Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Jagan: ఎన్డీఏతో జగన్ స్నేహంగా ఉంటూడటం ఆయన రాజకీయ వ్యూహాలను ప్రశ్నార్థకం చేస్తోంది. కూటమిని కాకుండా చంద్రబాబును మాత్రమే విమర్శించి బీజేపీతో స్నేహం పాటించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Jagan friendship with NDA : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ పెద్ద చర్చకు దారితీస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితిలో ఉన్న జగన్.. అదే కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ పట్ల, ముఖ్యంగా ప్రధాని మోదీ పట్ల ప్రదర్శిస్తున్న సానుకూలత రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
ప్రత్యర్థిని పొగడటం - వ్యూహాత్మక లోపమా?
రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం ఉంటుంది. కానీ జగన్ విషయంలో అది రివర్స్లో కనిపిస్తోంది. రాష్ట్రంలో తన ప్రధాన శత్రువులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి ఉన్న బీజేపీని ఆయన పల్లెత్తు మాట అనకపోగా, ప్రధాని మోదీ సుదీర్ఘ కాలం పదవిలో ఉన్నారంటూ ప్రశంసించడం రాజకీయంగా ఆయనకు నష్టం చేకూర్చే అంశమే. పోరాడాల్సిన ప్రత్యర్థిని పొగిడినప్పుడు, క్యాడర్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. ఇది క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను అయోమయంలోకి నెట్టే ప్రమాదం ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా మోదీని జగన్ పొడుగుతూనే ఉన్నారు.
కేసుల భయం - సామంత ముద్ర
జగన్ వైఖరిపై ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ కేసుల భయం . అక్రమ ఆస్తుల కేసులు, వివేకా హత్య కేసు వంటి అంశాల్లో కేంద్రం నుంచి రక్షణ కోసమే ఆయన బీజేపీకి సామంత పార్టీ లా వ్యవహరిస్తున్నారనే ప్రచారం బలంగా సాగుతోంది. రాజకీయంగా ఇది చాలా ప్రమాదకరమైన ముద్ర. ఒక బలమైన నాయకుడిగా ముద్ర పడిన జగన్, ఇప్పుడు కేంద్రం ముందు మోకరిల్లుతున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తే, ఆయన వ్యక్తిత్వానికే పెద్ద దెబ్బ తగులుతుంది. ఇది నిజం కాకపోయినా, ఆయన చేతలు ఆ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు, దళితులు , క్రైస్తవ ఓటర్లు ప్రధాన బలం . బీజేపీకి ఈ వర్గాలతో ఉన్న సైద్ధాంతిక వైరుధ్యం జగన్కు ఇబ్బందిగా మారవచ్చు. జగన్ బహిరంగంగా బీజేపీని సమర్థిస్తున్నారనే సంకేతాలు వెళ్తే, ఈ వర్గాలు ప్రత్యామ్నాయాల వైపు చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అడుగులు వేస్తున్న తరుణంలో, జగన్ బీజేపీకి దగ్గరవ్వడం అంటే తన స్వంత ఓటు బ్యాంకును తానే చేజేతులా పక్క పార్టీకి అప్పగించినట్లు అవుతుందనే ఆందోళన పార్టీ నేతల్లో ఉంది.
ద్వంద్వ వైఖరితో మైలేజీ సాధ్యమేనా?
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏను పొగడటం అనేది రాజకీయంగా విడ్డూరంగా అనిపిస్తుంది. రాష్ట్రంలో వైఫల్యాలకు కేంద్రాన్ని కూడా బాధ్యులను చేయకుండా కేవలం చంద్రబాబును మాత్రమే విమర్శించడం వల్ల జగన్ పోరాటంలో పదును తగ్గుతుంది. ప్రజలు కూడా దీనిని అవకాశవాద రాజకీయంగా చూసే ప్రమాదం ఉంది. బీజేపీతో ఫ్రెండ్లీగా ఉంటూనే, అదే బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమిపై పోరాడితే రాజకీయ మైలేజీ రావడం కష్టమే.
జాతీయ స్థాయిలో ఒంటరితనం
ప్రస్తుతం దేశంలో ఇండియా కూటమి గట్టిగా పోరాడే ప్రయత్నం చేస్తోంది. ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. కానీ జగన్ మాత్రం అటు ఇండియా కూటమిలోకి వెళ్లకుండా, ఇటు ఎన్డీఏలో అధికారికంగా భాగస్వామి కాకుండా మధ్యలో ఉండిపోయారు. ఈ ఐసోలేషన్ వల్ల జాతీయ స్థాయిలో ఆయనకు మద్దతు ఇచ్చే వారు కరువయ్యారు. ఢిల్లీలో జరిగిన నిరసనలకు కూడా ఇతర పార్టీల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడానికి ఆయన అనుసరిస్తున్న ఈ అస్పష్ట వైఖరే కారణమని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి తన పాలసీని మార్చుకోకపోతే, అది పార్టీ మనుగడకే ముప్పుగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పోరాటం అంటే అన్ని వైపుల నుంచి ఉండాలి. ఒక వైపు రాజీ పడి, మరోవైపు పోరాటం చేస్తానంటే అది కేవలం రాజకీయ డ్రామాగా మిగిలిపోతుందని అంటున్నారు. మరి జగన్ ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారో?























