Hyderabad Metro Rail: జనవరి నుంచి మెట్రో ఛార్జీల పెంపు, మళ్లీ ఐదేళ్ల తర్వాతే సవరణకు అవకాశం!
Hyderabad Metro Rail: కొత్త సంవత్సరం నుంచి అంటే వచ్చే జనవరి నెల నుంచి మెట్రో రైలు ఛార్జీలను పెంచబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఛార్జీల పెంపు భారీగానే ఉండనున్నట్లు సమాచారం.
![Hyderabad Metro Rail: జనవరి నుంచి మెట్రో ఛార్జీల పెంపు, మళ్లీ ఐదేళ్ల తర్వాతే సవరణకు అవకాశం! Hyderabad Metro Rail Charges Hike From January 2023, Check Details Hyderabad Metro Rail: జనవరి నుంచి మెట్రో ఛార్జీల పెంపు, మళ్లీ ఐదేళ్ల తర్వాతే సవరణకు అవకాశం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/6cd9dd2522217c3b51b5a03fa539fb491668404519781519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలను వచ్చే ఏడాది అంటే 2023 జనవరి నుంచి పెంచబోతున్నట్లు తెలుస్తోంది. భారీగానే పెంచే అవకాశం అధికంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదండోయ్ భారీగా పెంచి రాయితీలు కూడా ఇస్తారని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు పెంచితే మరో ఐదేళ్ల వరకూ పెంచే అవకాశం లేనందునే భారీగా పెంచబోతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హైదరాబాద్లోని మెట్రో ప్రాజెక్టును పబ్లిక్ - ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో చేపట్టారు కాబట్టి.. ఇక్కడ మెట్రో వ్యవస్థను నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థే నడుపుతోంది. కాబట్టి హైదరాబాద్ మెట్రోకు ‘ఎంఆర్ఏ’గా ఎల్ అండ్ టీనే ఉంది. ఆ మేరకు ఎల్ అండ్ టీ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి రైలు సర్వీసుల ప్రారంభంలో మాత్రమే మెట్రో ఛార్జీలను పెంచే అధికారం ఉంది. ఈ క్రమంలోనే మెట్రో రైలు ఛార్జీల సవరణకు సంబంధించి ప్రజల అభ్యంతరాలు, సూచనలు, సలహాలను అందజేసేందుకు ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే పలు సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీల నుంచి కమిటీకి తపాలా, మెయిల్ ద్వారా లేఖలు అందుతున్నాయి. వీటిని కమిటీ ముందే తెరవబోతున్నారు. హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలు మొదలై ఈ నెలతో ఐదేళ్లు కావొస్తుంది.
ఈ క్రమంలోనే ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ, రాష్ట్రం అభ్యర్థన మేరకు కేంద్రం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి గుడిసేవ శ్యాం ప్రసాద్ ఛైర్మన్ గా, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఐఏఎస్ అధికారి డాక్టర్ సురేంద్ర కుమార్ బగ్దె, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గత నెలాఖరులో హైదరాబాద్ లో సమావేశమైన ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబర్ 15వ తేదీలోగా తెలపాలని బహిరంగ ప్రకటనలో కోరింది. అలాగే ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత అప్పటి వరకు ఇచ్చిన అభ్యంతరాలు, సూచనలను త్రిసభ్య కమిటీ ప్ర్తత్యేకంగా సమావేశమై పరిశీలించనుంది.
ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ ఇచ్చే ఛార్జీల పెంపు ప్రతిపాదనలను పరిశీలించనుంది. నిర్వహణ వ్యయం వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఒక స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించనుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఏ మేరకు ఛార్జీలు పెంచడం సబబో కమిటీ నిర్ణయిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను మూడు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత ఛార్జీలు ఇలా..
మెట్రోలో టిక్కెట్ ప్రస్తుతం కనిష్ఠం రూ.10 గా ఉంది. గరిష్ఠంగా రూ.60గా ఉంది. 2017 నవంబరు 28న మెట్రో సర్వీసులు ప్రారంభమైనప్పుడు ఈ ఛార్జీలను నిర్ణయించి ప్రకటించారు. అప్పట్లో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ ఛార్జీలను నిర్ణయించింది. అప్పుడే ఈ ఛార్జీలు ఎక్కువనే విమర్శలు వచ్చాయి. తాజాగా ధరలు పెంచుతుండడంతో మళ్లీ వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)