YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
YSRCP: వైఎస్ జగన్ బెంగళూరులో ఉంటూ ఏపీపై కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. తాడేపల్లిలో ఇల్లు ఉండగా జగన్ బెంగళూరుకు ఎందుకు మకాం మార్చారు?

YS Jagan Bengaluru: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదేపదే బెంగళూరు పర్యటనలు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కవగా బెంగళూరులోని తన నివాసంలోనే ఉంటున్నారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా బెంగళూరు ప్యాలెస్లో ఉంటూ కూటమి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని, అక్కడ ఆయనకు అంత కీలకమైన పని ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
వీకెండ్ లో మాత్రమే వెళ్తున్నారన్న వైసీపీ
ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకుడు పక్క రాష్ట్రంలో ఉండి రాజకీయం చేయడం ఏంటని, ఇది ప్రజలను బాధ్యతారాహిత్యంగా వదిలేయడమేనని అధికార పక్షం ఆరోపిస్తోంది. ఈ విమర్శలను వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గట్టిగా తిప్పికొడుతున్నారు. వీకెండ్లో బెంగళూరు వెళ్తే తప్పేంటని, అక్కడ జగన్ కి కుటుంబం, వ్యక్తిగత పనులు ఉంటాయని ఆయన సమర్థిస్తున్నారు. జగన్ ఎక్కడ ఉన్నా ఏపీ ప్రజల కోసమే ఆలోచిస్తారని, కుట్రలు చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదని అంబటి స్పష్టం చేశారు. అయితే, ఒక ప్రధాన ప్రతిపక్ష నేత నిరంతరం రాష్ట్రం వెలుపల ఉండటం వల్ల క్యాడర్లో నైతిక స్థైర్యం తగ్గుతుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
అమరావతిలో సర్వ హంగులతో జగన్ నివాసం
నిజానికి, అమరావతిలోని తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డికి సర్వ హంగులతో కూడిన నివాసం, కార్యాలయం ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి నుంచే ఆయన పరిపాలన సాగించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అక్కడే ఉండి క్షేత్రస్థాయి రాజకీయాలు నడిపిస్తే పార్టీకి మరింత మైలేజీ వస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండటం, బాధితులను పరామర్శించడం వంటి కార్యక్రమాలు రాజధాని ప్రాంతం నుంచే సులభతరం అవుతాయని, బెంగళూరు పర్యటనలు ఆ దూరాన్ని పెంచుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
పక్క రాష్ట్రంలో ఎక్కువగా ఉంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు
బెంగళూరు నివాసం జగన్కు వ్యక్తిగత సౌకర్యాన్ని ఇవ్వవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో స్థానికత అనేది అత్యంత కీలకమైన అంశం. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి రాజకీయం చేస్తున్నప్పుడు జగన్ హైదరాబాద్ వాసి అని ప్రశ్నించిన సందర్భాలను టీడీపీ ఇప్పుడు గుర్తు చేస్తోంది. ఇప్పుడు అదే పరిస్థితిని జగన్ ఎదుర్కొంటున్నారు. ఏపీలో సొంత ఇల్లు, బలమైన కేడర్ ఉన్నప్పుడు ఆయన బెంగళూరుకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారనేది సామాన్య ప్రజల్లో కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది.
వైసీపీ పుంజుకోవాలన్నా ఏపీలో ఉండాల్సిందే!
ప్రస్తుత కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉన్నందున వైసీపీ తిరిగి పుంజుకోవాలంటే నాయకత్వం నిరంతరం ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం ఉందని వైసీపీ వర్గాలుభావిస్తున్నాయి. బెంగళూరు పర్యటనల వల్ల వచ్చే గ్యాప్ ను అధికార పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. జగన్ తన రాజకీయ కేంద్రస్థానాన్ని పూర్తిస్థాయిలో ఏపీకే పరిమితం చేస్తే, విమర్శలకు చెక్ పడటమే కాకుండా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రజలు చూసే విధానం అనేది ఫలితాలను శాసిస్తుంది కాబట్టి జగన్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.






















