Andhra Pradesh Financial Status: అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
AP economic situation: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ఆందోళనకరంగా ఉంది. గాడితప్పిన క్రమశిక్షణతో అప్పుల ఊబిలోకి రాష్ట్రం వెళ్లిపోతోంది.

AP economic situation is deteriorating day by day: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాగ్ వెల్లడించిన గణాంకాలు కేవలం అంకెలు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు హెచ్చరికలు అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత పాటించడంలో విఫలమవడమే కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం తాత్కాలిక అవసరాల కోసమే ప్రాధాన్యత ఇస్తోందని. తెచ్చిన అప్పుల్లో సింహభాగం అనుత్పాదక వ్యయానికే ఖర్చు చేస్తూ, సంపద సృష్టిని పూర్తిగా గాలికొదిలేయడం రాష్ట్ర ఆర్థిక పునాదులను బలహీనపరుస్తోందని అంటున్నారు.
ఆస్తుల కల్పన అనుకున్నంతగా జరగడం లేదా?
ఏ రాష్ట్రానికైనా ఆర్థిక స్థిరత్వం రావాలంటే తెచ్చిన అప్పులను ఆస్తుల కల్పన కోసం వినియోగించాలి. రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మెరుగుపడితేనే భవిష్యత్తులో కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. కానీ ఏపీ ప్రభుత్వం తెచ్చిన అప్పుల్లో కేవలం 24 శాతం మాత్రమే ఇలాంటి అభివృద్ధి పనులకు వెచ్చిస్తోంది. మిగిలిన 75 శాతం పైగా నిధులు కేవలం పాత అప్పుల వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, ఉచిత పథకాలకే సరిపోతున్నాయి. దీనివల్ల రాష్ట్రం అప్పు తెచ్చి పాత అప్పు కట్టే ప్రమాదకరమైన డెట్ ట్రాప్ లో చిక్కుకుంటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
పెరిగిపోతున్నలోటు
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల రెవెన్యూ లోటు గణనీయంగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య బాధ్యత , బడ్జెట్ నిర్వహణ చట్టం నిర్దేశించిన 2.7 శాతం లక్ష్యాన్ని దాటి రెవెన్యూ లోటు 3.75 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం తన సొంత అవసరాల కోసం ఆదాయాన్ని సమకూర్చుకోలేక నిరంతరం రుణాల వైపు మొగ్గు చూపుతోంది. గత రెండేళ్లలోనే సుమారు 3.20 లక్షల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం గత ఐదేళ్ల అప్పుల రికార్డులను సమం చేసింది. ఇది ఖజానాపై మోయలేని భారాన్ని పెంచుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన రోజువారీ ఖర్చుల కోసం భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న ఓవర్డ్రాఫ్ట్ మరియు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులపైనే పూర్తిగా ఆధారపడుతోంది. 2024-25 సంవత్సరంలో కేవలం ఎనిమిది రోజులు తప్ప, మిగిలిన అన్ని రోజులు ప్రభుత్వం అడ్వాన్సుల ద్వారానే నిధులను సేకరించింది. ఏడాది కాలంలో సుమారు 1.72 లక్షల కోట్ల రూపాయలను ఈ రూపంలో తీసుకోవడం ఆర్థిక సంక్షోభ తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇలా తీసుకున్న నిధులకు అదనంగా వందల కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సి రావడం వల్ల రాష్ట్రం అప్పుల చక్రబంధంలో చిక్కుకుంటోంది.
సంపద సృష్టి విషయంలో నిర్లక్ష్యం
సంపద సృష్టి విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం రాబోయే తరాలపై మోయలేని భారాన్ని మోపుతోందని అంటున్నారు. సొంత పన్ను ఆదాయం పెంచుకునే దిశగా పారిశ్రామికీకరణ , వాణిజ్య అభివృద్ధిపై దృష్టి సారించకుండా, కేవలం అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోవడం ఆత్మాహుతి సదృశమే అవుతుంది. ద్రవ్యలోటు కేంద్రం విధించిన 4 శాతం పరిమితిని దాటి 5.1 శాతానికి చేరడం అంటే, రాష్ట్రం తన ఆర్థిక స్వయంప్రతిపత్తిని కోల్పోవడానికి సిద్ధపడటమేనని చెబుతున్నారు. ప్రభుత్వం కేవలం సంక్షేమ మంత్రాన్నే నమ్ముకోకుండా, సంపద సృష్టించే మార్గాల వైపు అడుగులు వేయాలి. ఆదాయం లేని ఖర్చు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తుందని.. అనుత్పాదక వ్యయాన్ని కఠినంగా తగ్గించుకుని, పెట్టుబడి వ్యయాన్ని పెంచినప్పుడే రాష్ట్రం గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















