Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?

దక్షిణాసియా వ్యాప్తంగా జనరేషన్ జెడ్ (Gen Z) ఎదుగుదల రాజకీయాలను పూర్తిగా మారుస్తోంది. సుమారుగా 1990 దశకం చివరి నుండి 2010ల మధ్య జన్మించిన జెన్ జీ, పూర్తిగా స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా యుగంలో పెరిగిన మొదటి తరం. గత తరాలలాగ కాకుండా, వీరు రాజకీయ పార్టీల పట్ల తక్కువ నమ్మకం కలిగి ఉంటారు. కేవలం సమస్యలను బట్టి వీరి ఆలోచనా దృక్పథం ఉంటుంది. ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. ఇప్పటికే బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలలో ప్రభుత్వాలను జెన్ జీ కుదిపేసింది.
ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులైన జనాభాను కలిగిన దేశాలలో భారత్ ఒకటి. ఇక్కడ కూడా జెన్ జీ ఒక ప్రధాన రాజకీయ శక్తిగా మారగలదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమిళనాడులో నటుడు జోసెఫ్ విజయ్ సాధించిన విజయం ఈ చర్చను మరింత తీవ్రతరం చేసింది. అతని విజయం చాలా మంది సాంప్రదాయ రాజకీయ నాయకులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇది పాత ఎన్నికల సూత్రాలను సవాలు చేసింది. విజయ్ సాంప్రదాయ ప్రచారాల కంటే డిజిటల్ ప్రచారం, యువతను ఆకర్షించడంపై ఫోకస్ చేశారు. దశాబ్దాలుగా ఉన్న పార్టీల నుంచి విమర్శలు, వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగినప్పటికీ, పెద్ద సంఖ్యలో యువ ఓటర్లు అతనికి మద్దతు తెలిపారని ఎన్నికల అనంతర విశ్లేషణలు తెలుపుతున్నాయి. భారత్లో పెరుగుతున్న జెన్ జీ రాజకీయ ప్రభావానికి ఇది నిదర్శనమని చాలా మంది పరిశీలకులు భావించారు.
బంగ్లాదేశ్: దక్షిణాసియాలో జెన్ జీతో మొదటి ప్రధాన రాజకీయ విజయం 2024 లో బంగ్లాదేశ్లో వచ్చింది. ఉద్యోగ రిజర్వేషన్ కోటాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నేతృత్వంలో ప్రారంభమైన నిరసనలు వేగంగా దేశవ్యాప్త ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి. యువ నిరసనకారులు భారీ ఎత్తున మద్దతును కూడగట్టడానికి సోషల్ మీడియాను ఉపయోగించారు. అయితే, ఈ ఉద్యమం పూర్తిగా జెన్ జీ తిరుగుబాటు మాత్రమే కాదు. భారత్కు అనుకూలంగా భావించే షేక్ హసీనా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తీవ్రవాద గ్రూపులు, విదేశీ శక్తుల మద్దతు ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ, ఈ తిరుగుబాటులో జెన్ జీ ఒక ప్రధాన పాత్ర పోషించింది.
నేపాల్: నేపాల్ 2025 లో ఇంకా బలమైన యువత ఆధారిత ఉద్యమాన్ని చూసింది. సాంప్రదాయ రాజకీయ పార్టీలపై విస్తృతమైన అసంతృప్తి నెలకొంది. చాలా మంది యువకులు ర్యాపర్, రాజకీయ నాయకుడు అయిన బాలెన్ షాకు మద్దతుగా నిలిచారు. 2005 లో రాచరికం రద్దయి, 2007 లో ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత నేపాల్ ఇప్పటికే కొన్నేళ్లపాటు అస్థిరతను ఎదుర్కొంది. తరచుగా ప్రభుత్వాలు మారడం వల్ల యువతలో తీవ్ర నిరాశ ఏర్పడింది. రాజకీయ నాయకులు అవినీతిపరులని, అసమర్థులని వారు భావించారు. చాలా మంది విశ్లేషకులు నేపాల్ రాజకీయ మార్పును దక్షిణాసియాలోనే మొదటి నిజమైన జెన్ జీ ఆధారిత రాజకీయ ఉద్యమాలలో ఒకటిగా పేర్కొంటారు.
అదివరకే నెలకొన్న రాజకీయ వ్యవస్థలను సవాలు చేసేంత బలంగా జెన్ జీ ఉద్యమాలు ఎదగడానికి కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. మొదటిది, ఒకే పార్టీలు అధికారాన్ని శాసిస్తూ ఉండటం వల్ల ఎన్నికలు అర్థరహితంగా అనిపించేలా రాజకీయాలు ఉండాలి. రెండవది, రాజకీయ ప్రముఖులపై బహిరంగ అవినీతి, పెరుగుతున్న ప్రజాగ్రహం తరచుగా కనిపిస్తుంది. మూడవది, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం తమ భవిష్యత్తు అనిశ్చితంగా ఉందని భావించే యువతలో నిరాశను కలిగిస్తాయి. నాల్గవది, రాజకీయ పార్టీలు తరచుగా వంశపారంపర్యంగా అవకాశాలు , అనుచరులు, కొందరి నియంత్రణలో ఉండి, కొత్తవారికి తక్కువ అవకాశాన్ని కల్పిస్తాయి. ఛాన్స్ రాకపోతే యువతలో సాధారణంగా నిరాశ నెలకొంటుంది.
భారత్లో ఇటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. దేశంలో 25 ఏళ్ల లోపు వయసున్న వారు 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. చాలా మంది యువత నిరుద్యోగం, విద్యాపరమైన ఒత్తిడి, ద్రవ్యోల్బణం, సామాజిక పురోగతికి సంబంధించిన ఆందోళనలను ఎదుర్కొంటున్నారు. యువ ఓటర్లు తమ కుటుంబాల నుండి రాజకీయ విశ్వసనీయతను పొందే అవకాశం కూడా తక్కువగా ఉంది. వారు మరింత వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటారు. పార్టీ కల్చర్ కంటే సమస్యలు, పనితీరు ఆధారంగా నాయకులకు మద్దతు ఇస్తారు.
అయితే, భారతదేశం నేపాల్ లేదా బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. భారత్లోని కొన్ని నిర్మాణాత్మక అంశాలు జెన్ జీ రాజకీయ విప్లవాన్ని కష్టతరం చేస్తాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ వ్యవస్థలలో భారతదేశం ఒకటి. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మిలియన్ల మంది ఉచిత రేషన్ ప్రయోజనాలు, వైద్యంలో రాయితీ, స్కాలర్షిప్లు, రిజర్వేషన్లు, ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు. ఇటువంటి విస్తృతమైన సంక్షేమ నిర్మాణాలు పూర్తి రాజకీయ పతనానికి దారితీసే అవకాశాలను తగ్గిస్తాయి.
భారతదేశంలో రాజకీయ అధికారం కూడా విస్తృతంగా ఉంటుంది. పార్లమెంటు నుండి గ్రామ పంచాయతీల వరకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. మిలియన్ల మంది ఎన్నికైన ప్రతినిధులు పాలనలో పాల్గొంటారు. ఈ లోతైన ప్రజాస్వామ్య నిర్మాణం ప్రజలు తమ అసంతృప్తిని పూర్తిగా తిరస్కరించకుండా వ్యక్తం చేయడానికి వారికి అవకాశాలు కల్పిస్తుంది.
మరో ప్రధాన వ్యత్యాసం భారత సంస్థల స్థిరత్వం. పలు పొరుగు దేశాలలాగ కాకుండా, భారత సైన్యం పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉంది. న్యాయవ్యవస్థలో జాప్యంపై తరచుగా విమర్శలు వస్తున్నప్పటికీ, చాలా మంది పౌరులు ఇప్పటికీ రాజ్యాంగ సంస్థలు, ఎన్నికలపై నమ్మకాన్ని కలిగి ఉన్నారు.
భారతదేశంలో వైవిధ్యం కూడా ఒక కారకంగా పనిచేస్తుంది. దేశవ్యాప్త యువజన ఉద్యమం అంత సులభంగా రాజకీయాలను శాసించలేదు. భారత్ చాలా పెద్ద దేశం. సాంస్కృతికంగా వైవిధ్యమైనది. ప్రాంతీయ భాషలు, గుర్తింపు, స్థానిక రాజకీయ సమస్యలు రాష్ట్రాల వారీగా చాలా భిన్నంగా ఉంటాయి. ఒక రాష్ట్రంలో విజయవంతమైన ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించే అవకాశాలు తక్కువే.
యువత నిరాశకు గురికావడానికి పలు కారణాలు ఉన్నాయి. వంశపారంపర్య రాజకీయం ఇప్పటికీ ప్రజలలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. రాజకీయ అధికారం కొన్ని కుటుంబాలు, స్థిరపడిన గ్రూపుల పరిధిలోనే కేంద్రీకృతమై ఉందని జెన్ జీ భావిస్తున్నారు. మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని ఆశించే విద్యావంతులైన యువతను అవినీతి కూడా నిరాశపరుస్తూనే ఉంది. పేలవమైన పాలన అధికార పార్టీలకు పదేపదే పరాజయాలను రుచి చూపించింది. అసమర్థులుగా భావించే నాయకులను ఎన్నికల్లో ఓడించేందుకు భారత ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఫలితాలే నిదర్శనం.
నటుడు విజయ్, జెన్ జీ
తమిళనాడులో విజయ్ రాజకీయ ఎదుగుదల ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఈ ఫలితాలు నిరూపించాలయని పరిశీలకులు చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యంగా యువత ఆధారిత రాజకీయ మార్పునకు సరిగ్గా సరిపోతుంది. దశాబ్దాలుగా రెండు ద్రవిడ పార్టీలు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాయి. వ్యవస్థలో మార్పునకు తక్కువ స్కోప్ ఉందని భావించిన యువ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపారు. విజయ్ సెలబ్రిటీ హోదా, అవుట్సైడర్ (బయటి వ్యక్తి) ఇమేజ్ అతన్ని ఆ 2 పార్టీల కంటే భిన్నంగా చేసి విజయానికి కారణమయ్యాయి.
అయినప్పటికీ, భారత్ వ్యాప్తంగా జెన్ జీ విప్లవం వైపు పయనిస్తోందని భావించడం సరికాదు. భారతదేశ వైశాల్యం, ప్రజాస్వామ్య వ్యవస్థ, సంక్షేమ పథకాలు, ప్రాంతీయ వైవిధ్యం భారీ మార్పునకు అవకాశం ఇవ్వవు. అయితే, రాష్ట్ర స్థాయి యువత తిరుగుబాట్లు, రాజకీయ మార్పులు మాత్రం సాధ్యమే.
జెన్ జీ ఇప్పటికే పలుచోట్ల రాజకీయ స్వభావాన్ని మార్చేసింది. డబ్బు, భయం, కుల సమీకరణాలు, వారసత్వ విశ్వసనీయతపై ఆధారపడిన పద్ధతులు యువ ఓటర్లను ఆకర్షించడం లేదు. రాజకీయ పార్టీలు ఇకపై యువతను గతంలోలాగ తమ వైపు తిప్పుకోవడం అంత తేలిక కాదు.
భారతదేశం జాతీయ స్థాయిలో జెన్ జీ తిరుగుబాటును చూడకపోవచ్చు, కానీ యువ ఓటర్లు ఎక్కువగా ఎన్నికలను ప్రభావితం చేయవచ్చు. రాజకీయ పార్టీలు అధికారం మారేలా చేయగలరు. భవిష్యత్తులో భారత ప్రజాస్వామ్యంలో జెన్ జీ అత్యంత ప్రభావవంతమైన శక్తులలో ఒకటిగా మారవచ్చు. ప్రత్యేకించి సాంప్రదాయ పార్టీలు నిరుద్యోగం, అవినీతి, వేగంగా మారుతున్న తరం ఆకాంక్షలను పరిష్కరించడంలో విఫలమైతే.. మొదట వంశపారంపర్య రాజకీయాలకు ముగింపు పలకాలి. అది యువత, ప్రజల ఆగ్రహానికి ముఖ్య కారణం. రాజకీయ నాయకులు, కొంతమంది సంపన్నులకు కొమ్ముకాసే పరిస్థితులు ఇప్పుడు లేవు.
జెన్ జీ ఎలాంటి నాయకుడికి జై కొడుతుందో ఊహించడం కష్టం. 1975 లో భారత యువత 75 ఏళ్ల జయప్రకాష్ నారాయణ్ను తమ నాయకుడిగా అంగీకరించారు. చాలా మంది రాజకీయ నాయకులు యంగ్గా కనిపించడానికి ప్రయత్నిస్తారు. యంగ్గా కనిపించే దుస్తులు ధరిస్తారు. కానీ పనితీరును సైతం యువ ఓటర్లు గమనిస్తుంటారు. ఎందుకంటే జెన్ జీ కూడా చాలా తెలివైనవారు !!!

డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్ అనలిస్ట్
ట్రెండింగ్ వార్తలు





















