KCR Received Notices : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు మరోసారి నోటీసులు! ఆదివారం విచారణకు రావాలని సిట్ ఆదేశం
KCR Received Notices: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ఆదివారం విచారించేందుకు సిట్ సిద్ధమైంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది.

KCR Received Notices : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం అందుబాటులో ఉండాలని సూచించారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. విచారణకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని సిట్ ఆదేశించింది. ఆయన అభ్యర్థించినట్టుగా ఎర్రవల్లి ఫామ్హౌస్లో ప్రశ్నించేందుకు నిరాకరించారు అధికారులు.
ఫామ్ హౌస్ విచారణకు సిట్ నో
కేసీఆర్ 65 ఏళ్లు పైబడిన వ్యక్తి కాబట్టి సీఆర్పీసీ సెక్షన్ 160 నిబంధనల ప్రకారం ఆయనను పోలీస్ స్టేషన్కు పిలవకుండా, ఆయన నివాసంలోనే విచారించాల్సి ఉంటుంది. అందుకే సిట్ అధికారులు ఆయనను హైదరాబాద్ పరిధిలోని నందినగర్ నివాసాన్ని ఎంచుకోవాలని సూచించారు . హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రవెల్లి ఫాంహౌస్ లో విచారించడానికి నిరాకరించారు. దర్యాప్తు సౌలభ్యం కోసం , భద్రతా కారణాల దృష్ట్యా విచారణను హైదరాబాద్ నగర పరిధిలోనే నిర్వహించాలని సిట్ నిర్ణయించింది. దీనిపై స్పందించిన కేసీఆర్ తరపు వర్గం, చట్టప్రకారం వ్యక్తి ఎక్కడ నివసిస్తే అక్కడికే వచ్చి విచారించాలని, ఫాంహౌస్ కూడా తన నివాసమేనని వాదిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల వరకూ ఆగేది లేదు!
మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రశ్నించాలని కేసీఆర్ విజ్ఞప్తిని నిరాకరించింది. ఒక్క రోజు వ్యవధిలోనే విచారణ చేయాలని ఆదివారాన్ని ముహుర్తంగా ఖరారు చేసింది. సిట్ అత్యవసరంగా నోటీసులు జారీ చేయడం వెనుక ప్రధానంగా దర్యాప్తులో జాప్యాన్ని నివారించాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది. ఫిబ్రవరి 14 వరకూ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుందని, అప్పటివరకు వేచి చూస్తే సాక్ష్యాధారాల సేకరణలో జాప్యం జరిగి కేసు దారి తప్పే ప్రమాదం ఉందని సిట్ భావిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుల నుంచి సేకరించిన కీలక సమాచారం ఆధారంగా విచారణను వేగంగా ముగించాలని అధికారులు నిర్ణయించారు. అందుకే కేసీఆర్ కోరినట్లుగా ఎన్నికలు ముగిసే వరకు కాకుండా, కేవలం ఒక్క రోజు వెసులుబాటు ఇచ్చి మరీ ఫిబ్రవరి 1నే విచారణకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు.
తొలిసారిగా నేరుగా విచారణకు రంగం సిద్ధం
ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రారంభమైనప్పటి నుండి అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు జైలుకు వెళ్లారు. మరికొందరు కీలక సాక్షులుగా మారారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ఉన్నతాధికారులు కేవలం కేసీఆర్ ఆదేశాలతోనే పనిచేశారా? లేదా ఈ డేటా వినియోగం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయి? అన్న కోణంలో సిట్ ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్టయిన అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసీఆర్కు నోటీసులు అందడంతో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులని, కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి నోటీసులు ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















