TDP MLAs Dissatisfaction: టీడీపీ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకుపోతున్న అసంతృప్తి - బయటపడుతున్న వారు కొందరే - హైకమాండ్ గుర్తించదా?
TDP Cadre: టీడీపీ ఎమ్మెల్యేల్లో ఓ రకమైన అసంతృప్తి పెరిగిపోతోంది. ఇది అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల గురించి కాదు.. కేవలం పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం.. వైసీపీ నేతలకు ప్రోత్సాహం లభించడం గురించే!

Chandrababu Naidu MLA Review: ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పటిష్టమైన పాలనపై దృష్టి పెట్టినప్పటికీ, తెరవెనుక పార్టీ ఎమ్మెల్యేలలో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు అధిష్ఠానానికి సరికొత్త సవాల్గా మారుతోంది. అయితే, ఈ అసంతృప్తికి ప్రభుత్వంపై వ్యతిరేకత కానీ, నిధుల కొరత కానీ కారణం కాకపోవడం ఇక్కడ అసలు ట్విస్ట్. క్షేత్రస్థాయిలో తమకు దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను, ప్రత్యర్థులను ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతీయకపోగా, అయాచితంగా కొన్ని నిర్ణయాల వల్ల వారు మరింత బలోపేతం అవుతుండటమే ఈ అసంతృప్తికి ప్రధాన కారణం.
బయటపడిన గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు
ఈ అంతర్గత అసహనానికి తాజా ఉదాహరణగా గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు నిలిచారు. గన్నవరం నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కేడర్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులకు, ఆయనకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థకు గన్నవరం ఎయిర్పోర్ట్ టెర్మినల్ పెండింగ్ పనుల కాంట్రాక్ట్ దక్కడంపై వెంకట్రావు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమ కళ్ల ముందే ప్రత్యర్థులు ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా మళ్లీ ఆర్థికంగా పుంజుకుంటుంటే, నియోజకవర్గంలో తమ రాజకీయ ఉనికి ఏమవాలనే ఆందోళన ఆయనను బహిరంగంగానే మాట్లాడేలా చేసింది.
చెప్పుకోలేని ఎంతో మంది ఎమ్మెల్యేలు
వెంకట్రావు లేవనెత్తిన ఈ అంశం కేవలం గన్నవరానికి మాత్రమే పరిమితం కాలేదు, రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేల అంతర్గత సమస్య ఇదేనని పొలిటికల్ సర్కిల్స్ లో విశ్లేషణలు సాగుతున్నాయి. గత ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర అణచివేతకు గురై, ఆస్తులు నష్టపోయి, పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలపై నమోదైన పాత కేసులు ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు. ఒకవైపు సొంత కేడర్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు ప్రత్యర్థి పార్టీ నేతలు అధికార యంత్రాంగంలోని కొందరు అధికారుల అండతో యథేచ్ఛగా తమ వ్యాపారాలను, ఆర్థిక సామ్రాజ్యాలను కాపాడుకోవడం ఎమ్మెల్యేలకు మింగుడుపడటం లేదు.
ప్రత్యర్థులు ఆర్థికంగా బలపడితే తమకే నష్టమని ఎమ్మెల్యేల భయం
అధికారంలోకి వచ్చిన కొత్తలో సహజంగానే అధికారులు పాత కాంట్రాక్టర్ల పెండింగ్ పనులను క్లియర్ చేయడం, సాంకేతిక కారణాల వల్ల పాత సంస్థలకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంటుంది. కానీ, రాజకీయ క్షేత్రంలో ఇది తప్పుడు సంకేతాలు పంపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయకపోతే, వారు రాబోయే రోజుల్లో మళ్లీ పుంజుకుని తమపైకే రాజకీయంగా దాడికి వస్తారనే భయం టీడీపీ ఎమ్మెల్యేలలో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారుల నిర్ణయాలు తమ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని వారు అంతర్గత సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేల గోడు వినలేకపోతున్న టీడీపీ హైకమాండ్
ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణ, పాలనాపరమైన సంస్కరణలపైనే పూర్తి దృష్టి పెట్టిన టీడీపీ హైకమాండ్కు, సొంత పార్టీ శాసనసభ్యుల మనోభావాలను , క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలను గమనించడానికి తగినంత తీరిక లేనట్లు కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే భావన కేడర్లో బలపడితే, అది రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఇమేజ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు నేరుగా అసెంబ్లీ లోపల లేదా బహిరంగ వేదికలపై అసంతృప్తిని వెళ్లగక్కకముందే అధిష్ఠానం జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. టీడీపీ అగ్రనాయకత్వం ఈ తీవ్రతను గుర్తించి, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సమస్యలను ఆలకించకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. బ్యూరోక్రసీ తీసుకునే నిర్ణయాలు పార్టీ రాజకీయ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారకుండా ఒక స్పష్టమైన కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ సీనియర్ నేతలు అనుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















