Hotel industry: ఆగిపోయిన గ్యాస్ సరఫరా - సంక్షోభంలో హోటల్ ఇండస్ట్రీ - ఇక బయట ఫుడ్ కష్టమే !
LPG cylinders Shortage: గల్ఫ్ లో యుద్ధ పరిస్థితులు ఇండియాలో హోటల్ ఇండస్ట్రీకి పెద్ద సమస్యను తెచ్చిపెట్టాయి. గ్యాస్ కొరత కారణంగా వంటలు సిద్ధం చేయలేక హోటళ్లు మూసేస్తున్నారు.

Shortage of commercial LPG cylinders: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటగదిపై, ముఖ్యంగా హోటల్ రంగంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత మొదలైంది. దేశవ్యాప్తంగా హోటల్స్ మూతపడుతున్నాయి. నిత్యం కస్టమర్లతో కిటకిటలాడే హోటల్స్ తయారీని పరిమితం చేసుకుంటున్నాయి.
మూతపడుతున్న హోటల్స్
గ్యాస్ లేకపోవడంతో వంటలు చేయలేక, హోటల్ యాజమాన్యాలు తమ కస్టమర్లకు కేవలం కుర్మా, సాంబార్ వంటి ముందే సిద్ధం చేసిన పదార్థాలను మాత్రమే వడ్డిస్తున్నాయి. నేటికి ఎలాగోలా సర్దుబాటు చేశాం కానీ, రేపటి నుంచి గ్యాస్ లేకపోతే హోటల్ నడపడం అసాధ్యం అని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క హోటల్ పరిస్థితి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా వందలాది హోటళ్లు ఇదే కారణంతో మూతపడే దిశగా వెళ్తున్నాయి. గల్ఫ్ దేశాల నుండి రావాల్సిన గ్యాస్ నిలిచిపోవడంతో బల్క్ సరఫరాపై ఆధారపడే కమర్షియల్ హోటల్ రంగం కుప్పకూలుతోంది.
ప్రధమ ప్రాధాన్యం ఇళ్లకే
భారతదేశం తన ఎల్పీజీ అవసరాలలో దాదాపు 40 నుంచి 45 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సింహభాగం ఇరాన్, యూఏఈ, కతార్ వంటి దేశాల నుంచే వస్తుంది. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల సరఫరా నిలిచిపోవడంతో, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కోటాపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. హోటల్ అసోసియేషన్లు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం, మెట్రో నగరాల్లోని చిన్న, మధ్యతరహా హోటళ్లు గ్యాస్ అందక సగానికి పైగా మెనూని తగ్గించేశాయి. మరికొన్ని చోట్ల కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ధరల పెరుగుదులకు కారణం
ఈ సంక్షోభం కేవలం వంట గ్యాస్ కొరతకే పరిమితం కాకుండా, ధరల పెరుగుదలకు కూడా దారితీస్తోంది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి గ్యాస్ను బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయిస్తుండటంతో హోటల్ నిర్వాహకులపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇది చివరకు సామాన్యుడి కంచంపై ప్రభావం చూపుతోంది. హోటళ్లలో టిఫిన్, భోజనాల ధరలు ఇప్పటికే 20% వరకు పెరిగాయి. యుద్ధం గనుక సుదీర్ఘకాలం కొనసాగితే, విమానయాన, రవాణా రంగాల తర్వాత అత్యంత దెబ్బతినేది హోటల్, క్యాటరింగ్ రంగమేనని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నం
ప్రస్తుతానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్ నిల్వలను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చెన్నై నుంచి దిల్లీ వరకు ప్రతి వీధిలోని హోటల్ యజమాని ఇప్పుడు యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని ఆకాశం వైపు చూస్తున్నారు. గ్యాస్ సిలిండర్ రాక ఆగిపోతే, వేలమంది కార్మికుల ఉపాధి దెబ్బతినడమే కాకుండా, దేశీయ ఆహార రంగం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















