జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు తమ పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా మారి, దక్షిణాది గొంతును బలహీనపరుస్తుంది.
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. కానీ ఈ పది విషయాలపై ఫోకస్ చేయకుండా ముందడుగు వేస్తే ప్రమాదమే!

Delimitation 2026 : ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెంచాలన్న ప్రతిపాదన ఆహ్వానించదగినదే. ప్రజాస్వామ్య పరిణామక్రమంలో మార్పు మంచిదే, జనాభా అవసరాలకు తగిన పాలనాపరమైన సవరణలు తప్పనిసరి కూడా. అందుకే పార్లమెంటు, అసెంబ్లీ స్ధానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం అంటోంది. అయితే ఈ నిర్ణయంతో నష్టాలు లేవన్న వాదన మాత్రం పూర్తిగా వాస్తవం కాదు. అమెరికా, ఇంగ్లండ్ లాంటి ప్రజాస్వామిక దేశాలు సైతం ఎంపీల సంఖ్య పెంచుకునేందుకు ఎందుకు వెనకాడుతున్నారో ఈ పది కారణాలు చూస్తే అర్ధమౌతుంది.
1. ఉత్తమ పనితీరుకు శిక్ష ?
అత్యంత స్పష్టమైన వైరుధ్యం ఏమిటంటే దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ జనాభా నియంత్రణ విధానాలను కచ్చితంగా పాటించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ స్థాయి కోల్పోయే ప్రమాదం వుంది. జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీలు పెరిగి దక్షిణాది వాణి బలహీనపరచడమే అవుతుంది.
2. ఎక్కువ నాయకులు, ఎక్కువ పార్టీలు - తక్కువ స్దిరత్వం !
ప్రస్తుతం భిన్న కుల, మత, రాజకీయ వాదాల నాయకులున్నప్పటికీ పెద్ద నియోజకవర్గాల్లో గెలవడం సాధ్యం కాదు కాబట్టి ఏదో ఓ పార్టీతో సర్దుకు పోవడం అనివార్యమవుతోంది. కానీ రేపు చిన్న ప్రాంతాలు నియోజకవర్గాలు గా ఏర్పడితే కొత్త కుల, మత వాదులు రాజకీయావకాశాలు వెతుక్కుంటారు. అది ప్రభుత్వాల స్థిరత్వానికి సవాలుగా మారే ప్రమాదముంది.
3. సమాఖ్య వాదానికి ముప్పు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పినట్టు ఇప్పటికే అధిక ఎంపీలున్న రాష్ట్రాలకు ఈ పెంపుదల మరింత లాభిస్తుంది. 80 ఎంపీలున్న యూపీకీ , 40 ఎంపీలున్న తమిళనాడుకు ఉన్న 40 ఎంపీల అంతరం రేపు 60కి చేరుతుంది. అది అన్ని రాష్ట్రాలూ సమానం అన్న సమాఖ్య స్పూర్తిని దెబ్బతీయడమే అవుతుంది.
4. హిందీ - నాన్ హిందీ వాదం
హిందీ మాట్లాడే ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఎంపీలు రావడం సహజంగానే పార్లమెంటులో భాషా ప్రాధాన్యతను మారుస్తుంది. దీనివల్ల సాంస్కృతిక గుర్తింపులోనూ విభేదాలు పెరిగే అవకాశం ఉంటుంది. సంఖ్యాపరంగా తక్కువ, పైగా భాష ప్రాతిపదికగా ఏర్పడ్డ దక్షిణాది రాష్ట్రాలకు అంతటి ఐక్యత ప్రదర్శన కష్టమవుతుంది.
5. సభా చర్చల్లో నాణ్యత, సమయాభావం
పెద్ద సభలు తరచుగా ఎక్కువ గందరగోళానికి, సభ్యులకు మాట్లాడే సమయం తగ్గడానికీ, చట్టాల నిషిత పరిశీలనకు అవకాశం తగ్గుతుంది. సుమారు 1,000 మంది సభ్యుల పార్లమెంటు నిర్వహణా కష్టమే.
6. అధికార పార్టీలకే అనుకూలం (గెర్రీమాండరింగ్)
అధికార పార్టీలు తమకు అనుకూల కులాలు, ఓటింగ్ వర్గాల ప్రాతిపదికగా నియోజకవర్గాల సరిహద్దులను తారుమారు చేస్తారు, తద్వారా ఎన్నికల ఫలితాలెలా ఉండాలో నిర్ణయించుకుంటారు. దీనినే "గెర్రీమాండరింగ్" అంటారు. 2009కి ముందు జరిగిన పునర్విభజనలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలే ఎదుర్కొన్న విషయం గుర్తుచేస్తున్నారు. పునర్విభజనలో సరిహద్దులను సవరించడం కచ్చితంగా అధికార పార్టీల అనుకూల నిర్ణయాలకు అవకాశమిస్తుంది.
7. ప్రజలపై మరింత భారం
ఎక్కువ మంది ప్రతినిధులు అంటే ఎక్కువ జీతాలు, ఎక్కువ బంగళాలు, పెద్ద సచివాలయాలు, కార్లు, సెక్యూరిటీలు ఇలా అన్ని రకాల భారాలూ పెరుగుతాయి. అంతేకాదు ప్రజాప్రతినిధుల్లో అవినీతి పరుల సంఖ్యా పెరిగే ప్రమాదం ఉందనే వాదనా ఉంది.
8. చిన్న రాష్ట్రాలు చిన్నబోతాయా..
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి చిన్న రాష్ట్రాలు, ఈశాన్యంలోని సెవెన్ సిస్టర్స్ ప్రభుత్వ గణాంకాల్లో కేవలం ఫుట్నోట్స్గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రాంతీయ సమస్యలపై పార్లమెంటు స్థాయిలో చర్చించాల్సి వచ్చినప్పుడు వారి అభ్యర్ధనలు పెద్ద రాష్ట్రాలు, వారి సమస్యల హోరులో కొట్టుకుపోతాయి. లేదా ప్రాధాన్యతను ఆకర్షించలేవు.
9. పట్టణ-గ్రామీణ అంతరం
కొన్ని ప్రాంతాలలో వేగవంతమైన పట్టణీకరణ కారణంగా, సీట్ల పునర్వ్యవస్థీకరణతో పట్టణ ప్రాంతాలకు ఎక్కువగా అనుకూలంగా ఉండొచ్చు. ఇది వలసలను ప్రతిబింబించినప్పటికీ, గ్రామీణ నియోజకవర్గాలపై దృష్టి పెట్టడానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యం తగ్గే అవకాశముంది.
10. ప్రభుత్వ యంత్రాంగానికి మరిన్ని సవాళ్లు.
తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు ఏర్పడితేనే జిల్లాల కలెక్టర్లు ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రొటోకాల్స్, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణల్లో గందరగోళం ఎదుర్కొంటున్నారు. రేపు మరిన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు వస్తే వారందరినీ సమన్వయం చేయడం, వివాదాల్లో సర్ది చెప్పడం మరింత సవాలుగా మారుతుంది.
ఈ సవాళ్లన్నీ ప్రభుత్వం పరిశీలిస్తూ వాటికీ పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి లేదంటే పరిష్కారం కొత్త చిక్కులకు దారి తీసే అవకాశముంది.
Frequently Asked Questions
ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెంచడం వల్ల కలిగే ప్రధాన సమస్య ఏమిటి?
సీట్ల పెంపుదల వల్ల ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం చూపుతుందా?
అవును, చిన్న నియోజకవర్గాలు ఏర్పడితే కొత్త కుల, మత వాదులు రాజకీయ అవకాశాలను వెతుక్కుంటారు. ఇది ప్రభుత్వాల స్థిరత్వానికి సవాలుగా మారవచ్చు.
ఎంపీల సంఖ్య పెంచడం సమాఖ్య స్ఫూర్తిని ఎలా దెబ్బతీస్తుంది?
అధిక ఎంపీలున్న రాష్ట్రాలకు ఈ పెంపుదల మరింత లాభిస్తుంది. ఇది అన్ని రాష్ట్రాలు సమానం అన్న సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది.
సభా చర్చల్లో నాణ్యతపై సీట్ల పెంపుదల ప్రభావం ఎలా ఉంటుంది?
పెద్ద సభలు తరచుగా ఎక్కువ గందరగోళానికి, సభ్యులకు మాట్లాడే సమయం తగ్గడానికి దారితీస్తాయి. చట్టాల నిశిత పరిశీలనకు అవకాశం కూడా తగ్గుతుంది.
ఎక్కువ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ప్రజలపై భారం పెరుగుతుందా?
ఎక్కువ మంది ప్రతినిధులు అంటే ఎక్కువ జీతాలు, భత్యాలు, కార్యాలయాలు, భద్రత వంటి వాటికి అయ్యే ఖర్చు పెరుగుతుంది. ఇది ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది.























