Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
Modi Shah Strategy : తృణమూల్ కాంగ్రెస్ చీలిక ఎంపీలు ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించడంతో జాతీయ రాజకీయాల్లో నెంబర్ గేమ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ పరిణామం చంద్రబాబు నాయుడి ప్రాధాన్యతను తగ్గిస్తుందా?

National Politics Number Game 2026: జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నగ్న సత్యాన్ని నిరూపిస్తూ పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన సుమారు 20 మంది రెబల్ ఎంపీలు కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించడం సరికొత్త సంచలనానికి తెరలేపింది. వారు ఎన్డీయేలో అధికారికంగా విలీనమవుతారా లేక బయట నుండి మద్దతు ఇస్తారా అనేది పక్కన పెడితే.. కేంద్ర ప్రభుత్వానికి 20 మంది ఎంపీల అదనపు బలం లభించడం ఖాయమైంది. ఈ పరిణామం ఢిల్లీ పీఠాన్ని మరింత సుస్థిరం చేయడమే కాకుండా, కూటమిలోని ఇతర ప్రాంతీయ పార్టీలపై, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రాధాన్యతపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
తృణమూల్ చీలిక ఎంపీల మద్దతుగా బీజేపీకి మరింత లాభం
కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేని ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రభుత్వ మనుగడకు చంద్రబాబు , నితీష్ కుమార్ అత్యంత కీలకంగా మారారు. కింగ్ మేకర్లుగా ఉన్న వీరిద్దరి డిమాండ్లకు లొంగుతూనే మోదీ-షా ద్వయం ఇన్నాళ్లూ బండిని లాగాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఊహించని విధంగా 20 మంది ఎంపీల మద్దతు లభించడంతో కేంద్రంలో ఎన్డీయే నెంబర్ గేమ్ పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు , నితీష్ కుమార్ లలో ఎవరైనా ఒకరు మద్దతు ఉపసంహరించుకున్నా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదనే బలమైన భరోసా ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి దక్కింది. ఈ సమీకరణం సహజంగానే కూటమిలో బీజేపీ బేరసారాల శక్తిని పెంచుతుంది. లోక్సభలో అదనంగా 20 మంది ఎంపీల బలం తోడవడంతో.. మిత్రపక్షాల వీటో పవ గణనీయంగా తగ్గింది. ఇది మోదీ, అమిత్ షాలకు రాజకీయంగా పెద్ద ఊరట.
ఇకపై ఢిల్లీలో చంద్రబాబు మాట చెల్లుబాటు కాదా? ప్రాధాన్యత తగ్గుతుందా?
ఈ అనుమానాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేం కానీ, గతంలో ఉన్నంత లీవరేజ్ మాత్రం ఇకపై ఉండకపోవచ్చు. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిధులు, పోలవరం బడ్జెట్, అమరావతి గ్రాంట్ల విషయంలో చంద్రబాబు కేంద్రంపై గతంలో చూపించినంత ఒత్తిడిని ఇకపై ప్రదర్శించడం అంత సులువు కాదు. ఎందుకంటే, కేంద్రంపై ఒత్తిడి మితిమీరితే.. ప్రత్యామ్నాయంగా తమకు టీఎంసీ ఎంపీల మద్దతు ఉందనే సంకేతాన్ని మోదీ, షా ఇవ్వడానికి వెనుకాడరు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల దీర్ఘకాలిక ఆలోచనలు వేరేలా ఉన్నాయి. వారు చంద్రబాబును అంత తేలికగా దూరం చేసుకోరని ఇండస్ట్రీ ఇన్సైడర్స్ అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు ఒత్తిడి చేయరు.. వారు దూరం చేసుకోరు!
చంద్రబాబు నమ్మకమైన, క్రమశిక్షణ కలిగిన మిత్రపక్షంగా ఉన్నారు. దానికి భిన్నంగా, పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్న టీఎంసీ ఎంపీల మద్దతు తాత్కాలిక అవసరాల కోసమో, మమతా బెనర్జీతో విభేదాల వల్లో పుట్టుకొచ్చిందే తప్ప, సిద్ధాంతపరమైనది కాదు. రేపు ఏదైనా తేడా వస్తే వారు మళ్లీ ప్లేట్ మార్చే ప్రమాదం ఉంది. కాబట్టి, నమ్మకమైన చంద్రబాబును పూర్తిగా పక్కన పెట్టి, అస్థిరమైన టీఎంసీ శ్రేణులపై బీజేపీ పూర్తిగా ఆధారపడే సాహసం చేయదు. ఈ జాతీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ అంతర్గత రాజకీయాలపై కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ అంశాన్ని అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.
చంద్రబాబు ప్రభావం తగ్గుతుందని వైసీపీ భావన
ఇకపై ఢిల్లీలో చంద్రబాబును మోదీ ప్రభుత్వం పట్టించుకోదు అంటూ ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించింది. అయితే, చంద్రబాబుకు ఉన్న ఇమేజ్, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనకు ఉన్న విజన్ దృష్ట్యా.. ఆయన కేంద్రంతో ఘర్షణ వైఖరి పెట్టుకోకుండా, మరింత చాకచక్యంగా దౌత్యనీతిని ఉపయోగించి ఏపీకి రావలసిన హక్కులను సాధించుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీఎంసీ ఎంపీల మద్దతు వల్ల ఎన్డీయే కూటమిలో బీజేపీ సీటు కాస్త గట్టిపడిందనేది పచ్చి నిజం. చంద్రబాబుపై ఆధారపడే పరిస్థితి గతంతో పోలిస్తే మోదీ-షాలకు కాస్త తగ్గింది. కానీ, పారదర్శకమైన పాలనలో చంద్రబాబు వంటి సీనియర్ లీడర్ భాగస్వామ్యం ఎన్డీయే ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్ వాల్యూని ఇస్తుంది. కాబట్టి చంద్రబాబు హోదాను తగ్గించడం కంటే.. మిత్రపక్షాలన్నింటినీ సమతూకం చేస్తూనే, తమ సొంత ఎజెండాను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికే మోదీ-షా ద్వయం ఈ కొత్త నెంబర్లను వాడుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















