Constitutional Amendment Bills: రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజార్టీ లేని ఎన్డీఏ- బీజేపీ దగ్గర ప్లాన్ బీ ఉందా ?
BJP: ప్రస్తుత లోక్సభ , రాజ్యసభల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3వ వంతు మెజార్టీ లేదు. కాంగ్రెస్ కూటమి మద్దతివ్వాల్సిందే. మరి ఎన్డీఏ ప్లాన్ బీ ఏమిటి?

What is BJP plan B : మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో అతిపెద్ద చదరంగం లా మారాయి. వీటి అమలుకు రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. జోరుగా చర్చ జరుగుతోంది. ఓటింగ్ కూడా జరగబోతోంది. అయితే ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం. ఈ బిల్లులు ఆమోదించడానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఏమిటన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
పార్లమెంటులో బలాబలాలు - రాజ్యాంగ సవరణ సవాలు
ప్రస్తుత లోక్సభ , రాజ్యసభల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3వ వంతు మెజార్టీకి స్వల్ప దూరంలో ఉంది. లోక్సభలో ఎన్డీయేకు సుమారు 300 పైచిలుకు సీట్లు ఉండగా, రాజ్యాంగ సవరణకు దాదాపు 360కి పైగా ఓట్లు అవసరం. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. అంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మద్దతు అవసరమే. అలాగే వైఎస్సార్సీపీ, బీజేడీ వంటి తటస్థ పార్టీల సంపూర్ణ సహకారం లేకుండా ఈ బిల్లులు గట్టెక్కడం అసాధ్యం. సాధారణంగా ఇలాంటి కీలక బిల్లులపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది. కానీ, కేంద్రం ఈ విషయంలో కొంత వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. విపక్షాలపై ఒత్తిడి పెంచడమే. మహిళా రిజర్వేషన్ బిల్లును నేరుగా సభలో ప్రవేశపెట్టి, ఒకవేళ విపక్షాలు దానిని అడ్డుకుంటే, వారు మహిళా వ్యతిరేకులు అనే ముద్ర వేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే, చర్చల కంటే రాజకీయ పైచేయి సాధించడమే ఇక్కడ ప్రధమ లక్ష్యంగా కనిపిస్తోంది.
బలాబలాల పరిస్థితి
ప్రస్తుతం లోక్సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా, సాధారణ మెజార్టీకి 272 ఓట్లు సరిపోతాయి. కేంద్రంలోని ఎన్డీయే కూటమికి సుమారు 293 నుండి 300 మంది సభ్యుల మద్దతు ఉండటంతో ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లులు నెగ్గాలంటే సభకు హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే అందరూ హాజరైతే సుమారు 362 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు ఉన్న బలం కంటే ఇది దాదాపు 60 నుండి 70 ఓట్లు తక్కువ. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 234 స్థానాలు ఉండటంతో, వారి మద్దతు లేకుండా లోక్సభలో రాజ్యాంగ సవరణ చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఎగువ సభ అయిన రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 164 ఓట్లు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి నామినేటెడ్ సభ్యులతో కలిపి సుమారు 115 నుండి 120 ఓట్ల బలం ఉంది. ఇక్కడ కూడా 2/3వ వంతు మెజార్టీకి మరో 45 నుండి 50 ఓట్ల లోటు కనిపిస్తోంది. ఇండియా కూటమికి సుమారు 90 ఓట్లు ఉండటంతో, కీలక బిల్లుల విషయంలో రాజ్యసభలో విపక్షాలదే పైచేయి అయ్యే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీ, బీజేడీ వంటి తటస్థ పార్టీలు మద్దతు ఇచ్చినా, విపక్షాల పూర్తి సహకారం లేనిదే మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం కష్టమే.
నిర్ణయాత్మక శక్తిగా విపక్షాలు
ప్రస్తుత బలాబలాల ప్రకారం, మహిళా రిజర్వేషన్ లేదా డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులను ఏకపక్షంగా ఆమోదించుకునే పరిస్థితిలో కేంద్రం లేదు. రాజ్యాంగ సవరణ జరగాలంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూటమిలోని ఇతర పెద్ద పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి వాటితో కేంద్రం చర్చలు జరపాల్సి ఉంటుంది. ఒకవేళ విపక్షాలు పట్టుబట్టి వ్యతిరేకిస్తే బిల్లులు వీగిపోయే ప్రమాదం ఉంది. ఈ గణంకాలను గమనిస్తే, కేంద్రం ముందు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి విపక్షాలతో ఏకాభిప్రాయానికి వచ్చి బిల్లును పాస్ చేయడం, రెండు బిల్లును సభలో ప్రవేశపెట్టి విపక్షాలు అడ్డుకుంటే ఆ నిందను వారిపైనే వేసి రాజకీయ లబ్ధి పొందడం. సాధారణంగా రాజ్యాంగ సవరణకు సభకు హాజరైన వారిలో 2/3వ వంతు మెజార్టీ ఉండాలి కాబట్టి, ఒకవేళ విపక్షాలు వాకౌట్ చేసినా లేదా సభకు రాకపోయినా, అప్పుడు సభలో ఉన్న సభ్యుల సంఖ్య తగ్గుతుంది. తద్వారా 2/3వ వంతు కోటాను అందుకోవడం ప్రభుత్వానికి సులభమవుతుంది. అయితే, ఇంతటి కీలక బిల్లుల విషయంలో విపక్షాలు సభలోనే ఉండి ఓటింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
కాంగ్రెస్ తీరు - క్రెడిట్ వర్సెస్ కండిషన్స్
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మేము మహిళా రిజర్వేషన్లకు అనుకూలం, కానీ అందులో ఓబీసీ కోటా ఉండాలి అనే డిమాండ్ను బలంగా వినిపిస్తోంది. ఒకవేళ బిల్లు వీగిపోతే, కేంద్రం తనపై నింద వేస్తుందని గ్రహించిన కాంగ్రెస్, ముందస్తుగానే తన వాదనను సిద్ధం చేసుకుంది. బీజేపీకి చిత్తశుద్ధి లేదు, అందుకే ఓబీసీలను పక్కన పెట్టింది అని ఎదురుదాడి చేయడానికి రాహుల్ గాంధీ నేతృత్వంలోని బృందం ప్రణాళికలు రచిస్తోంది. అంటే, ఈ బిల్లు ఇప్పుడు ఒక రాజకీయ ట్రాప్ గా మారింది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సమస్య మరింత జటిలంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ సవరణ జరగకపోతే, పాత పద్ధతిలోనే జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాల్సి ఉంటుంది, అది దక్షిణాదికి నష్టం చేస్తుంది. ఈ పరిస్థితిని సాకుగా చూపి, విపక్షాలు అడ్డుకుంటున్నాయని, అందుకే తాము ఏమీ చేయలేకపోతున్నామని ప్రజలకు చెప్పడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ప్లాన్?
కేంద్రం ఈ బిల్లులను ఆల్ ఆర్ నథింగ్ అనే ధోరణితో ముందుకు తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రాజ్యసభలో లేదా లోక్సభలో మెజార్టీ లేక బిల్లు ఆగిపోతే, ఆ నిందను పూర్తిగా కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలపై నెట్టివేసేందుకు బీజేపీ ఐటీ సెల్ , ప్రచార యంత్రాంగం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లు సమాచారం. తద్వారా రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్ల సానుభూతిని పొందవచ్చనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ , డీలిమిటేషన్ అంశాలు రాజకీయ ఎజెండాగా ఎక్కువగా మారుతున్నాయి. కేంద్రం ఏకాభిప్రాయం కోసం కాకుండా, విపక్షాలను ఇరకాటంలో పెట్టేందుకు ఈ బిల్లులను అస్త్రాలుగా వాడుకుంటుందన్న వాదనలో బలం కనిపిస్తోంది. ఒకవేళ బిల్లులు పాస్ కాకపోతే, పార్లమెంటులో రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ కంటే, వీధి పోరాటాల్లో నిందారోపణల పర్వమే ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















