Vijay Sethupathi: రణబీర్ 'రామాయణ్'లో విభీషణుడిగా విజయ్ సేతుపతి... రూమర్స్పై నోరు విప్పిన మక్కల్ సెల్వన్
Ramayana Update: నితీష్ తివారి దర్శకత్వంలోని 'రామాయణ'లో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాలో విభీషణుడిగా నటిస్తున్నారని వచ్చిన వార్తలపై విజయ్ సేతుపతి స్పందన ఏమిటంటే?

తమిళంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) స్టార్. అభిమానులు ఆయన్ను ముద్దుగా 'మక్కల్ సెల్వన్' అని పిలుస్తారు. తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం లేదు. హిందీలోనూ కొన్ని సినిమాలు చేశారు. పాన్ ఇండియా ప్రేక్షకులకు విజయ్ సేతుపతి తెలుసు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆయన మెప్పించారు. ప్రజెంట్ టాప్ పాన్ ఇండియా స్టార్స్ జాబితాలో చేరారు. పలువురు దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయాలని అకుంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రణబీర్ కపూర్ 'రామాయణ్'లో విజయ్ సేతుపతి నటిస్తున్నారని. ఇప్పుడు ఆ వార్తలపై ఆయన స్పందించారు. అసలు విషయం ఏమిటో చెప్పారు.
రామాయణంలోకి విభీషణుడిగా...
'రామాయణ్' సినిమాలో విభీషణ పాత్రలోకి విజయ్ సేతుపతిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. హిందూ మహాకావ్యమైన రామాయణంలో లంకాధిపతి రావణుడికి విభీషణుడు తమ్ముడు. సినిమాలో ఆ పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఇప్పుడు విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం అవుతున్నారని వార్తలు రాగా... అవి పుకార్లు మాత్రమేనని మక్కల్ సెల్వన్ చెప్పారు. వాటిని ఖండించారు. బాలీవుడ్ మీడియాతో ఆయన మాట్లాడుతూ... ''నేను 'రామాయణ్'లో నటించడం లేదు. ఆ సినిమాలో నేను లేను. ఈ పుకార్లు ఎక్కడ నుండి వస్తున్నాయో నాకు తెలియదు" అని అన్నారు.
'రామాయణ్' గురించి చెప్పాలంటే...
నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న 'రామాయణ్'లో శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరామ చంద్రుని పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్నారు. లక్ష్మీదేవి అవతారమైన సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. లంకాధిపతి, పది తలల రావణుడి పాత్రలో 'కేజీఎఫ్' స్టార్ యష్ కనిపించనున్నారు. సన్నీ డియోల్, రవి దూబే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 'రామాయణ్' రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం దీపావళి 2026న, రెండవ భాగం వచ్చే దీపావళి (2027)న విడుదల అవుతుంది.
























