Assembly Botsa Chit Chat: చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
Botsa Chit Chat: చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్తే పవన్ కల్యాణ్కు సీఎం పదవి ఇవ్వొచ్చని బొత్స అన్నారు. పెద్ద కులానికి అవకాశం ఇచ్చేందుకు ఇలా చేస్తారని జోస్యం చెప్పారు.

YCP MLC Botsa Chit Chat in Assembly: ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలి చైర్మన్పై కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చూడటంపై బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవిశ్వాసం పెట్టాలంటే ముందు సంఖ్యాబలం ఉండాలి కదా.. నెంబర్ లేకుండా అవిశ్వాసం ఎలా పెడతారు అని ఆయన ప్రశ్నించారు. కేవలం చైర్మన్ను భయపెట్టడానికే ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని, రాజకీయాల్లో తాము ఇలాంటివి ఎన్నో చూశామని కొట్టిపారేశారు. సభలో తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని, అందుకే తాము వాకౌట్ చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు.
లడ్డూ వివాదం.. హెరిటేజ్ - ఇందాపూర్ లింకు
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని బొత్స ఆరోపించారు. హెరిటేజ్ సంస్థకు, ఇందాపూర్ డైరీకి మధ్య సంబంధం ఉందని స్పష్టం చేశారు. బయట మార్కెట్లో హెరిటేజ్ నెయ్యి రూ. 600లకు దొరుకుతుంటే, ఇందాపూర్ డైరీ టీటీడీకి రూ. 658లకు ఎందుకు సరఫరా చేస్తోందని ప్రశ్నించారు. తక్కువ ధరకు ఇచ్చే హెరిటేజ్ నెయ్యిని కల్తీ అనుకోవాలా అని ప్రశ్నించారు. నెయ్యి వివాదం ఎప్పటికి ముగుస్తుందన్న ప్రశ్నకు దేవుడే చూసుకుంటాడు అంటూ నిట్టూర్చారు.
పవన్ కళ్యాణ్ సీఎం పదవిపై విశ్లేషణ
చంద్రబాబు నాయుడు ఒకవేళ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే, రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని బొత్స అభిప్రాయపడ్డారు. పవన్ సీఎం అయితే ఒక పెద్ద సామాజిక వర్గానికి గౌరవం ఇచ్చినట్లు అవుతుందని చంద్రబాబు భావించవచ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఏదైనా చేస్తారు అని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశిస్తూ అలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను గుర్తు చేస్తూనే, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని, జమిలి ఎన్నికల ప్రచారం కారణమంగా సమీకరణాలు మారవచ్చని సూచనప్రాయంగా చెప్పారు.
వైసీపీ బలంపై ధీమా.. అంగన్వాడీలకు మద్దతు
పవన్ కళ్యాణ్ గతంలో రెండు చోట్ల ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఈ రోజే ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాం అని బొత్స ధీమా వ్యక్తం చేశారు. ఇక అంగన్వాడీల సమస్యలపై స్పందిస్తూ.. గతంలో తాము జీతాల పెంపునకు అంగీకరించామని, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Before You Go
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















