Iran War Updates: హర్మూజ్ జలసంధిలో బాంబులు - ఆయిలే కాదు.. భారత ఇంటర్నెట్ వ్యవస్థకూ గండమే !
India Internet System: ఇరాన్ కేంద్రంగా సాగుతున్న తాజా ఉద్రిక్తతలు కేవలం చమురు సరఫరానే కాకుండా, భారతదేశపు ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా రిస్క్ లో పెడుతున్నాయి.

Iran War Threat to India Internet System: ప్రపంచ వాణిజ్యానికి హార్ముజ్ జలసంధి ఎంత కీలకమో, డిజిటల్ ప్రపంచానికి అక్కడి సముద్రగర్భ కేబుల్స్ అంతకంటే ముఖ్యం. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న తాజా ఉద్రిక్తతలు కేవలం చమురు సరఫరానే కాకుండా, భారతదేశపు ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ , సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు 97 నుంచి 99 శాతం వరకు సముద్రగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. భారతదేశాన్ని యూరప్ , ఆఫ్రికా దేశాలతో కలిపే అత్యంత కీలకమైన కేబుల్ వ్యవస్థలు పెర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం మీదుగానే వెళ్తాయి. ఇరాన్-ఇజ్రాయెల్ లేదా ఇరాన్-పాశ్చాత్య దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే, ఈ కేబుల్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇది జరిగితే భారతదేశంలోని బ్యాంకింగ్, ఐటీ సేవలు, రోజువారీ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఒక్కసారిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతం భౌగోళికంగా చాలా ఇరుకైనది. ఇరాన్ ఈ జలసంధిపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తే , అక్కడ నేవల్ దాడులు జరిగితే, సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ చిట్లిపోయే అవకాశం ఉంది. గతంలో ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడుల వల్ల కొన్ని కేబుల్స్ దెబ్బతిన్న సంఘటనలను గుర్తుచేసుకుంటూ, అంతర్జాతీయ మీడియా ఇప్పుడు ఇరాన్ వివాదాన్ని మరింత ప్రమాదకరంగా చూస్తోంది. కేబుల్స్ దెబ్బతింటే వాటిని సరిచేయడానికి వెళ్లే నౌకలకు కూడా యుద్ధ సమయంలో భద్రత ఉండదు, ఫలితంగా ఇంటర్నెట్ పునరుద్ధరణకు నెలల సమయం పట్టవచ్చు.
భారతదేశానికి ఇది ఎందుకు పెద్ద సమస్య అంటే.. మన దేశం ఆసియా మ, యూరప్ మధ్య ఒక ప్రధాన 'డిజిటల్ హబ్'గా ఉంది. ముంబై , చెన్నై తీరాలకు వచ్చే అనేక అంతర్జాతీయ కేబుల్స్ ఈ గల్ఫ్ ప్రాంతం నుండే ప్రయాణిస్తాయి. ఒకవేళ ఆ మార్గంలో అంతరాయం కలిగితే, ఇంటర్నెట్ ట్రాఫిక్ మొత్తం ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంటర్నెట్ వేగం విపరీతంగా తగ్గిపోవడమే కాకుండా, కనెక్షన్ ఫెయిల్యూర్స్ పెరిగే అవకాశం ఉంది.
ఈ ముప్పును ముందే ఊహించిన భారత్, ప్రస్తుతం తన డిజిటల్ రూట్లను వైవిధ్యీకరించుకునే పనిలో పడింది. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రాజెక్టుల ద్వారా కేవలం రోడ్లు, రైలు మార్గాలే కాకుండా డిజిటల్ కనెక్టివిటీని కూడా పటిష్టం చేయాలని చూస్తోంది. అయినప్పటికీ, ప్రస్తుతానికి పెర్షియన్ గల్ఫ్ మార్గమే అత్యంత వేగవంతమైనది కావడంతో, ఇరాన్ వివాదం మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆధునిక యుద్ధాలు కేవలం సరిహద్దులకే పరిమితం కావు. ఇరాన్ యుద్ధం చమురు సెగ మాత్రమే కాదు, భారత సామాన్యుడి చేతిలోని స్మార్ట్ఫోన్ నుండి బహుళజాతి కంపెనీల సర్వర్ల వరకు అన్నింటినీ స్తంభింపజేసే డిజిటల్ యుద్ధం గా మారే ప్రమాదం ఉంది.























