Komatireddy Rajagopal Reddy: పార్టీ, ప్రభుత్వం కంటే రైతులే ముఖ్యం - మరోసారి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు వ్యాఖ్యలు
Rajagopal Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వదిలి పెట్టడం లేదు. భూములుపోయే రైతుల కోసం కొట్లాడాలని నిర్ణయించుకున్నారు.

Rajagopal Reddy Vs Congress : మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులకు మీ కోసం కొట్లాడుతానని హమీ ఇచ్చారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి RRR దక్షిణ భాగం రహదారి వెళ్తున్న నియోజకవర్గాల శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలుస్తామని ప్రకటించారు.
RRR దక్షిణ భాగం రహదారి నిర్మాణంలో భాగంగా మునుగోడు నియోజకవర్గం లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ పట్టణం, చౌటుప్పల్ , నారాయణ్ పూర్ , గట్టుప్పల్ , మర్రిగూడెం మండలాలకు చెందిన భూ నిర్వాసితులు మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని కలిశారు. దక్షిణ భాగంలో అలైన్మెంట్ మార్చారని, దివీస్ కంపెనీ కి లాభం చేకూరేలా రైతుల పొట్ట కొడుతున్నారని రాజ్ గోపాల్ రెడ్డి కి వారు ఫిర్యాదు చేశారు. భూమి పోతే జీవనమే పోతుందని మాకు న్యాయం చేయాలని భూమికి భూమి ఇవ్వడమే మా నినాదం అని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులకు రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు.
భూమికి రైతుకు మధ్య బావోద్వేగ బంధం ఉంటుందని.. ఇది చాలా సున్నితమైన సమస్య అన్నారు. భూమి కోల్పోతున్న బాధలో మీరు పడుతున్న ఆవేదనకు మీరు చేస్తున్న డిమాండ్లతో నేను ఏకీభవిస్తున్నానని తెలిపారు. పార్టీ కంటే, ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యం అనే భావనతో ఆలోచన చేస్తున్నానని తెలిపారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి RRR దక్షిణ భాగం రహదారి వెళ్తున్న నియోజకవర్గాల శాసనసభ్యులతో కూడా మాట్లాడుతున్నానని. ఈ విషయంలో అందరు ఎమ్మెల్యే లు ఆవేదనతో ఉన్నారన్నారు. అధికార పార్టీ లో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన మాట్లాడతానని.. పదవి అంటే కిరీటం కాదు పదవి అంటే బాధ్యత అన్నారు. ధర్మం వైపు న్యాయం వైపు ఉంటాడు రాజ్ గోపాల్ రెడ్డి అని ప్రకటించారు.
సగం మునుగోడు నియోజకవర్గం RRR లో కలుస్తుంది ..అలైన్ మెంటు మార్చడానికి కారణాలను రైతులకు వివరించి ఒప్పించి నిర్ణయం తీసుకోవాలన్నారు. మీకు న్యాయం చేసేవారి వైపు, మీకోసం కొట్లాడే వారి వైపు ఉండండి అని కోరారు. 2017 లో శివన్నగూడెం ప్రాజెక్టు ను ప్రారంభించారు... కానీ పరిహారం మాత్రం 2023 లో నేను రాజీనామా చేసిన తరువాత పూర్తి చేశారు .. .. భూ నిర్వాసితులకు ఎన్ని పార్టీలు అయినా ఉండని, మీకు నాయ్యం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాన్నారు. ఉత్తర భాగం లోనే అలైన్ మెంట్ విషయంలో తప్పు జరిగింది.. ఇపుడు దక్షిణ భాగంలో కూడా ఆ తప్పు ను కొనసాగిస్తున్నారని.. దానిపై కొట్లాడుతానన్నారు.
ట్రెండింగ్ వార్తలు





















