Make In Andhra Pradesh: ఏపీ ఇన్వెస్ట్మెంట్ ఇంజిన్ నారా లోకేష్ - ఎంవోయూలే కాదు గ్రౌండింగ్ వరకు ప్రయత్నం - ఏపీ పారిశ్రామిక మ్యాప్ను మార్చేస్తున్నట్లేనా?
AndhraPradesh Development: ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో నారా లోకేష్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎంవోయూలతో సరి పెట్టుకోకుండా..గ్రౌండింగ్ అయ్యే వరకూ ఫాలో అప్ చేస్తున్నారు.

AP Ease Of Doing Business : మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్.. మేడ్ ఫర్ ది వరల్డ్ మంత్రి నారా లోకేష్ కాన్సెప్ట్ ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ పారిశ్రామిక స్వప్నం దాగి ఉంది. కేవలం రెండేళ్ల కాలంలోనే రాష్ట్రానికి మొబైల్స్, ఎయిర్ కండిషనర్లు, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో అగ్రగామి సంస్థలను రప్పించడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీని, ఇప్పుడు గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడంలో లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న పెట్టుబడుల వేట ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది.
పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యే వరకూ ఫాలో అప్
రాజకీయాల్లో క్రెడిట్ తీసుకోవడం ఒక ఎత్తైతే, ఆ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో అమలు చేయడం మరో ఎత్తు. లోకేష్ ఈ విషయంలో విభిన్నమైన శైలిని అవలంబిస్తున్నారు. ఎంఓయూ కుదుర్చుకున్నాక ఫైళ్లను పక్కన పెట్టేయకుండా, స్వయంగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచుతున్నారు. అందుకే ఇప్పుడు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది నాణ్యతకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఇన్వెస్ట్ ఇండియా వంటి సంస్థల నివేదికల ప్రకారం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మళ్లీ ముందంజలో నిలవడానికి లోకేష్ అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రధాన కారణం.
పారిశ్రామిక రంగంలో లోకేష్ చూపిస్తున్న చొరవ వెనుక ఒక స్పష్టమైన విజన్ కనిపిస్తోంది. కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా, మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ను బలోపేతం చేయడం ద్వారా బహుళజాతి సంస్థలను ఏపీ వైపు ఆకర్షిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరగడమే కాకుండా, స్థానిక యువతకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే ఉపాధి లభిస్తోంది. ముఖ్యంగా శ్రీసిటీ, అనంతపురం వంటి క్లస్టర్లను ఆయన గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దుతున్నారు.
రాజకీయ విమర్శలకు గట్టి కౌంటర్లు
ఈ ప్రస్థానంలో రాజకీయ విమర్శలు లేకపోలేదు. కేవలం గతంలో వచ్చిన కంపెనీలకే తాము ప్రారంభోత్సవాలు చేస్తున్నామని విపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ, లోకేష్ మాత్రం లెక్కలతో సహా సమాధానం ఇస్తున్నారు. కొత్తగా వచ్చిన పెట్టుబడులు ఎన్ని? వాటి ద్వారా వచ్చిన ఉద్యోగాలెన్ని? అనే డేటాను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నారు. ఈ పారదర్శకత ఇన్వెస్టర్లలో భరోసాను నింపుతోంది. టాటా, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ఆయన జరుపిన చర్చలు ఏపీకి భారీ పెట్టుబడులను తీసుకు వచ్చాయి.
ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ మినిస్టర్
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి లోకేష్ తన పనితీరుతో ప్రత్యర్థులకు కూడా సవాల్ విసురుతున్నారు. గతంలో విమర్శించిన వారే ఇప్పుడు ఆయన డైనమిక్ నాయకత్వాన్ని మెచ్చుకునే స్థాయికి ఎదిగారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కార్పొరేట్ తరహాలో పరుగులు పెట్టించడం లోకేష్కు మాత్రమే సాధ్యమైందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమం సాగుతున్నా, మరోపక్క అభివృద్ధిని ఏమాత్రం విస్మరించకుండా సమతుల్యత పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ , పారిశ్రామిక ముఖచిత్రంలో నారా లోకేష్ ఒక గేమ్ ఛేంజర్ గా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు రండి.. ప్రపంచానికి ఉత్పత్తి చేయండి అనే ఆయన పిలుపు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిధ్వనిస్తోంది. రాబోయే కాలంలో ఏపీ కేవలం ఒక రాష్ట్రంగానే కాకుండా, ప్రపంచానికి ఒక మ్యాన్యుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్గా ఎదిగితే, ఆ ఘనతలో సింహభాగం లోకేష్ కష్టానికే దక్కుతుందని చెప్పుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















