Adulterated ghee politics: కల్తీ నెయ్యి వ్యవహారాన్ని జగన్ ఎందుకు నెత్తికెత్తుకున్నారు? - వైసీపీ వ్యూహాత్మక తప్పిదం చేసిందా?
Andhra Ghee politics: కల్తీ నెయ్యి ఆరోపణలు తనపైనే చేసినట్లుగా జగన్ భావించి రాజకీయ ఎదురుదాడి చేస్తున్నారు. ఆయనే చేయించారని..చేశారని ఇప్పటి వరకూ ఎవరూ చెప్పలేదు. ఇక్కడే వైసీపీ వ్యూహాత్మక తప్పిదం చేసిందా?

Adulterated ghee Jagan Politics: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ వివాదాన్ని డీల్ చేయడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన తీరు, ఆయన వ్యూహకర్తల వైఫల్యాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఇష్యూలో జగన్ రక్షణాత్మక ధోరణి కంటే వివాదాన్ని తన చుట్టూ తిప్పుకునే రాజకీయం చేస్తున్నారు. అసలు కల్తీ ఏదో తానే చేయించినట్లుగా ఆరోపిస్తున్నట్లుగా భావించి ఎదురుదాడి చేస్తున్నారు. స్పేస్ లేకపోయినా హెరిటేజ్ వంటి కంపెనీలను లాక్కొచ్చి మరింత చర్చ జరిగేలా చేస్తున్నారు.
టీటీడీ నెయ్యి కొనుగోలుతో అప్పటి ప్రభుత్వానికి ఏం సంబంధం?
టీటీడీ అనేది ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. నెయ్యి కొనుగోళ్లు, టెండర్ల ప్రక్రియ అంతా బోర్డు మరియు, అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించినప్పుడు, జగన్ దానిని ఒక వ్యవస్థాగత లోపం గా చూడాల్సింది. కానీ, ఆయన వెంటనే స్పందిస్తూ.. తన ప్రభుత్వంపై, తనపై వ్యక్తిగత దాడి జరిగినట్లుగా భావించి డిఫెన్స్లోకి వెళ్లారు. ఇది ప్రజల్లోకి ఏదో తప్పు జరిగింది కాబట్టే ఇంతగా స్పందిస్తున్నారు అనే సంకేతాన్ని పంపింది.
బాధ్యులపై చర్యల డిమాండ్ చేయకపోవడం
ఈ వివాదంలో జగన్ చేసిన అతిపెద్ద పొరపాటు.. కల్తీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేయకపోవడం. ఒకవేళ ఆయన నెయ్యి కల్తీ జరిగి ఉంటే అది పాపం, బాధ్యులను శిక్షించాలి, నిజనిజాలు తేల్చాలి అని ముందే ప్రకటించి ఉంటే, బంతి ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్టులోకి వెళ్లేది. అలా కాకుండా, అసలు కల్తీ జరగలేదని వాదించడం ద్వారా, ఆయన పరోక్షంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సరఫరాదారులను వెనకేసుకొస్తున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు.
రిపోర్టుల విషయంలో గందరగోళ ప్రచారం
సిట్ చార్జిషీటు దాఖలు చేసినప్పుడు అందులో తనకు క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేసుకోవడంపైనే జగన్ బృందం ఫోకస్ పెట్టింది. అయితే సామాన్య భక్తులకు కావాల్సింది జగన్కు క్లీన్ చిట్ వచ్చిందా లేదా అన్నది కాదు, లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నది. ప్రజల సెంటిమెంటును అర్థం చేసుకోవడంలో జగన్ వ్యూహకర్తలు విఫలమయ్యారు. కేవలం టెక్నికల్ అంశాలను పట్టుకుని రాజకీయం చేయడం వల్ల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
హెరిటేజ్ను లాగేస్తే వివాదం ఎలా ముగుస్తుంది?
ప్రస్తుత ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే క్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ను వివాదంలోకి లాగడం కూడా జగన్ వ్యూహ బృందం చేసిన మరో తప్పిదంగా వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు హెరిటేజ్ పిటిషన్పై స్పందిస్తూ సాక్షి మీడియాకు నోటీసులు ఇవ్వడం, కంటెంట్ తొలగించమనడం జగన్ ఇమేజ్ను మరింత దెబ్బతీసింది. సాక్ష్యాలు లేకుండా పారిశ్రామిక సంస్థలపై ఆరోపణలు చేయడం వల్ల రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
మతపరమైన అంశం హాట్ టాపిక్
నెయ్యి వివాదాన్ని సరిగ్గా డీల్ చేయకపోవడం వల్ల అది క్రమంగా జగన్ మతం, డిక్లరేషన్ అంశం వైపు మళ్లింది. కల్తీ నెయ్యిపై చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని భక్తి , విశ్వాసంతో ముడిపెట్టి సమాధానం చెప్పలేకపోవడం వల్ల, ప్రత్యర్థులు ఆయన వ్యక్తిగత విశ్వాసాలను టార్గెట్ చేసే అవకాశం కల్పించినట్లయింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని హిందూ ఓటు బ్యాంకుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. తిరుమల లడ్డూ అంశంలో జగన్ మోహన్ రెడ్డి ,యన సోషల్ మీడియా, వ్యూహ బృందం అనుసరించిన పద్ధతి డిఫెన్సివ్ గా కాకుండా రియాక్టివ్ గా ఉంది. వ్యవస్థను రక్షించే నాయకుడిగా కనిపించాల్సింది పోయి, తనను తాను సమర్థించుకునే వ్యక్తిగా ఆయన మిగిలిపోయారు. టీటీడీ స్వతంత్రతను అడ్డం పెట్టుకుని రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన ఆయన, వివాదాన్ని తన ఇంటి దాకా తెచ్చుకోవడం ఒక పెద్ద వ్యూహాత్మక లోపంగా మారింది. టీడీపీ దీన్ని ఉపయోగించుకుని కల్తీ నెయ్యి తప్పిదానికి ఆయననే బాధ్యుడ్ని చేయడానికి ప్రయత్నిస్తోంది.























