Phone tapping case: కేసీఆర్ విచారణకు హాజరు అనుమానమే - న్యాయపోరాటం చేసే చాన్స్
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై కేసీఆర్ న్యాయపోరాటం చేసే అవకాశం కనిపిస్తోంది. తన రిప్లయ్లో ప్రస్తావించిన అనేక అంశాల ఆధారంగానే కోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన బీఆర్ఎస్ పెద్దలు చేస్తున్నారు.

KCR likely to fight legal battle: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ప్రత్యేక విచారణ బృందం మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు స్థలం సమయం చుట్టూ తిరుగుతున్న ఒక పెద్ద న్యాయపరమైన పోరాటంగా మారింది. సిట్ అధికారులు ఫిబ్రవరి 1న విచారణకు హాజరుకావాలని గట్టిగా పట్టుబడుతుంటే, కేసీఆర్ మాత్రం తనదైన శైలిలో లా పాయింట్లను తెరపైకి తెచ్చి మున్సిపల్ ఎన్నికల తర్వాతే దీనిపై స్పందిస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ న్యాయనిపుణులు సిద్ధం చేస్తున్న వ్యూహాలు, కోర్టుకు వెళ్లే అవకాశాలపై మేథోమథనం జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఎర్రవెల్లికే రావాలంటున్న కేసీఆర్
సిట్ అధికారులు కేసీఆర్కు జూబ్లీహిల్స్లోని నందినగర్ నివాసంలో నోటీసులు అందజేయగా, ఆయన తన నివాసం ఎర్రవెల్లి ఫాంహౌస్ అని స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను వారి నివాసంలోనే విచారించాలి. అయితే, సిట్ అధికారులు ఆయన ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ ఉందని, కాబట్టి అక్కడే విచారణకు రావాలని కోరుతున్నారు. చట్టప్రకారం ఒక వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రదేశాన్నే నివాసంగా పరిగణించాలని, ఫాంహౌస్ కూడా తన నివాసమేనని కేసీఆర్ వాదిస్తున్నారు. ఈ పాయింట్ మీద ఆయన కోర్టును ఆశ్రయించి లొకేషన్ మార్పు కోసం స్టే కోరే అవకాశం ఉంది.
మున్సిపల్ ఎన్నికల తర్వాతే విచారణ ఉండాలంటున్న కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 14 వరకు తనకు సమయం కావాలని కేసీఆర్ కోరారు. అయితే, సిట్ మాత్రం కేవలం ఒక్క రోజు వ్యవధి ఇచ్చి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. విచారణాధికారికి విచారణ జరిపే హక్కు ఉన్నప్పటికీ, సాక్ష్యం చెప్పే వ్యక్తికి ఉన్న వెసులుబాటును కాలరాయకూడదని బీఆర్ఎస్ న్యాయ నిపుణులు చెబుతున్నారు. అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందో సిట్ కోర్టుకు వివరించాల్సి ఉంటుందని వారు వాదిస్తున్నారు.
న్యాయపోరాటానికి కసరత్తు ?
సిట్ తీరును చూస్తుంటే ఇది కేవలం విచారణే కాదు, మున్సిపల్ ఎన్నికల ముందు పార్టీని దెబ్బతీసే రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందుకే, కేసీఆర్ నేరుగా విచారణకు వెళ్లకుండా, సిట్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లేదా విచారణ వాయిదా కోరుతూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షులుగా పిలిచే వ్యక్తులకు వారి అనుకూలమైన సమయం, స్థలాన్ని ఎంచుకునే హక్కు కొంత మేరకు ఉంటుందని గతంలో కొన్ని తీర్పులు స్పష్టం చేసినందున ఈ పాయింట్తోనే కేసీఆర్ కోర్టును ఆశ్రయించవచ్చు. ఇదే అంశాన్ని సిట్ కు రాసిన రిప్లయ్లో కూడా కేసీఆర్ ప్రస్తావించారు.
కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం
కేసీఆర్ ఇప్పటివరకు ఈ నోటీసులపై బహిరంగంగా స్పందించలేదు. కానీ, ఆయన తన లాయర్ల ద్వారా సిట్కు పంపిన ప్రత్యుత్తరంలో ప్రతి మాటను చాలా జాగ్రత్తగా తూచి తూచి ఉపయోగించారు. సిట్ కోరుతున్నట్లుగా నందినగర్ లో విచారణకు హాజరైతే, తదుపరి విచారణలన్నీ నగరంలోనే జరుగుతాయని, అదే ఎర్రవెల్లి అయితే ప్రశాంతంగా న్యాయ పోరాటం చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. సిట్ అధికారులు ఆదివారం మధ్యాహ్నం నందినగర్ చేరుకునే లోపే కోర్టు నుంచి ఏవైనా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవాలన్న ప్రయత్నాల్లో బీఆర్ఎస్ న్యాయవిభాగం ఉంది. ఫిబ్రవరి 1న కేసీఆర్ సిట్ ముందు నిలబడతారా? లేక కోర్టు మెట్లు ఎక్కి స్టే తెచ్చుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















