Bapatla Crime News: వాడరేవు బీచ్లో స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు, బాపట్ల జిల్లాలో విషాదం
Andhra Pradesh News | బాపట్ల జిల్లాలోని వాడరేవు బీచ్లో స్నానానికి వెళ్లిన విట్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.

Vodarevu Beach in Bapatla district | చీరాల: బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చీరాల మండలం వాడరేవు బీచ్ లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్ర స్నానం కోసం వాడరేవు బీచ్కు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నీటిలో మునిగి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అనంతరం కొద్దిసేపటికి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయని తోటి విద్యార్థులు తెలిపారు. ఆ ముగ్గురు తెలంగాణకు చెందిన వారని సమాచారం. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
అమరావతిలోని విట్ యూనివర్సిటికీ చెందిన కొందరు విద్యార్థులు సెలవు రోజు కావడంతో బీచ్లో సరదాగా గడిపేందుకు వాడరేవు బీచ్కు వెళ్లారు. వారిలో సాత్విక్, సోమేష్, సాకేత్, మణిదీప్, గౌతమ్ అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. గల్లంతైన కాసేపటికి సాకేత్, సాత్విక్, మణిదీప్ల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. సోమేష్, గౌతమ్ల ఆచూకీ కోసం వాడరేవు బీచులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మంగినపూడి బీచ్ వద్ద యువకులను కాపాడిన మెరైన్ సిబ్బంది..
మచిలీపట్నం: బందరు రూరల్ మండలం మంగినపూడి బీచ్ వద్ద నీళ్లలో కొట్టుకుపోతున్న నలుగురు యువకుల్ని పోలీసులు, మెరైన్ సిబ్బంది రక్షించారు. ఆదివారం కావడంతో పలు ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులతో మంగినపూడి బీచ్ రద్దీతో కిటికీటలాడుతోంది. సముద్ర తీరా ప్రాంతంలో అలల తాకిడికి కృష్ణాజిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన నలుగురు ముస్లిం యువకులు కొట్టుకుపోయారు. ఇది గమనించిన సబ్ ఇన్స్పెక్టర్ బోస్, మెరైన్ సిబ్బంది సాయంతో నలుగురు యువకుల్ని కాపాడారు. అబ్దుల్ అసిఫ్, ఎస్.కె అర్ఫాద్, ఎస్.కె సికిందర్ షరీఫ్, ఎండి అన్వర్, అనే యువకులను మెరైన్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. మెరైన్ పోలీసులు సకాలంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడినందుకు యువకులు వారికి ధన్యవాదాలు తెలిపారు. యువకులను కాపాడడంలో మెరైన్ పోలీస్ సిబ్బంది చూపించిన ధైర్యసాహసాలను పర్యాటకులు ప్రశంసించారు.






















