Hyderabad Metro Takeover: తుది దశకు హైదరాబాద్ మెట్రో టేకోవర్.. IDBI ఫైనాన్స్ రిపోర్ట్ సైతం రెడీ
Hyderabad Metro Takeover: హైదరాబాద్ మెట్రో రైలును తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ చేసుకోవడంపై కీలక అప్డేట్ వచ్చింది. ఇందుకు సంబంధించిన రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

Hyderabad Metro Rail Project | హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం టేకోవర్పై కీలక అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునే (Takeover) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా, అంటే మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఫైనాన్స్, టెక్నికల్ స్టడీ రిపోర్టులు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ మెట్రో టేకోవర్కు సంబంధించి సాంకేతిక సలహాదారుగా డీఎంఆర్సీ (DMRC) వ్యవహరిస్తుండగా, ఆర్థిక & న్యాయపరమైన అంశాల అధ్యయనాన్ని ఐడీబీఐ పూర్తి చేసింది.
ప్రస్తుతం మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన నివేదికను రూపొందించింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL), ఎల్ అండ్ టీ మధ్య ఉన్న ఒప్పందాల మార్పులపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేసిన తుది నివేదికలను ఈ నెల 23న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్స్, టెక్నికల్ స్టడీ రిపోర్టులపై చర్చించనున్నారు. ఆ నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిన వెంటనే టేకోవర్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి తేదీలోపు హైదరాబాద్ మెట్రో ప్రభుత్వం టేకోవర్ చేసుకుంటుంది.
The Proposed Phase II-B Expansion of #HyderabadMetro
— 🇮🇳 Exploreinindia 🌐 (@exploreinindia) February 20, 2026
Cost: ₹19,579 Cr
Total Length 86.1 km
1️⃣Airport RGIA to Future City (Skills University) 39.6 km
2️⃣Jubilee Bus Station to Medchal 24.5km
3️⃣Jubilee Bus Station to Shamirpet 22km
DPR has been submitted to the Centre for approval pic.twitter.com/gLpXKZMcwq
హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటీవల అధికారిక లేఖ రాశారు. ఇటీవల తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యానని, మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి లేఖలో సూచించారు.
అధికారుల కమిటీ ఏర్పాటు - రాష్ట్రానికి పిలుపు
మెట్రో రెండో దశ పనుల పర్యవేక్షణ, సమన్వయం కోసం ఒక నలుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో కేంద్రం తరఫున ఇద్దరు, రాష్ట్రం తరఫున ఇద్దరు అధికారులు ఉంటారు. ఈ కమిటీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదించే ఇద్దరు అధికారుల పేర్లను వెంటనే పంపాలని కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రాజెక్టు రూపకల్పన, నిధుల కేటాయింపు మరియు అమలు తీరుపై ఈ కమిటీయే తుది నిర్ణయాలు తీసుకోనుంది.
హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ స్వాధీనం - కీలక నిబంధన
మెట్రో మొదటి దశకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు పూర్తయిన తర్వాతే రెండో దశ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ (L&T) ఆధ్వర్యంలో ఉన్న మెట్రో నెట్వర్క్ను రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునే ప్రక్రియ ముగిసిన తర్వాతే, రెండో దశకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి కొన్ని రోజుల కిందటే సూచించారు. ఈ సాంకేతిక అడ్డంకులు తొలగితేనే కేంద్రం నుండి నిధుల విడుదల, సహకారం తేలిక అవుతుందని వివరించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్ II-B విస్తరణ.. రూ. 19,579 కోట్లతో భారీ ప్రణాళిక
హైదరాబాద్ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్ మెట్రో రెండో దశ (Phase II-B) విస్తరణకు సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును మొత్తం 86.1 కిలోమీటర్ల పొడవునా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ విస్తరణ కోసం సుమారు రూ. 19,579 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) ఇప్పటికే ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు.
ముఖ్యమైన మెట్రో మార్గాలు, దూరం:
ఈ రెండో దశ విస్తరణలో భాగంగా నగరాన్ని నలుమూలలా అనుసంధానించేలా మూడు ప్రధాన మార్గాలను ప్రకటించారు.
ఎయిర్పోర్ట్ (RGIA) నుండి ఫ్యూచర్ సిటీ వరకు
శంషాబాద్ విమానాశ్రయం నుండి స్కిల్ యూనివర్సిటీ ఉన్న ఫ్యూచర్ సిటీ వరకు అత్యంత పొడవైన మార్గాన్ని నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 39.6 కిలోమీటర్లు.
జేబీఎస్ (JBS) నుండి మేడ్చల్ వరకు
జూబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చల్ వరకు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించేలా 24.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ విస్తరించనున్నారు.
జేబీఎస్ నుండి శామీర్పేట్ వరకు
జూబ్లీ బస్ స్టేషన్(JBS) నుండి శామీర్పేట్ వైపు మరో 22 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు.
ట్రెండింగ్ వార్తలు























