PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
US Iran War | 'మన్ కీ బాత్' 132వ ఎపిసోడ్లో పశ్చిమాసియా యుద్ధంతో పాటు టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది సవాళ్లతో కూడుకున్న సమయమని పేర్కొన్నారు.

Iran US War న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాల కారణంగా ప్రధాన ఇంధన రంగాలపై నిరంతరం ప్రభావం పడుతోందని, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం ముదురుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు (మార్చి 29) 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ విదేశాల ప్రజలతో తన ఆలోచనలను పంచుకున్నారు. మన్ కీ బాత్ 132వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘మార్చి నెల ప్రపంచ స్థాయిలో అనేక సంఘటనలతో నిండిపోయింది. గతంలో కోవిడ్ కారణంగా ప్రపంచం మొత్తం సుదీర్ఘకాలం పాటు అనేక సమస్యలను ఎదుర్కొన్నాం. కోవిడ్ సంక్షోభం నుండి బయటపడిన తర్వాత ప్రపంచం కొత్త ఆరంభంతో పురోగతి పథంలో పయనిస్తుందని అంతా ఆశించాం. కానీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో యుద్ధం, సంఘర్షణ పరిస్థితులు నిరంతరం తలెత్తుతూనే ఉన్నాయని’ అన్నారు.
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మిగతా రాష్ట్రాల్లా ప్రశాతంత వాతావరణం కల్పించడంతో అక్కడ క్రికెట్ డెవలప్ అయి ఏకంగా రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కాశ్మీర్ జట్టు నిలవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పలు రంగాల్లో దేశం మరింత ముందుకు వెళ్తోందని, అయితే సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
From Team India's victory in the ICC Men's T20 World Cup to Jammu and Kashmir's maiden Ranji Trophy win, the nation has witnessed moments of sporting excellence.#MannKiBaat pic.twitter.com/tFAex6tQlj
— PMO India (@PMOIndia) March 29, 2026
నెల రోజులుగా భీకర యుద్ధం
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెల రోజులుగా భీకర యుద్ధం జరుగుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో పిఎం మోదీ అన్నారు. మన లక్షలాది కుటుంబాల బంధువులు ఈ దేశాల్లో నివసిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో పని చేస్తున్నారు. ‘నేను గల్ఫ్ దేశాలకు (Gulf Countries) కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అక్కడ ఉన్న కోటి మందికి పైగా భారతీయులకు వారు అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
పుకార్లను నమ్మవద్దు - ప్రధాని మోదీ
ఇది కచ్చితంగా సవాళ్లతో కూడుకున్న సమయం. ఈ సవాళ్ల నుంచి మనమందరం ఐక్యంగా బయటపడాలని 'మన్ కీ బాత్' ద్వారా దేశప్రజలందరినీ మళ్లీ కోరుతున్నాను. దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ విషయంలో సంక్షోభ పరిస్థితి నెలకొంటోంది. మన అంతర్జాతీయ సంబంధాలు, వివిధ దేశాల నుండి అందుతున్న సహకారం, గత దశాబ్ద కాలంలో దేశం నిర్మించుకున్న సామర్థ్యం కారణంగా భారత్ ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటోందని’ ప్రధాని మోదీ తెలిపారు.
Amid the West Asia conflict, PM @narendramodi's appeal to 140 crore Indians.#MannKiBaat pic.twitter.com/wwp8gMV3qY
— PMO India (@PMOIndia) March 29, 2026
అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఏమన్నారంటే
ప్రధాని మోదీ దేశప్రజలను ఫిట్నెస్, ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇప్పుడు 100 రోజుల కంటే తక్కువ సమయం ఉందని, ప్రపంచవ్యాప్తంగా యోగా పట్ల ఆకర్షితులవుతున్నారని ఆయన అన్నారు. ఆఫ్రికాలోని జిబౌటిలో అల్మిస్ జీ తన 'అరవింద్ యోగా సెంటర్' ద్వారా యోగాను ప్రోత్సహిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. ఆయన అక్కడ మరిన్ని ప్రాంతాల్లో ప్రజలకు యోగా నేర్పిస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.
ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ యువరాజ్ దువా తన తండ్రి చక్కెర (sugar) వాడకాన్ని తగ్గించాలని చేసిన విజ్ఞప్తిపై స్పందించినట్లు తెలిపారు. దానివల్ల అతడి తండ్రిపై సానుకూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. దేశప్రజలు కూడా చక్కెర వాడకాన్ని తగ్గించాలని, వంట నూనె వినియోగంలో 10 శాతం తగ్గించాలని సైతం విజ్ఞప్తి చేశారు.
ట్రెండింగ్ వార్తలు























