KTR News: అంతర్జాతీయ వేదికలపై భారత్ పరువు తీయొద్దు.. AI సమ్మిట్లో కాంగ్రెస్ నిరసనపై కేటీఆర్
Youth Congress Protests at Global AI Summit | రాజకీయాలు చేయడానికి ఓ హద్దు, సమయం ఉంటుందని అంతర్జాతీయ వేదికలపై నిరసన తెలిపి భారత్ పరువు తీయవద్దని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూచించారు.

హైదరాబాద్: న్యూఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్ను కాంగ్రెస్ నేతలు విమర్శల కోసం వాడుకుని అంతర్జాతీయ వేదికపై దేశం పరువు తీస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' వేదికను యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ రాజకీయ ప్రదర్శనలకు వేదికగా మార్చుకోవడం అత్యంత విచారకరం అన్నారు.
కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న అతిపెద్ద గ్లోబల్ ప్లాట్ఫారమ్ను కాంగ్రెస్ నేతలు తమ నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే అయినప్పటికీ, ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని హితవు పలికారు.
It is absolutely deplorable that members of the Youth Congress chose the AI Impact Summit 2026 as a venue for petty political theatrics
— KTR (@KTRBRS) February 21, 2026
Using such a global platform for protests will project our great nation India in a poor light internationally
While difference of opinion is… pic.twitter.com/sM3MmIb8UJ
రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి సమయం, సందర్భం ఉంటాయని, అంతర్జాతీయ సదస్సులు ఖచ్చితంగా అందుకు సరైన వేదికలు కావని కేటీఆర్ పేర్కొన్నారు. . అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, అదే సదస్సులో తమ సొంత పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. ఇలాంటి చర్యలు అభివృద్ధి లక్ష్యాలను పక్కదారి పట్టించడమే కాకుండా, దేశ గౌరవానికి విఘాతం కలిగిస్తాయని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఏఐ కౌన్సిల్, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి: రేవంత్ రెడ్డి
ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధస్సును (AI) సమర్థవంతంగా వినియోగించుకోవడానికి జాతీయ స్థాయిలో ఏఐ కౌన్సిల్, ప్రత్యేక 'ఏఐ మంత్రిత్వ శాఖ'ను ఏర్పాటు చేయాలని ఢిల్లీలో జరిగిన సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రత, చట్టపరమైన రక్షణ కోసం ఈ చర్యలు అవసరమని పేర్కొన్నారు. అలాగే, ఏఐ పురోగతిని పర్యవేక్షించేందుకు హైదరాబాద్లో 'జాతీయ ఏఐ వార్రూమ్' ఏర్పాటుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు.
భారత ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో దేశంలోనే తొలి 'ఏఐ స్టార్టప్ విలేజ్'ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఏఐ అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదని, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలనకు అది ఒక శక్తివంతమైన సాధనంగా మారాలని ఆకాంక్షించారు. ఈ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ, అవగాహన పెంచేందుకు ఏడాదికి రెండుసార్లు వివిధ నగరాల్లో ఏఐ సమ్మిట్లు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. భారత్ సేవల రంగంలోనే పురోగతి సాధించిందని, గూగుల్, మెటా, వాట్సాప్ వంటి ప్లాట్ఫార్మ్లను సృష్టించలేకపోయామని పేర్కొన్నారు. ఇప్పుడు ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకుని, భారత్ సైతం ప్లాట్ఫార్మ్ క్రియేటర్ గా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
























