Hyderabad Crime News: హైదరాబాద్లో మహిళా ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య, కేసు నమోదు చేసిన పోలీసులు
Doctor Suicide News | మేడ్చల్ మల్కాజిగిరిలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్లో యువ మహిళా ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

హైదరాబాద్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ మహిళా డాక్టర్ బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సాయిబాబా నగర్లో నివాసముంటున్న 29 ఏళ్ల బత్తిని అనిత శనివారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అవివాహితురాలైన అనిత ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఆమె కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.
ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్న అనిత..
మృతురాలు అనిత ఎల్బీ నగర్లోని షైన్ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సూరారం పోలీసులు, గది తలుపులు తెరిచి చూడగా ఆమె ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. పోలీసులు ఫిజియోథెరపిస్ట్ అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనిత కుటుంబ సభ్యులు, ఆమెతో కలిసి పనిచేసే సహచరుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మానసిక ఒత్తిడి లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో సూరారం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
డాక్టర్ల వరుస మరణాలు..
గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా డాక్టర్లు హత్యకు గురైన, ఆత్మహత్య చేసుకున్న ఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు, కొన్ని చోట్ల వేధింపులు ఈ విషాదాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ విద్యార్థిని ఎం. దీపిక (36) మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అనంతపురం జిల్లాకు చెందిన దీపిక, అనస్థీషియా విభాగంలో ఫైనలియర్ చదువుతూ బుధవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు హాజరయ్యారు. రాత్రి పది గంటల సమయంలో బయటి నుంచి ఆహారం తెప్పించుకుని తిన్న తర్వాత, ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని తోటి విద్యార్థులకు తెలిపారు. విశ్రాంతి తీసుకుంటానని చెప్పి ఆమె అక్కడే ఉండిపోయారు.
అయితే, రాత్రి 11:30 గంటల సమయంలో దీపిక ఆపరేషన్ గదిలోని బల్లపై స్పృహ లేకుండా పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే సీనియర్ వైద్యులు ఆమెకు సీపీఆర్ (CPR) నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రిలోని సిసి కెమెరాలను, హాస్టల్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విచారణకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్
ఈ ఘటనపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విచారణకు ఆదేశించారు. సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, దీపిక తల్లిదండ్రులకు, ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మరణానికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ విషాద ఘటనతో తోటి వైద్య విద్యార్థుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
























