Ind vs WI Highlights: సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. విండీస్పై నెగ్గి సెమీఫైనల్స్ చేరిన టీమిండియా
India vs West Indies | ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచులో వెస్టిండీస్ జట్టుపై 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ చేరింది.

Ind vs WI T20 World Cup 2026 | కోల్కతా: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్స్కు టీమిండియా దూసుకెళ్లింది. సూపర్ 8లో భాగంగా ఆదివారం రాత్రి కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ (50 బంతుల్లో 97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా మరో 4 బంతులు మిగిలుండగానే టార్గెట్ ఛేదించింది. తద్వారా గ్రూప్ లో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్స్ చేరుకుంది.
అభిషేక్ మళ్లీ ఫెయిల్..
196 పరుగుల భారీ టార్గెట్, అందులోనూ ఈడెన్ గార్డెన్స్ లో హయ్యెస్ట్ రన్ ఛేజింగ్ కోసం బరిలోకి దిగిన భారత్ కు త్వరగానే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (10) మరోసారి ఫెయిల్ అయ్యాడు. వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (10) హోల్డర్ బౌలింగ్ లో త్వరగా ఔట్ కావడంతో టెన్షన్ మొదలైంది. ముందున్నది కొండంత టార్గెట్ డాషింగ్ బ్యాటర్లు ఇద్దరు త్వరగా ఔటయ్యారు. తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి, మరో ఓపెనర్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్ నడిపించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18) జోసెఫ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో జట్టు బ్యాటింగ్ భారం సంజూ శాంసన్ తన భుజాలకెత్తుకున్నాడు.
తిలక్, పాండ్యాతో కీలక భాగస్వామ్యాలు..
సూర్య ఔయ్యాక క్రీజులోకి వచ్చిన తెలుగుతేజం తిలక్ వర్మతో కలిసి సంజూ శాంసన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగారు. మొదట్లో ఇబ్బందిపడ్డా తిలక్ సైతం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. నాలుగో వికెట్ కు 42 పరుగుల భాగస్వామ్యం తరువాత తిలక్ వర్మ (15 బంతుల్లో 27)ను హోల్డర్ ఔట్ చేశాడు. హెట్మెయర్ పట్టిన సూపర్ క్యాచ్కు భారత్ తిలక్ వికెట్ కోల్పోయింది. కాసేపు మెరుపులు మెరిపించిన తిలక్ విజయానికి కావాల్సిన రన్ రేట్ తగ్గించాడు. చివర్లో 19వ ఓవర్లో శివం దుబే (8 నాటౌట్) రెండు ఫోర్లు కొట్టి విజయానికి చేరువచేశాడు. అయితే చివరి ఓవర్ తొలి బంతికి అద్భుతమైన సిక్స్ కొట్టిన సంజూ శాంసన్, ఆ మరుసటి బంతిని ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించి సెమీఫైనల్స్ చేర్చాడు. కానీ 50 బంతుల్లో 12 ఫోర్లు, 44 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సంజూ శాంసన్ సెంచరీ మార్క్ చేరుకోలేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, షెమర్ జోసెఫ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, హోసెన్ కు ఒక వికెట్ దక్కింది.
Cometh the hour, cometh Sanju Samson! 🫡
— BCCI (@BCCI) March 1, 2026
9⃣7⃣*(50) - A knock for the ages to take #TeamIndia into the semi-finals 👏
Scorecard ▶️ https://t.co/ur4pr8Bi3K#T20WorldCup | #MenInBlue | #INDvWI | @IamSanjuSamson pic.twitter.com/ftJRp2wMTE
భారీ స్కోరు చేసిన వెస్టిండీస్..
వెస్టిండీస్ జట్టు మొదట బ్యాటింగ్కు దిగి 195 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇది నాలుగో అత్యధిక స్కోరు. భారత జట్టు సెమీఫైనల్కు వెళ్లాలంటే, ఈ మైదానంలో టీ20ల్లోనే అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. కోల్కతాలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కరేబియన్ బ్యాటర్లు చివరి 30 బంతుల్లో ఏకంగా 75 పరుగులు పిండుకున్నారు.
భారత్ ఎదుట అతిపెద్ద రన్ ఛేజ్
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక రన్ ఛేజ్ కేవలం 158 పరుగులు మాత్రమే. ఇక్కడ అత్యధిక రన్ ఛేజ్ రికార్డు భారత్ పేరిటే ఉంది. గతంలో వెస్టిండీస్పైనే 158 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. ఇక్కడ ఎప్పుడూ 160 పరుగులు కూడా ఛేజ్ చేయని పరిస్థితుల్లో, నేటి మ్యాచ్లో టీమ్ ఇండియా దానికంటే 36 పరుగులు ఎక్కువగా చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్, రోస్టన్ చేజ్ జట్టుకు నెమ్మదైనప్పటికీ స్థిరమైన ప్రారంభాన్ని అందించారు. వీరిద్దరూ మొదటి వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా, వరుణ్ చక్రవర్తి ఈ జోడీని విడదీశాడు. ఒకానొక సమయంలో వెస్టిండీస్ జట్టు 9 ఓవర్లలో కేవలం 69 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చివరి 11 ఓవర్లలో 126 పరుగులు
మొదటి 9 ఓవర్లలో 69 పరుగులు రాగా, తర్వాతి 11 ఓవర్లలో వెస్టిండీస్ ఏకంగా 126 పరుగులు జోడించింది. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో జేసన్ హోల్డర్, రోవ్మన్ పావెల్ విధ్వంసం సృష్టించి 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి 5 ఓవర్లలో వెస్టిండీస్ 75 పరుగులు సాధించింది. హోల్డర్ 22 బంతుల్లో 37 పరుగులు, పావెల్ 19 బంతుల్లో 34 పరుగులు చేశారు. భారత బౌలర్లందరూ పరుగులు సమర్పించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి మరియు హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు.





















