BRS Digital Membership Drive 2026: జోరందుకోని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు - క్యాడర్ బలం ఎంత? నేతల నిర్లక్ష్యం ఉందా?
KTR Mana Balam Mana Balagam Campaign: తెలంగాణలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు నత్తనడకన సాగుతోందా? అధికారం లేకపోవడంతో క్యాడర్ దూరమవుతుందా లేక నేతల నిర్లక్ష్యమా?

Why BRS Membership is Slowing Down: భారత్ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్ రావు ఇటీవల తన ఎర్రవెల్లి నివాసంలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించి, ప్రతిష్టాత్మకమైన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత పదేళ్ల పాటు తిరుగులేని అధికార పీఠంపై ఉన్న గులాబీ పార్టీ, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో జరుగుతున్న ఈ మొదటి భారీ సభ్యత్వ నమోదు ప్రక్రియ కావడం వల్ల రాజకీయ వర్గాల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావు వంటి అగ్రనాయకులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ.. మన బలం - మన బలగం పేరుతో క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ సారి సభ్యత్వ నమోదు అనుకున్న స్థాయిలో ఊపు అందుకోకపోవడం వెనుక పార్టీ అంతర్గత సమీకరణాలు, మారిన రాజకీయ ముఖచిత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అధికారం లేనప్పుడు జోరు తగ్గడం సహజమే
ఏదైనా ఒక రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు సభ్యత్వ నమోదు చేయడం చాలా సులభమైన ప్రక్రియ. ఎందుకంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, స్థానిక కాంట్రాక్టర్లు, లబ్ధి పొందాలని చూసే వివిధ వర్గాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రికార్డు స్థాయి సంఖ్యలో సభ్యత్వాలు చేయిస్తారు. కానీ, అధికారం లేనప్పుడు వచ్చే సభ్యత్వాలే ఆ పార్టీ నిజమైన క్యాడర్ బలాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు కూడా ఇదే. గతంలో 60 లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయని చెప్పుకున్న బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో ఎంతమంది తమతో నడుస్తారనే నిఖార్సయిన పరీక్షను ఎదుర్కొంటోంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన కోర్ క్యాడర్ ఇప్పటికీ బలంగానే ఉన్నప్పటికీ, కేవలం అధికార లాభాల కోసం చేరిన వలస శ్రేణులు ఇప్పుడు దూరం కావడం సభ్యత్వ నమోదు వేగాన్ని తగ్గించింది.
ద్వితీయ శ్రేణి నేతల నిర్లక్ష్యం
ఈ మందగమనానికి క్యాడర్ నిర్వేదం ఒక కారణమైతే, ద్వితీయ శ్రేణి నేతల నిర్లక్ష్యం , స్తబ్దత అంతకంటే పెద్ద కారణంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్లు, మాజీ ఎమ్మెల్యేలు రాజకీయంగా స్తబ్దుగా మారిపోయారు. కొందరు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుండగా, మరికొందరు సొంత వ్యాపారాల్లో బిజీ అయ్యారు. డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేయాలంటే పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు చురుగ్గా పని చేయాలి, కానీ నాయకులు గ్రౌండ్ లెవెల్కు వెళ్లి క్యాడర్ను సమన్వయం చేయడంలో ఆశించిన స్థాయిలో చొరవ చూపడం లేదన్నది లోకల్ టాక్. నాయకుడే యాక్టివ్గా లేనప్పుడు, కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గడం సహజం. ఈ నాయకత్వ లోపమే సభ్యత్వ నమోదు అనుకున్న వేగంతో సాగకపోవడానికి ప్రధాన అడ్డంకిగా మారింది.
బోగస్ సభ్యత్వాలు వద్దనుకుంటున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ సమస్యలను గుర్తించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సాంప్రదాయ పేపర్ పద్ధతి కాకుండా ఈసారి పూర్తి డిజిటల్ మోడ్ ను ఎంచుకోవడం ద్వారా బోగస్ సభ్యత్వాలకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఇద్దరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా సుమారు 71,000 మందికి పైగా కార్యకర్తలకు డిజిటల్ ఎన్రోల్మెంట్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కేటీఆర్ సైతం క్షేత్రస్థాయి చిట్-చాట్లలో చెబుతున్నట్లుగా.. మాకు ఓట్లు వేసిన 39 శాతం మంది ప్రజల మద్దతు అలాగే ఉంది, ప్రభుత్వ వైఫల్యాలపై క్యాడర్ పోరాడితే సభ్యత్వాలు అవే వస్తాయి అనే ధీమాతో లీడర్లను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల వైపు క్యాడర్ డైవర్ట్ కాకుండా కట్టడి చేయడానికే ఈ డ్రైవ్ను అస్త్రంగా వాడుకుంటున్నారు.ట
ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అనుకున్న విధంగా సాగడం లేదనేది వాస్తవమే అయినప్పటికీ, ఇది పూర్తిగా క్యాడర్ బలహీనత కాదు.. క్షేత్రస్థాయి లీడర్ల సమన్వయ లోపం. ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో లేనప్పుడు క్యాడర్ నమ్మకాన్ని గెలవడానికి కొంత సమయం పడుతుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి , కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను, స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్ ఏ మేరకు క్యాష్ చేసుకుంటుందనే దానిపైనే ఈ సభ్యత్వాల సంఖ్య ఆధారపడి ఉంటుంది. గులాబీ శ్రేణుల్లో ఎంతవరకు నమ్మకం కలిగించి, నాయకులను క్షేత్రస్థాయికి పంపించగలరు అనే దానిపైనే కేసీఆర్ మార్క్ రీ-ఆర్గనైజేషన్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















