BE 6 అగ్నిప్రమాదంపై Mahindra అధికారిక ప్రకటన: కంపెనీ రియాక్షన్ ఎలా ఉందంటే?
ఉత్తరప్రదేశ్లో మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగాయి. టైరు కారణంగానే మంటలు చెలరేగాయని మహీంద్రా స్పష్టం చేసింది. బ్యాటరీ సురక్షితమని తెలిపింది.

Mahindra BE 6 Fire Incident: ఉత్తరప్రదేశ్లోని గులావోతి ప్రాంతం సమీపంలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం ఆటోమొబైల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ SUV ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో, ఎలక్ట్రిక్ కార్ల భద్రతపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే, ఈ ఘటనపై మహీంద్రా సంస్థ వెంటనే స్పందించింది.
కంపెనీ అధికారిక ప్రకటన ఇదే...
కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఈ అగ్నిప్రమాదంలో ఉన్న వాహనంలో ప్రయాణించిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ గాయాలు కాలేదని మహీంద్రా స్పష్టం చేసింది. అదే సమయంలో, ఈ మంటలకు కారణం ఎలక్ట్రిక్ బ్యాటరీ కాదని కూడా స్పష్టంగా వెల్లడించింది.
మహీంద్రా తెలిపిన వివరాల ప్రకారం, BE 6 కారులో వెనుక కుడి వైపు ఉన్న టైరు పూర్తిగా డిఫ్లేట్ అయింది. ఆ స్థితిలోనే కారు సుమారు 10 నిమిషాల పాటు నడిచింది. ఈ సమయంలో కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని కంపెనీ విచారణలో తేలింది. టైరు డిఫ్లేట్ అయిందన్న హెచ్చరికలు డ్రైవర్కు పలుమార్లు వచ్చాయని మహీంద్రా పేర్కొంది. అంతేకాదు, టైరు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందన్న అలర్ట్స్ కూడా కనిపించాయని తెలిపింది.
డిఫ్లేట్ అయిన టైరు కారణంగా రోడ్డుతో ఏర్పడిన అధిక ఘర్షణ వల్ల తీవ్ర వేడి ఉత్పన్నమైంది. అదే మంటలకు ప్రధాన కారణమని మహీంద్రా వివరించింది. ఈ సమయంలో వాహనంలో ఉన్న ఎలక్ట్రానిక్ సేఫ్టీ సిస్టమ్స్ పూర్తిగా పనిచేశాయని కంపెనీ పేర్కొంది. స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వ్యవస్థలు పలుమార్లు యాక్టివ్ అయ్యి, వీల్ స్పిన్ను నియంత్రించేందుకు ప్రయత్నించాయి.
భద్రతా చర్యల్లో భాగంగా, వాహనం వేగాన్ని ఎలక్ట్రానిక్గా తగ్గించారు. ఆ తర్వాత డ్రైవ్ సిస్టమ్ను పూర్తిగా షట్డౌన్ చేసి, కారును ఆపేశారని మహీంద్రా వెల్లడించింది. వీడియో ఫుటేజ్ను పరిశీలించిన తర్వాత కూడా, ఆ మంటలు టైరు నుంచే మొదలయ్యాయని నిర్ధారణకు వచ్చామని కంపెనీ తెలిపింది.
హై-వోల్టేజ్ బ్యాటరీ పూర్తిగా సురక్షితం
ఈ ఘటనలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే - ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఎక్కువ మంది భయపడే హై-వోల్టేజ్ బ్యాటరీ పూర్తిగా సురక్షితంగా ఉందని మహీంద్రా స్పష్టం చేసింది. తీవ్రమైన బాహ్య ఉష్ణోగ్రత ప్రభావం ఉన్నప్పటికీ, బ్యాటరీ ప్యాక్కు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. బ్యాటరీ హెల్త్ పారామీటర్లు, సెల్ వోల్టేజీలు అన్నీ నిర్దేశిత పరిమితుల్లోనే ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ మోటర్ కూడా పూర్తిగా సురక్షితంగానే ఉందని తెలిపింది.
హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దు
ఈ ఘటన తర్వాత కూడా ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై స్పష్టత తీసుకురావడం కోసం పూర్తిస్థాయి పరిశీలన చేస్తున్నామని మహీంద్రా తెలిపింది. డ్రైవింగ్ సమయంలో వచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదన్న సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని ఆటో నిపుణులు చెబుతున్నారు.
భారత మార్కెట్లో మహీంద్రా BE 6 మిడ్సైజ్ ఎలక్ట్రిక్ SUVగా అందుబాటులో ఉంది. ఈ మోడల్కు 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. BE 6 ధరలు రూ. 19.65 లక్షల నుంచి రూ. 27.65 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.






















