E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు
E20 పెట్రోల్లో క్లోరైడ్ & తేమ అధికంగా ఉన్నట్లు కార్ల తయారీ సంస్థల డేటాలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో 13,000 ppm వరకు తేమ నమోదైనట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.

E20 fuel contamination: E20 పెట్రోల్పై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ఇంధనంలో అధిక స్థాయిలో క్లోరైడ్ & తేమ ఉన్నట్లు కార్ల తయారీ సంస్థలు గతంలోనే ప్రభుత్వానికి తెలిపినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తేమశాతం అనుమతించిన పరిమితి కంటే అతి భారీగా ఉన్నట్లు తాజా వివరాల్లో బయటపడింది.
దేశవ్యాప్తంగా E20 పెట్రోల్పై వాహనదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న వేళ ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. E20లో క్లోరైడ్ స్థాయిలకు తప్పనిసరి పరిమితి విధించాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) గతంలో ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఆ లేఖలో పేర్కొన్న కొన్ని గణాంకాలకు మరింత ధ్రువీకరణ అవసరమని చెప్పి SIAM ఆ సమాచారాన్ని తర్వాత ఉపసంహరించుకుంది.
అయితే రాయిటర్స్ పరిశీలించిన అంతర్గత సమాచారంలో... మారుతి సుజుకి, టాటా మోటార్స్ & మహీంద్రా సంస్థలు E20 ఇంధనంలో కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. ఈ సంస్థలు 21 రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల నుంచి 250కి పైగా ఇంధన నమూనాలను సేకరించి పరీక్షించినట్లు సమాచారం.
ఈ పరీక్షల్లో 18 రాష్ట్రాల్లోని పలు నమూనాల్లో క్లోరైడ్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ అనుమతించిన పరిమితి 3 ppm. కానీ రాజస్థాన్లో 6 నుంచి 570 ppm వరకు, ఢిల్లీ-NCRలో 1.4 నుంచి 420 ppm వరకు, మహారాష్ట్రలో 10 నుంచి 357 ppm వరకు క్లోరైడ్ నమోదైనట్లు డేటా చూపించింది.
Source: Reuters
అధిక స్థాయిలో క్లోరైడ్ ఉంటే వాహనాల్లోని లోహ భాగాలు తుప్పు పట్టే ప్రమాదం ఉంటుంది. ఇంధనంలో తేమ ఎక్కువగా ఉంటే ఇంధనం నింపిన వెంటనే వాహనం పనిచేయకుండా పోయే అవకాశం ఉందని గతంలో SIAM పేర్కొంది.
ఇది కూడా చదవండి: Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక తేమ
తేమ విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని ఇంధన నమూనాల్లో తేమ 13,000 ppm వరకు నమోదైనట్లు రాయిటర్స్ తెలిపింది. ప్రభుత్వం అనుమతించిన పరిమితి 3,000 ppm మాత్రమే. అంటే అనుమతించిన స్థాయి కంటే ఇది 333 శాతం ఎక్కువ.
ఉత్తరప్రదేశ్లోనూ 12,500 ppm వరకు తేమ నమోదైనట్లు డేటా వెల్లడించింది. అయితే, ఇలా తేమ ఎక్కువగా ఉండడానికి అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. పెట్రోల్ బంకుల్లో భూగర్భ ఇంధన ట్యాంకులు & పైపుల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల తేమ పెరిగి ఉండొచ్చని SIAM గతంలో పేర్కొంది.
మరోవైపు, E20పై దేశవ్యాప్తంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చమురు సంస్థలు చెబుతున్నాయి. ఇటీవలే దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించామని, విస్తృత స్థాయిలో ఇంధన కలుషితం ఉన్నట్లు ఆధారాలు కనిపించలేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ఇప్పటివరకు కేవలం నాలుగు కలుషిత కేసులు మాత్రమే గుర్తించినట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
ఇది కూడా చదవండి: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అయితే, కార్ల తయారీ సంస్థల అంతర్గత సమాచారం బయటకు రావడంతో E20పై చర్చ మరోసారి వేడెక్కింది. SIAM మాత్రం ఈ డేటా పరిమిత నమూనాల ఆధారంగా సేకరించిందని, తుది నిర్ణయాలకు ఇది సరిపోదని స్పష్టం చేసింది. పూర్తి శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది.
E20 ఇంధనంపై చమురు కంపెనీలు & వాహన తయారీ సంస్థల నుంచి భిన్నమైన వాదనలు వస్తున్న నేపథ్యంలో.. అసలు ఇంధన నాణ్యతపై స్పష్టత ఎప్పుడు వస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















