DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, చంచల్గూడ జైలుకు తరలింపు
DSP Bheem Reddy Arrest: అక్రమాస్తుల కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డికి ఏసీబీ (ACB) కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు అనంతరం అధికారులు భీమ్ రెడ్డిని చంచల్గూడ కేంద్ర జైలుకు తరలించారు. గత గురువారం డీఎస్పీ భీంరెడ్డి ఇల్లుతో పాటు ఆయనకు సంబంధించిన మరో 15 ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధికారుల కళ్లు చెదిరేలా భారీగా అక్రమాస్తులు వెలుగుచూశాయి. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోమవారం (జులై 6న) ఆయనను అరెస్టు చేశారు.
అస్వస్థత అంటూ డ్రామాలు..! ఎట్టకేలకు డీఎస్పీ అరెస్ట్
నిజానికి సోదాలు జరిగిన గురువారమే డీఎస్పీ భీంరెడ్డిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. అయితే తనిఖీలకు వచ్చిన ఏసీబీ అధికారులను చూడగానే ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలిసిందే. దీంతో అధికారులు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తనిఖీల అనంతరం కేవలం కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి వెనుదిరిగారు. మరోవైపు రోజులు గడుస్తున్నా ఆదాయానికి మించి ఆస్తులున్న ఉన్నతాధికారిని అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పలువురి నుంచి ఫిర్యాదులు కూడా రావడంతో ఏసీబీ అధికారులు ఎట్టకేలకు నిన్న సాయంత్రం డీఎస్పీ భీంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయనకు రెండు వారాల రిమాండ్ విధించింది.
ట్రెండింగ్ వార్తలు























