Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
Political Strategy: బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయాలంటే ముందుగా ఆ పార్టీ పిల్లర్ల వంటి నేతల్ని సొంత నియోజకవర్గాల్లో బలహీనం చేయాలి. ఈ ప్లాన్ ను రేవంత్ అమలు చేయడం ప్రారంభించారు. కానీ అంత తేలిక కాకపోవచ్చు.

Revanth Political Strategy On BRS : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వ్యూహాత్మకంగా బలహీనం చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన మొదటగా ఆ పార్టీ ముఖ్యనేతలను బలహీనం చేయాలనుకుంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కంచుకోటలను బద్దలు కొట్టాలనుకుంటున్నారు. సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల ఈ మూడు కేవలం నియోజకవర్గాలు మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ కోటలనే లక్ష్యంగా చేసుకుని, గులాబీ దళపతులైన హరీష్ రావు, కేసీఆర్, , కేటీఆర్లను రాజకీయంగా బలహీనపరిచేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
మూడు నియోజకవర్గాలపై రేవంత్ ప్రత్యేక దృష్టి
తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల సొంత నియోజకవర్గాల్లో ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. సిద్ధిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం దీనికి స్పష్టమైన సంకేతం. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటలో అడుగుపెట్టిన రేవంత్, అక్కడ అభివృద్ధిలో లోపాలను ఎత్తిచూపుతూనే, రాజకీయంగా ఆధిపత్యం సాధించేందుకు పావులు కదుపుతున్నారు. కేవలం గెలవడమే కాదు, ప్రత్యర్థి నాయకత్వాన్ని స్థానికంగా దెబ్బతీయాలన్నది రేవంత్ మాస్టర్ ప్లాన్. రేవంత్ రెడ్డి అనుకుంటున్నంత సులభంగా ఈ మూడు నియోజకవర్గాల్లో మార్పు రావడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ నియోజకవర్గాల్లో పార్టీ కాదు.. నాయకత్వమే బలం!
సిద్ధిపేటలో హరీష్ రావుకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్, గజ్వేల్లో కేసీఆర్ పట్ల ఉన్న సెంటిమెంట్, సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఆ నాయకులను ప్రజలకు దగ్గర చేశాయి. ఈ ముగ్గురూ తమ నియోజకవర్గాల్లో కేవలం రాజకీయ నాయకులుగానే కాకుండా, కుటుంబ సభ్యులుగా స్థిరపడిపోయారు. వారిని ఢీకొనాలంటే కేవలం అధికార బలం సరిపోదు, అంతకు మించిన ప్రజాదరణ ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు ఉండాలి. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం. సిద్ధిపేటలో హరీష్ రావుకు దీటైన నాయకుడు కానీ, సిరిసిల్లలో కేటీఆర్ను అడ్డుకోగల చరిష్మా ఉన్న నేత కానీ ప్రస్తుతం కాంగ్రెస్లో కనిపించడం లేదు.
కాంగ్రెస్కు మాస్ లీడర్ల కొరత
ద్వితీయ శ్రేణి నాయకత్వం బలపడకుండా, కేవలం పైస్థాయి నుంచి చేసే విమర్శలు ఓట్లుగా మారవు. స్థానిక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, బీఆర్ఎస్ అగ్రనేతల ప్రభావాన్ని తగ్గించగలిగే మాస్ లీడర్ల అవసరం కాంగ్రెస్కు ఉంది. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. గతంలో ఇంద్రుడిలా వెలిగిన ఎందరో అగ్రనేతలు తమ సొంత గడ్డపైనే ఓటమి పాలైన చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డి వ్యూహం ప్రకారం.. ప్రభుత్వ పథకాలను ఈ నియోజకవర్గాల్లో సమర్థవంతంగా అమలు చేస్తూ, బీఆర్ఎస్ కేడర్ను ఆకర్షించడం ద్వారా ఆ కోటలను బీటలు వారేలా చేయవచ్చు. ముఖ్యంగా అభివృద్ధి పనుల్లో వివక్ష చూపుతున్నారనే ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం రేవంత్ ముందన్న సవాలు.
రేవంత్ రాజకీయాన్ని తక్కువ అంచనా వేయలేం!
రేవంత్ రెడ్డి సంకల్పం గట్టిగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వాన్ని మర్చిపోయేలా చేసే స్థాయి ఉన్న నేతలు స్థానికంగా ఎదిగితేనే కాంగ్రెస్కు అక్కడ భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ను బలోపేతం చేయగలిగితే, అది తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద మలుపు అవుతుంది. ఇప్పటికే అక్కడ బలమైన నేతల్ని గుర్తించి ప్రోత్సహించే వ్యూహాన్ని రేవంత్ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో బలమైన పోటీ ఇచ్చే అభ్యర్థుల్ని రెడీ చేసుకున్నా అది బీఆర్ఎస్ పార్టీ వ్యూహాల్లో కీలకమైన మార్పులు తెస్తుంది. మరి రేవంత్ రాజకీయం ఈ సారి ఆయన వ్యూహాలకు తగ్గట్లుగా సాగుతుందా?
























