Kamareddy Update: కామారెడ్డిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ - భూకబ్జా ఆరోపణలతో సవాళ్లు - రణరంగమే!
Kamareddy tense conditions : కామారెడ్డి లో కాంగ్రెస్, బీజేపీ ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూకబ్జా ఆరోపణలతో ఎమ్మెల్యే, కాంగ్రెస్ కార్యకర్తలు సవాళ్లు ఈ ఉద్రిక్తతకు దారి తశాయి.

Clash between Congress and BJP workers in Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజకీయ సెగలు ఒక్కసారిగా మిన్నంటాయి. భూముల కబ్జా ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు విసురుకున్న సవాళ్లతో పట్టణం యుద్ధవాతావరణాన్ని తలపించింది. కామారెడ్డిలో గత కొద్దిరోజులుగా సాగుతున్న భూకబ్జా ఆరోపణలు బహిరంగ చర్చకు దారితీశాయి.
బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అరోరా భూములను కబ్జా చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను సవాల్గా తీసుకున్న ఎమ్మెల్యే, దమ్ముంటే తన క్యాంప్ ఆఫీస్ వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ శ్రేణులు చర్చకు సిద్ధమవ్వడంతో ఉద్రిక్తత మొదలైంది. ఎమ్మెల్యే సవాల్ను స్వీకరించి, కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ గిరి రెడ్డి మహేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. కాంగ్రెస్ నాయకులు నేరుగా ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ అప్పటికే వేచి ఉన్న బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.
ఈ ఘర్షణ హింసాత్మక రూపం దాల్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుపై దాడికి దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఉద్రేకంతో కారును అమాంతం బోల్తా పడేయడం * కలకలం రేపింది. ఈ అనూహ్య ఘటనతో అక్కడ ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది.
బీజేపీ అంటే మామూలుగా ఉండదు మరి
— RAKESH BURUGULA🇮🇳 (@RakeshBurugula) February 21, 2026
MLA డౌన్ డౌన్ అన్నందుకు కాంగ్రెస్ నాయకుడి కారు ఉల్టా పల్టా చేసిన బీజేపీ కార్యకర్తలు.
కామారెడ్డిలో అట్టుడుకుతున్న కామారెడ్డి
బీజేపీ కాంగ్రెస్ మధ్య వేడెక్కిన రాజకీయం pic.twitter.com/Bm4StwHXK6
శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. చర్చకు వెళ్లకుండా ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డిని ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికార పక్షం అండతోనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఘర్షణలు జరగకుండా పట్టణంలోని పలువురు ముఖ్యమైన బీజేపీ మరియు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచే నేతల ఇళ్ల వద్ద నిఘా పెంచారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టడంతో పాటు, అనుమానితులను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులతో రాజకీయ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది.
చర్చా వేదికగా ప్రకటించిన శిశు మందిర్ పాఠశాల పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి, అపరిచిత వ్యక్తులు ఎవరినీ అటువైపు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. వందలాది మంది పోలీసుల మోహరింపుతో ఆ ప్రాంతం కర్ఫ్యూను తలపించింది. మీడియా ప్రతినిధులను కూడా పరిమితంగానే అనుమతించారు. చర్చా వేదిక నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శనగా బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వైపు వెళ్లడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు ముఖాముఖి ఎదురుపడటంతో వాగ్వాదం మొదలై, అది కాస్తా తీవ్ర స్థాయి దాడులకు దారితీసింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ గందరగోళంలో కాంగ్రెస్ నాయకుడికి చెందిన కారును బీజేపీ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకున్నారు.
పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కారు బోల్తా పడిన ఘటన తర్వాత మరింత ఘర్షణ జరగకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇరు వర్గాలను చెదరగొట్టి, క్యాంప్ ఆఫీస్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కామారెడ్డిలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. బహిరంగ చర్చ పేరుతో మొదలైన ఈ వివాదం భౌతిక దాడుల వరకు వెళ్లడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు హౌస్ అరెస్టులు, మరోవైపు రోడ్లపై దాడులతో జిల్లా కేంద్రం స్తంభించిపోయింది. గొడవకు కారణమైన ప్రధాన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు.























