Women Reservation Bill: ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్లదే వ్యూహం - బీజేపీ 'ఓటమి' వెనుక దాగున్న భారీ ప్లాన్ అదేనా?
BJP: రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోతుందనితెలిసి కూడా బీజేపీ ఎందుకు ముందుకు వెళ్లింది? బీజేపీ తదుపరి యాక్షన్ ప్లానే దానికి సమాధానం చెప్పనుంది.

grand plan hidden behind the BJP defeat : రాజకీయాల్లో ఎప్పుడు ముందుకు వెళ్లాలో, ఎప్పుడు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గాలో తెలిసిన వాళ్లే అసలైన చాణక్యులు. తాజా పార్లమెంట్ పరిణామాలు గమనిస్తే, బీజేపీ రాజ్యాంగసవరణ బిల్లు ఓడిపోతుందని తెలిసి కూడా ఎందుకు ఓటింగ్కు వెళ్లిందనే అంశంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇది కేవలం ఒక బిల్లు ఓటమి కాదు, ఇండీ కూటమి కోసం వేసిన ఒక భారీ రాజకీయ ఉచ్చుగా భావిస్తున్నారు.
తెలిసే వేసిన ఎత్తుగడ
లోక్సభలో రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ తమకు లేదని ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ముందే తెలుసు. నిజంగా ఈ బిల్లును నెగ్గించుకోవడమే లక్ష్యమైతే, గతంలో ఆర్టికల్ 370 లేదా ఇతర కీలక బిల్లుల సమయంలో చేసినట్లుగా తెరవెనుక మంత్రాంగాలు నడిపి, ఇతర పార్టీల మద్దతు కూడగట్టేవారు. కానీ, ఈ సారి ప్రభుత్వం కేవలం సభా వేదికగా విజ్ఞప్తి చేయడానికే పరిమితమైంది. అంటే, ఈ బిల్లు నెగ్గడం కంటే, అది వీగిపోవడం ద్వారా వచ్చే రాజకీయ మైలేజీపైనే బీజేపీ కన్నేసినట్లు కనిపిస్తోంది.
డీలిమిటేషన్ - ఒక రాజకీయ ఆయుధం
మహిళా రిజర్వేషన్ బిల్లును విడిగా పెట్టి ఉంటే ప్రతిపక్షాలు దాన్ని కాదనలేక ఏకగ్రీవంగా ఆమోదించేవి. కానీ, కావాలనే దానికి నియోజకవర్గాల పునర్విభజన అనే వివాదాస్పద అంశాన్ని ప్రభుత్వం ముడిపెట్టింది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న భయంతో విపక్ష కూటమి అడ్డుకుంటుందని బీజేపీకి పక్కా అంచనా ఉంది. మహిళా సాధికారత అనే ముసుగులో డీలిమిటేషన్ అజెండాను ముందుకు తీసుకురావడం, తద్వారా విపక్షాలను ఇరకాటంలో పెట్టడం ప్రభుత్వ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
50 శాతం రిజర్వేషన్ సవాల్
చర్చ సందర్భంగా అమిత్ షా చేసిన సవాల్కు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. డీలిమిటేష్న బిల్లులో 50 శాతం పెంపు ఉండేలా మార్పు చేస్తే తాము మద్దతిస్తామని ప్రకటించారు. నిజానికి ప్రభుత్వం ఆ మార్పు చేసి ఉంటే విపక్షాల నోళ్లు మూతపడేవి. కానీ, అమిత్ షా ఆ ప్రతిపాదనను స్వీకరించకుండా నేరుగా ఓటింగ్కు వెళ్లారు. అంటే, బిల్లులో మార్పులు చేసి దాన్ని ఆమోదించుకోవడం కంటే, ప్రస్తుత రూపంలోనే అది వీగిపోవాలని ప్రభుత్వం కోరుకున్నట్లు స్పష్టమవుతోంది.
మహిళా ఓటు బ్యాంకుపై కన్ను
ఈ ఓటమిని ఆయుధంగా చేసుకుని, దేశంలోని మహిళలందరినీ కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకం చేసే కార్యచరణను బీజేపీ ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. మేము మీకు 33% అధికారం ఇవ్వాలని చారిత్రక బిల్లు తెస్తే, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డుకున్నాయి అనే నినాదంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మహిళా ఓటర్ల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా విపక్ష కూటమిని మహిళా వ్యతిరేక శక్తులుగా చిత్రించడం ఈ వ్యూహంలోని అసలు తిరుగులేని అంశం.
విపక్షాలకు పెను సవాల్
ఇప్పుడు ఈ వ్యూహాన్ని తిప్పికొట్టడం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి కత్తి మీద సాము లాంటిదే. తాము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, కేవలం డీలిమిటేషన్ ప్రక్రియలో ఉన్న లోపాలను మాత్రమే వ్యతిరేకించామని మహిళలకు వివరించడానికి విపక్షాలు నానా తంటాలు పడాల్సి ఉంటుంది. సంక్లిష్టమైన రాజ్యాంగ అంశాలను సామాన్య మహిళా ఓటర్లకు అర్థమయ్యేలా చెప్పడంలో విపక్షాలు విఫలమైతే, బీజేపీ ఆశించినట్లుగా అది భారీ ఓటు బ్యాంకుగా మారే ప్రమాదం ఉంది. ఈ ఓటమి బీజేపీకి ఒక రకమైన వ్యూహాత్మక వెనకడుగు . బిల్లు వీగిపోవడం వల్ల సాంకేతికంగా ప్రభుత్వం నష్టపోయినట్లు కనిపించినా, రాజకీయంగా మాత్రం ఒక బలమైన ప్రచార అస్త్రాన్ని సంపాదించుకుంది. అత్యవసర క్యాబినెట్ భేటీలో కూడా దీనికి కొనసాగింపుగా ఏదైనా సంచలన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















