Municipal election wards: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెంపు - ఏపీ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు
Municipalities Wards: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులను పునర్విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ జీవో జారీ చేసింది.

Wards Reorganize in municipal Corporations: ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ కార్పొరేషన్ల వార్డు మెంబర్లు సంఖ్యను ఖరారు చేసే నిబంధనలకు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ పేరుతో మంగళవారం ఈ జీవో విడుదలయింది. తాజా జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్యను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల నిబంధనలు-2005కు సవరణలు చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం సభ్యుల సంఖ్య.. తాజా సవరణల ప్రకారం, జనాభా ప్రాతిపదికన డివిజన్ల సంఖ్యను ఈ క్రింది విధంగా నిర్ణయించారు
2 లక్షల లోపు జనాభా ఉంటే 60 మంది సభ్యులు.
2 లక్షల నుండి 3 లక్షల వరకు 62 మంది సభ్యులు.
లక్షల నుండి 10 లక్షల వరకు జనాభాను బట్టి 66 నుండి 76 వరకు సభ్యులు ఉంటారు.
15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్ద కార్పొరేషన్లకు గరిష్టంగా 120 మంది సభ్యులను కేటాయించారు
ముఖ్యమైన షరతులు
ఈ నిబంధనల అమలులో ప్రభుత్వం కొన్ని కీలక షరతులను విధించింది. లోటు బడ్జెట్లో ఉన్న స్థానిక సంస్థలు తమ నిధులను 16వ ఆర్థిక సంఘం లేదా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇతర పరిపాలనా ఖర్చులకు మళ్లించకూడదని స్పష్టం చేసింది. అలాగే, ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికైన ప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
అమలు , డెలిమిటేషన్
ఈ కొత్త నిబంధనలు ప్రస్తుతం ఉన్న పాలకమండలి పదవీ కాలం ముగిసిన తర్వాతే అమలులోకి వస్తాయి. సభ్యుల సంఖ్య పెరిగిన సందర్భాల్లో, సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి ముందే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల విభజన నిబంధనలు-1996 ప్రకారం వార్డుల పునర్విభజన తప్పనిసరిగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది.























