిఖీ, పరిశీలించేందుకు బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్ ఈవీఎంల పరిశీలనకు ఆదేశాలను జారీ చేశారు. ఈ కేసులో పిటిషనర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి నసీమ్ ఖాన్. ప్రతివాదిగా శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే ఉన్నారు.
అసలేం జరిగిందంటే..
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై శివారు జిల్లాలోని చాందీవలి నుంచి దిలీప్ లాండే (ఏకనాథ్ షిండే వర్గం శివసేన) మాజీ మంత్రి నసీమ్ ఖాన్పై విజయం సాధించారు. ఈ ఎన్నికల అనంతరం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల చోరీపై ఆరోపణలు చేశారు. బాంబే హైకోర్టులో జరిగిన విచారణలో భారత ఎన్నికల కమిషన్ తరపున లాయర్లు నైరా జేజీభాయ్, అరుణ్ పనిక్కర్, తన్మయ్ పవార్, వినయ్ నాయర్, ఆయుష్ యాదవ్ హాజరయ్యారు.
చారిత్రాత్మక ఆదేశం, అవసరమైన న్యాయపరమైన జోక్యం
ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేసిన పిటిషనర్ తరపున ఓటింగ్ మేషిన్ల తనిఖీకి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. భారత ఎన్నికల కమిషన్ 2 నెలల లోపు యంత్రాల పరిశీలనను పూర్తి చేయాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. భారత ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు ఎన్నికల తర్వాత అభ్యర్థులు, అధికారుల సమక్షంలో ఈవీఎంల తనిఖీ జరగలేదని.. ఇదే తొలిసారి అని నసీమ్ ఖాన్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును ఆయన చారిత్రాత్మక ఆదేశం, ప్రజాస్వామ్యంలో అవసరమైన న్యాయపరమైన జోక్యంగా అభివర్ణించారు.
ఏప్రిల్ 16, 17 తేదీల్లో ముంబైలో చెకింగ్
ఏప్రిల్ 16, 17 తేదీల్లో ముంబైలో ఈవీఎం తయారీ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెంగళూరు) ద్వారా కేవలం డయాగ్నోస్టిక్ చెకింగ్ మాత్రమే నిర్వహించనున్నారని ముంబై సబర్బన్ జిల్లా డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ అర్చన కదం తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను తమ తమ నియోజకవర్గాల్లో ఈవీఎం, వీవీప్యాట్ (VVPAT - ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్) యూనిట్ల పరిశీలించేందుకు డిమాండ్ చేయాలని కోరింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా (I.N.D.I.A) కూటమికి చెందిన సుమారు రెండు డజన్ల మంది అభ్యర్థులు ఈవీఎంల విశ్వసనీయతపై ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు ఏప్రిల్ 2024 నాటి తీర్పును ఉటంకిస్తూ.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 శాతం ఈవీఎంల (కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్) "బర్న్ట్ మెమరీ/ మైక్రోకంట్రోలర్"ను ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈవీఎం తయారీ కంపెనీల ఇంజనీర్ల టీమ్ చెక్ చేయాలని నసీమ్ ఖాన్ అన్నారు.
ట్రెండింగ్ వార్తలు























