Congress vs BJP South India: రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
Sunil Kanugolu Congress Strategist:కాంగ్రెస్జాతీయ స్థాయిలో పట్టు సాధించాలంటే తెలంగాణ, కర్ణాటకల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కీలకం. సునీల్ కనుగోలుతో కలిసి డీకే, రేవంత్ తాము అనుకున్నది చేయాల్సి ఉంది.

Congress South Electoral Strategy: భారత జాతీయ రాజకీయాల్లో అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడాలంటే, ఆ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలే కీలకం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు గుర్రమెక్కి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రేసులో నిలబడాలన్నా.. లేదా కనీసం గట్టి పోటీ ఇవ్వాలన్నా.. ప్రస్తుతం హస్తం పార్టీ అధికారంలో ఉన్న రెండు బలమైన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం అత్యంత కీలకం. అందుకే కర్ణాటక సీఎంగా బాధ్యతలు తీసుకున్న డీకే శివకుమార్ తన వ్యూహకర్త సునీల్ కనుగోలును అధికారిక సలహాదారుగా నియమించుకోగా, అటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సైతం కనుగోలు వ్యూహాల ఆధారంగానే అడుగులు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలులతో కూడిన ఈ దక్షిణాది త్రయం పైనే ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ భవిష్యత్తు ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రజా వ్యతిరేకత తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు
ప్రస్తుత దేశ రాజకీయాల్లో ఒక విచిత్రమైన, అత్యంత కఠినమైన ట్రెండ్ నడుస్తోంది. కేంద్రంలో లేదా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న చోట యాంటీ-ఇంకంబెన్సీని అధిగమించి వరుసగా రెండోసారి, మూడోసారి అధికారంలోకి రావడం కనిపిస్తోంది కానీ.. కాంగ్రెస్ లేదా ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు మాత్రం ఆ ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఒకసారి అధికారమిచ్చిన ప్రజలు, రెండోసారి వచ్చేసరికి తీవ్ర అసంతృప్తితో హస్తం పార్టీని గద్దె దించుతున్న దాఖలాలు గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. పశ్చిమ బెంగాల్లో వరుసగా మూడు సార్లు తిరుగులేని మెజార్టీతో పాలించిన ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ సైతం, చివరకు ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
సునీల్ కనుగోలు ముందు అతి పెద్ద సవాల్ ప్రో ఇంకంబెన్సీ
ఈ ‘యాంటీ-ఇంకంబెన్సీ’ సూత్రాన్ని బ్రేక్ చేయడమే ఇప్పుడు వ్యూహకర్త సునీల్ కనుగోలు ముందున్న అతిపెద్ద సవాలు. సాధారణంగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సెమీఫైనల్స్లో గెలిస్తేనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ఊపు వస్తుంది. గతంలో తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి కనుగోలు ప్లాన్ చేసిన గ్యారంటీల వ్యూహం అద్భుతంగా పనిచేసింది. కానీ, అధికారాన్ని దక్కించుకోవడానికి ‘గ్యారంటీలు’ ఇచ్చినంత సులువుగా.. వాటిని అమలు చేస్తూ, ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుంటూ, ప్రజా వ్యతిరేకత రాకుండా ప్రభుత్వాన్ని రెండోసారి గెలిపించడం సాధ్యం కాదనేది వాస్తవం. ఈ హిమాలయ టాస్క్ను అధిగమించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ‘ట్రబుల్ షూటర్’ డీకే శివకుమార్.. సునీల్ కనుగోలుతో కలిసి సరికొత్త పొలిటికల్ మ్యాజిక్ చేయాల్సి ఉంది. కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా, పరిపాలనలో సమర్థతను చాటుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను యాక్టివ్గా ఉంచేలా కనుగోలు సరికొత్త డేటా నమూనాలను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ముందే గుర్తించి, అవసరమైతే సిట్టింగులను మార్చడం ద్వారా ‘ప్రో-ఇంకంబెన్సీ’ వాతావరణాన్ని సృష్టించేలా రేవంత్, డీకేలను కనుగోలు నడిపిస్తున్నారు.
దిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని పీఠంపై కూర్చోవాలనే ఆశలు సజీవంగా ఉండాలన్నా, కేంద్రంలో కాంగ్రెస్ బలమైన శక్తీగా నిలబడాలన్నా.. ఈ దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దిక్సూచి. ఉత్తరాదిలో బీజేపీకి ఉన్న ఆధిక్యతను తట్టుకోవాలంటే, దక్షిణాదిలో కాంగ్రెస్ తన కోటలను పటిష్టంగా కాపాడుకోవాలి. ఇందులో ఏ ఒక్క రాష్ట్రం చేజారినా, అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నైతిక బలాన్ని దెబ్బతీస్తుంది మరియు రాహుల్ గాంధీ లీడర్షిప్ను ప్రశ్నార్థకం చేస్తుంది. రేవంత్ రెడ్డి మాస్ లీడర్షిప్, డీకే శివకుమార్ చాణక్యం, సునీల్ కనుగోలు తెరవెనుక నడిపే టెక్నోక్రాట్ వ్యూహాలు ముక్కోణపు శక్తీగా మారి పని చేయాల్సి ఉంది. దేశంలో ఎవరూ సాధించలేని విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వాలపై వచ్చే సహజ సిద్ధమైన ప్రజా వ్యతిరేకతను తుడిచిపెట్టేలా వీరు ముగ్గురు కలిసి చేసే రాజకీయ ప్రయోగం సఫలమైతే.. అది కేవలం ఈ రెండు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, రాహుల్ గాంధీని దిల్లీ గద్దె వైపు నడిపించే ఒక బలమైన పునాదిగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Before You Go
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















