Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్లో చంద్రబాబు ధీమా
Chandrababu: భారత్ ప్రపంచ నాలెడ్జ్ ఎకానమీలో అగ్రగామిగా ఉందని, 60 శాతం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఇక్కడే ఏర్పాటవుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో రైసినా డైలాగ్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు.

Chandrababu Naidu addresses India-Raisina Dialogue 2026: ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అంశాలపై చర్చించారు. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. 110 దేశాల నుంచి సుమారు 2,700 మంది మేధావులు, వ్యూహకర్తలు హాజరైన ఈ వేదికపై, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సమక్షంలో చంద్రబాబు నాయుడు భారత్, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ గమనాన్ని ఆవిష్కరించారు.
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్
మూడు దశాబ్దాల క్రితం తాను ప్రారంభించిన ఐటీ విప్లవం నేడు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా నిపుణులను అందించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. భారత్ ప్రస్తుతం ప్రపంచ నాలెడ్జ్ ఎకానమీలో అగ్రగామిగా ఉందని, ప్రపంచంలోని 60 శాతం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) ఇక్కడే ఏర్పాటు కావడం మన ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. యూపీఐ వంటి డిజిటల్ కరెన్సీ సంస్కరణలు భారతదేశ ముఖచిత్రాన్ని మార్చేశాయని, గూగుల్ వంటి దిగ్గజ సంస్థ విశాఖలో 15 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడం శుభపరిణామమని ఆయన గుర్తు చేసుకున్నారు.
అమరావతి - క్వాంటం వ్యాలీ అండ్ బ్లూ-గ్రీన్ సిటీ
భవిష్యత్తు సాంకేతికతపై స్పందిస్తూ, అమరావతిని క్వాంటం వ్యాలీ గా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కేవలం సాంకేతికతనే కాకుండా, క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను తయారు చేసి ప్రపంచానికి అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సైబరాబాద్ను నిర్మించిన అనుభవంతో, ఇప్పుడు అమరావతిని కాలుష్య రహిత బ్లూ-గ్రీన్ సిటీగా, టెక్నాలజీ , ఇన్ఫ్రాస్ట్రక్చర్ల అద్భుత మిశ్రమంగా నిర్మిస్తున్నానని తెలిపారు. ప్రపంచ స్థాయి కంపెనీలను భారతీయులే నడిపిస్తున్న తరుణంలో, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
Delhi: At Raisina Dialogue 2026, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu says, "We are all seeing now, IT, nobody believed at that time, this is only three decades long. At that time, when I started IT, my opponents, my opposition parties used to attack me. People want… pic.twitter.com/OpF9Lulg1D
— IANS (@ians_india) March 7, 2026
ఏఐ , భవిష్యత్ నగరాలు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచ గతిని మార్చే 'గేమ్ చేంజర్' అని చంద్రబాబు అభివర్ణించారు. ఏఐ , క్వాంటం కంప్యూటింగ్ వినియోగంపైనే దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, అందుకే ఏపీలో ఏఐ ఆల్గారిథమ్స్ , ట్రైనింగ్ కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేవలం ఐటీకే పరిమితం కాకుండా.. అమరావతిలో 9 రకాల వినూత్న నగరాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే డ్రోన్ అంబులెన్స్లు రియాలిటీగా మారబోతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రివర్స్ మైగ్రేషన్ - గ్రీన్ ఎనర్జీ
గతంలో భారతీయ మేధావులు సిలికాన్ వ్యాలీకి తరలివెళ్లారని , అయితే ఇప్పుడు పరిస్థితులు మారి రివర్స్ మైగ్రేషన్ మొదలవుతోందని ముఖ్యమంత్రి విశ్లేషించారు. నిపుణులు ఉన్న చోటికే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని, దూరంతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచైనా పనిచేసే వీలుందని చెప్పారు. అలాగే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని, ఏపీలో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే భారత్ విద్యుత్ను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జనాభా నిర్వహణలో నూతన విధానం
సదస్సులో అత్యంత ఆసక్తికరమైన అంశం జనాభాపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. గతంలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తాను, ఇప్పుడు ఏజింగ్ సమస్యను గుర్తించి జనాభా వృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఫెర్టిలిటీ రేటును 1.5 నుంచి 2.1కి పెంచేలా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ని రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా మూడో బిడ్డ పుడితే రూ.25 వేల ఆర్థిక సాయం, నెలవారీ ప్రోత్సాహకాలు, చైల్డ్ కేర్ లీవ్స్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. మైక్రో ఫ్యామిలీల నుంచి మళ్ళీ పెద్ద కుటుంబ వ్యవస్థ వైపు ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ప్రపంచంలో భారతీయులే అత్యుత్తమ డిప్లమాట్లు. వారు ఎక్కడికి వెళ్లినా స్థానికులతో కలిసిపోయి ప్రపంచ సంక్షేమానికి సేవలు అందిస్తారు అని చంద్రబాబు ప్రశంసించారు. సహకార ఫెడరలిజం ద్వారా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మేధావులు, వ్యూహకర్తల నుంచి వచ్చే అత్యాధునిక ఆలోచనలను అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సదస్సులో స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















