Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పటికీ.. ఆ టీమ్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం తమ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తులో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి రెండో ఐపీఎల్ టైటిల్ను వైభవ్ సూర్యవంశీయే అందిస్తాడంటూ పరాగ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ 214 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ, గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ తర్వాత మాట్లాడిన పరాగ్.. తాము బ్యాటింగ్లో ఒక 20 పరుగులు తక్కువ చేశామని అన్నాడు. "తొలి ఇన్నింగ్స్లో పిచ్ నుంచి బౌలర్లకు గ్రిప్ లభించింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో హెవీ రోలర్ వేసిన తర్వాత పిచ్ బ్యాటింగ్కు మరింత అనుకూలంగా మారింది. ఈ వికెట్పై 230 లేదా 240 పరుగులు చేసి ఉంటే ప్రత్యర్థికి గట్టి సవాల్ ఇచ్చేవాళ్లం. అలాగే డిఫెండ్ చేసేటప్పుడు ఆరంభంలో మాకు ఓపెనర్ల వికెట్లు దక్కకపోవడం కూడా ఓటమికి కారణం" అని పరాగ్ చెప్పుకొచ్చాడు.
అయితే వైభవ్ సూర్యవంశీ ఆడిన 96 పరుగుల ఇన్నింగ్స్ను పరాగ్ ఆకాశానికెత్తాడు. "వైభవ్ గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. కేవలం హిట్టింగ్ చేయడమే కాదు.. పరిస్థితులకు తగ్గట్టు ప్రతి షాట్ను ఎంతో లెక్కచూసుకుని ఆడాడు. అతను తన కెరీర్లో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. రాజస్థాన్కు రెండో టైటిల్ అందిస్తాడని ఆశిస్తున్నా" అని అన్నాడు. అలాగే తమ జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నా ప్లేఆఫ్స్ చేరడం గొప్ప విషయమన్నాడు.
ట్రెండింగ్ వార్తలు




















