TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
TS 10th Supply Exams Date | తెలంగాణలో టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ వెల్లడించారు. నేడు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 95.15 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది మొత్తం 5,26,166 మంది టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు. అంతలోనే టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది. పదో తరగతి ఫలితాల విడుదల అనంతరం, ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం విద్యాశాఖ SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ పరీక్షలు జూన్ 5 నుండి జూన్ 12 వరకు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. మార్చి-2026 పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతో పాటు, 2015 CCE పద్ధతి నుండి ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. ://results.bse.telangana.gov.in/ , https://results.bsetelangana.org/ లలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు, ఫీజు వివరాలు
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజును చెల్లించడానికి మే 14, 2026 వరకు గడువు ఇచ్చారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా చెల్లించలేకపోతే, సంబంధిత సబ్జెక్టు పరీక్ష ప్రారంభానికి 2 రోజుల ముందు వరకు రూ. 50 లేట్ ఫీజుతో చెల్లించవచ్చు. హెడ్ మాస్టర్లు విద్యార్థుల వివరాలను ఆన్లైన్ ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారికి (DEO) సమర్పించడానికి మే 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
విద్యార్థులకు సూచన
రీకౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ ఫలితాల కోసం వేచి చూడకుండా, పరీక్షల్లో తప్పిన అభ్యర్థులు వెంటనే సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అధికారులు సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 30 నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు పీవీ శ్రీహరి బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
తమ ఫలితాలపై అసంతృప్తి ఉన్న టెన్త్ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ షెడ్యూల్ను ప్రకటించింది. మార్చి 2026 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ జవాబు పత్రాల పునఃపరిశీలన కోసం ఏప్రిల్ 30 నుండి మే 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలి.
ఫీజులు, దరఖాస్తు విధానం
మార్కుల రీకౌంటింగ్ కోరుకునే వారు ప్రతి సబ్జెక్టుకు రూ. 500 చొప్పున, రీ-వెరిఫికేషన్ (ఆన్సర్ షీట్ ఫోటోకాపీతో కలిపి) కోరుకునే వారు ప్రతి సబ్జెక్టుకు రూ. 1000 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును 'సైబర్ ట్రెజరీ' ద్వారా ఆన్లైన్లో నిర్ణీత హెడ్ ఆఫ్ అకౌంట్కు చెల్లించాలి. దరఖాస్తు చేసే సమయంలో హాల్ టికెట్ జిరాక్స్ కాపీ, హెడ్ మాస్టర్ సంతకం చేసిన కంప్యూటరైజ్డ్ మార్క్స్ మెమో వంటి పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. కేవలం ఆన్లైన్ దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, పోస్టు ద్వారా పంపే దరఖాస్తులను స్వీకరించమని అధికారులు స్పష్టం చేశారు.
ముఖ్యమైన నిబంధనలు
రీ-వెరిఫికేషన్ కింద మార్కుల రీ-టోటలింగ్తో పాటు, అన్ని జవాబులకు మార్కులు వేశారా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ ఏవైనా జవాబులు మూల్యాంకనం చేయకుండా ఉంటే, వాటిని తిరిగి సరిచూస్తారు. అయితే, జవాబు పత్రాల Re-valuation ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విడిగా రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ అవకాశాన్ని విద్యార్థులు గడువులోగా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సూచించారు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదలయ్యాయి. ఎస్సీఈఆర్టీ గోదావరి ఆడిటోరియంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది ఫలితాలను గ్రేడ్లకు బదులు సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ఇచ్చారు. టెన్త్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు తమ పలితాలను అధికారిక వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే, బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మీసేవ వాట్సాప్ నంబరు 8096958096కు Hi అని మెసేజ్ పంపి సూచనలు పాటిస్తూ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చునని అధికారులు సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















