Future City Hyderabad: ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
Meerkhanpet FCDA Office Launch: ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ బాధ్యతలను సింగపూర్కు చెందిన డీపీ ఆర్కిటెక్ట్స్కు అప్పగించారు. మీర్ఖాన్పేటలో FCDA కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Net-Zero Greenfield Smart City Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్ భౌగోళిక, ఆర్థిక రూపురేఖలను సమూలంగా మార్చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో ఒక చారిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ఈ మెగా గ్రీన్ఫీల్డ్ నగర అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో నిర్మించిన ఈ అత్యాధునిక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించి, ఇక్కడి నుంచే ఫ్యూచర్ సిటీ పనుల వేగాన్ని పరుగులు పెట్టించబోతున్నారు.
సింగపూర్ సంస్థకు మాస్టర్ ప్లాన్ బాధ్యతలు
ఈ కార్యాలయ ప్రారంభోత్సవ వేదికగానే తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టే ఒక అంతర్జాతీయ స్థాయి కీలక ఒప్పందం కూడా జరగబోతోంది. దాదాపు 765 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ నయా నగరానికి సంబంధించి వరల్డ్-క్లాస్ సమగ్ర మాస్టర్ ప్లాన్ ను రూపొందించే బాధ్యతను సింగపూర్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ డిపి ఆర్కిటెక్ట్స్ కు ప్రభుత్వం అప్పగించింది. గ్లోబల్ టెండర్లలో పాల్గొన్న ఆరు దిగ్గజ సంస్థల్లో అత్యంత తక్కువ బిడ్ తో నిలిచిన ఈ సింగపూర్ సంస్థకు, వేదికపైనే సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ‘వర్క్ ఆర్డర్’ లేఖను అందజేయనున్నారు. రాబోయే తొమ్మిది నెలల కాలంలో ఈ గ్లోబల్ కన్సల్టెంట్ ఫ్యూచర్ సిటీ సమగ్ర బ్లూప్రింట్ను సిద్ధం చేయాల్సి ఉంటుంది.
30,000 ఎకరాల ప్రధాన జోన్కు మాస్టర్ ప్లాన్
FCDA పరిధిలో మొదటి విడతగా దాదాపు 30,000 ఎకరాల ప్రధాన జోన్పై అధికారులు దృష్టి సారించారు. ఇందులో దాదాపు 13,000 ఎకరాలను ‘ప్రయారిటీ డెవలప్మెంట్ జోన్’ గా గుర్తించి, వివిధ రంగాలకు చెందిన గ్లోబల్ క్లస్టర్లను ఇక్కడ విభజించారు. కొత్త ఆఫీస్ కేంద్రంగానే వీటికి సంబంధించిన పనులు సాగనున్నాయి. ఈ ప్రణాళిక ప్రకారం.. ఫ్యూచర్ సిటీలో 4,000 ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ హబ్, 403 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , 2,177 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ & అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, 1,976 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్, 313 ఎకరాల్లో గ్లోబల్ డేటా సెంటర్ హబ్, 594 ఎకరాల్లో హెల్త్ సిటీ, 255 ఎకరాల్లో ఎడ్యుకేషన్ జోన్ , 2,477 ఎకరాల్లో అత్యాధునిక రెసిడెన్షియల్ జోన్లను నిర్మించబోతున్నారు.
మొట్టమొదటి ‘నెట్-జీరో స్మార్ట్ సిటీ’
నగరంలో అస్తవ్యస్తంగా పెరుగుతున్న అర్బనైజేషన్ ఒత్తిడిని తగ్గించేందుకు, ఈ ఫ్యూచర్ సిటీని పర్యావరణహితంగా, భారతదేశంలోనే మొట్టమొదటి ‘నెట్-జీరో స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దుతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా దాదాపు 15,000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని సహజసిద్ధంగా కాపాడుకుంటూనే ఇకో-టూరిజం జోన్లను డిజైన్ చేస్తున్నారు. కాలుష్య రహిత సూత్రాల ఆధారంగా డాక్టర్ రెండీస్, భారత్ బయోటెక్, హెటెరో, ఎంఎస్ఎన్, అరబిందో వంటి ప్రముఖ ఫార్మా దిగ్గజాలు ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాయి. వీటికి తోడు అమెజాన్, హైపర్వాల్ట్, కంట్రోల్ ఎస్ వంటి అంతర్జాతీయ సంస్థల మెగా డేటా సెంటర్లు, ఇప్పటికే పనులు ప్రారంభించుకున్న ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ శాశ్వత క్యాంపస్, దాదాపు 50 ఎకరాల్లో నిర్మించబోయే లెదర్ ఇండస్ట్రీ స్కిల్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొత్త క్యాంపస్ పనులను కూడా ఈ కొత్త అథారిటీ కార్యాలయం నుంచే వేగవంతం చేయనున్నారు. రావిర్యాల్ నుండి రీజనల్ రింగ్ రోడ్ లోని ఆమన్ గల్ వరకు దాదాపు రూ.4,621 కోట్లతో మెట్రో కనెక్టివిటీ కలిగిన ‘రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్’ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి కూడా పునాది పడనుంది.
---
ట్రెండింగ్ వార్తలు






















