APEPDCL పరిధిలో మొత్తం 2,947 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్లు, జూనియర్ లైన్ మెన్, అసిస్టెంట్ లైన్ మెన్, లైన్మెన్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.
APEPDCL Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలోనే మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
APEPDCL Jobs: ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ఖాళీగా ఉన్న 2,947 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు.

APEPDCL Jobs: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. గురువారం అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు.
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మొత్తం 2,947 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి వివరాలను మంత్రి సభకు వెల్లడించారు. ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్ మెన్ 1,260, అసిస్టెంట్ లైన్ మెన్ 1,084, లైన్మెన్ 22 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని గొట్టిపాటి పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 8,770 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందితో విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖలో ఏఈలు, లైన్ మెన్ల కొరత లేకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లో-వోల్టేజ్ సమస్యలు లేకుండా, నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఇంధన శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పునరుద్ఘాటించారు. విద్యుత్ లోడ్ ఆధారంగా అవసరమైన చోట కొత్త సబ్ స్టేషన్లను మంజూరు చేస్తున్నామని, ఎలక్ట్రికల్ డీఈ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని సభ్యులకు మంత్రి గొట్టిపాటి వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 22,30,703 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని అసెంబ్లీలో మంత్రి ప్రకటించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన మరో ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ తో పాటు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు డిస్కంల పరిధిలో 1,02,538 కొత్త ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
మరో 46 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపిన మంత్రి గొట్టిపాటి.. వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్లో ఉన్న కనెక్షన్లను కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో మూడు డిస్కంల పరిధిలో రూ.839.44 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 2,61,481 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టుల అమలుతో విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1059 కోట్లు ఆదా అవుతుందని పేర్కొన్నారు.
11 కేవీ లైన్ల దగ్గర సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా వినియోగదారులకు 25 సంవత్సరాల పాటు ఒకే విధమైన టారిఫ్తో విద్యుత్ అందించవచ్చని మంత్రి తెలిపారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ జరుగుతోందని, 1035 మెగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. రాబోయే మే నెల నుంచి సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు.
2028–30 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులకు ఉదయం వేళల్లోనే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించగలమని మంత్రి చెప్పారు. గృహ, పారిశ్రామిక, వ్యాపార వర్గాలతోపాటు రైతులకు కూడా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే రాష్ట్ర విద్యుత్ శాఖ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
Frequently Asked Questions
APEPDCLలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి?
రాష్ట్రంలో ఎన్ని ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి?
రాష్ట్రవ్యాప్తంగా 22,30,703 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,02,538 కొత్త కనెక్షన్లు మంజూరు చేశారు.
పీఎం కుసుమ్ పథకం కింద ఎన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు?
పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 2,61,481 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టుల అమలుతో విద్యుత్ కొనుగోళ్లపై రూ.1059 కోట్లు ఆదా అవుతుంది.
సోలార్ ప్లాంట్ల నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
రాబోయే మే నెల నుంచి సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. 1035 మెగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచారు.























