Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్ట్ తరువాత విధ్వంసం.. ఆఫీసుకు, కారుకు నిప్పుపెట్టడంతో ఉద్రిక్తత
Ambati rambabu Arrest | గుంటూరులో జరిగిన పాప ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పోలీసులు వైసీపీ నేతను అరెస్ట్ చేశారు.

గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి గుంటూరులోని అంబటి రాంబాబు నివాసం వద్ద పరిస్థితి అదుపు తప్పింది. శనివారం రాత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేయడానికి కొన్ని గంటల ముందు నుంచే జవహర్ నగర్ లోని ఆయన ఇంటికి భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అంబటి నివాసంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అంబటి అరెస్ట్ తరువాత ఆయన ఆఫీసుకు కొందరు అల్లరిమూక నిప్పు పెట్టగా మంటలు వ్యాపించాయి. అనంతరం ఆయన కారుకు సైతం నిప్పుపెట్టి విధ్వంసం సృష్టించారు.
ఆందోళనకారుల దాడిలో అంబటి ఇంటి లోపల ఉన్న ఫర్నీచర్, బయట పార్క్ చేసిన కారు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ, దాడులను అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తల దాడులను అడ్డుకునే ప్రయత్నంలో పలువురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారని పార్టీ నేతలు చెబుతున్నారు.

నిప్పు పెట్టింది మీరే.. టీడీపీ, వైసీపీ పరస్పర విమర్శలు
అంబటి రాంబాబు ఆఫీసు, కారుకు నిప్పు పెట్టింది మీరంటే, మీరే అని టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అయితే మాజీ మంత్రి అంబటి ఇంటికి తొలుత నోటీసులు ఇవ్వడానికి వచ్చిన పోలీసులు, ఆ తర్వాత మళ్ళీ వస్తామని వెళ్లిపోయారు. అంతలోనే టీడీపీ శ్రేణులు దాడులకు దిగడం వెనుక పోలీసుల వైఫల్యం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. కర్రలు, రాడ్లతో లోపలికి దూసుకురావడం, రాళ్ల దాడికి పాల్పడటం చూస్తే తనను హత్య చేసేందుకే ఈ కుట్ర పన్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ దాడిలో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు.

పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై కేసు
మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ రాజకీయ, న్యాయపరమైన ఉచ్చు బిగుసుకుంటోంది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే పిల్లి మాణిక్యాలరావు స్టేట్మెంట్ను పోలీసులు అధికారికంగా రికార్డ్ చేశారు. ప్రస్తుతం అంబటిపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. కాగా, జిల్లాలోని తాడికొండ, దాచేపల్లి, పట్టాభిపురం, మరియు పత్తిపాడు పోలీస్ స్టేషన్లలో కూడా ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పోలీసులు శనివారం రాత్రి అతికష్టమ్మీద అంబటి రాంబాబును అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.
అసలు వివాదం ఏమిటంటే.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జంతువుల కొవ్వు కలవలేదని, కూటమి నేతలే అపచారం చేశారంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా 'పాప ప్రక్షాళన' పూజల కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలో గుంటూరులో జరిగిన ఒక ఆందోళనలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సభ్యసమాజం తలదించుకునేలా బూతులు మాట్లాడారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు అంబటి ఇంటి ముట్టడికి యత్నించగా, ఆ సమయంలోనే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తన ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేశారని అంబటి ఆరోపిస్తుండగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకే ఈ పరిస్థితి వచ్చిందని కూటమి నేతలు పేర్కొంటున్నారు.
























