Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
Kaleshwaram Controversy: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరం హాట్ టాపిక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సవాల్, మేడిగడ్డ-ఎల్లంపల్లి నీటి వివాదం చర్చకు రానున్నాయి.

Revanth Reddy Challenges KCR Telangana Assembly: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మొదటి నుంచి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు నేరుగా అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని విసురుతున్న సవాళ్లు.. ఈసారి సభలో తీవ్ర దుమారం రేపేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రూ. లక్ష కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం , మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, నిధుల వినియోగంపై జరగనున్న చర్చే ఈ సమావేశాల్లో ప్రధానాంశంగా మారనుంది.
బీఆర్ఎస్కు రివర్స్ అయిన మేడిగడ్డ ఇష్యూ
కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయంగా, పరిపాలనాపరంగా తమకు ప్రధాన ఆయుధంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుండగా, రైతుల నీటి అవసరాలను చూపుతూ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మేడిగడ్డ నుంచి నీళ్లను ఎత్తిపోయాలి అని చేపట్టిన నిరసనలు, క్షేత్రస్థాయి ఉద్యమాలు రాజకీయాన్ని వేడెక్కించాయి. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి నుంచి వరద నీరు సహజంగానే తిరిగి మేడిగడ్డ వైపు ప్రవహించడం, బ్యారేజీ సాంకేతిక పరిమితులు బయటపడటంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా తీవ్ర ఆత్మరక్షణలో పడింది.ఇరిగేషన్ నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను ముందుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం బీఆర్ఎస్కు సవాలుగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన పరిస్థితుల్లో నీటిని నిల్వ చేయడం లేదా పంపింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని ప్రభుత్వం వాదిస్తుంటే.. బీఆర్ఎస్ మాత్రం కేవలం పొలాలకు నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడుతోందని ఆరోపించింది. అయితే, వరద నీటి సహజ ప్రవాహం , ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పరిణామాలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వాదనకే బలాన్ని చేకూర్చడంతో, సోషల్ మీడియాలో సైతం బీఆర్ఎస్ రక్షణ ధోరణిలో పడాల్సి వచ్చింది.
కేసీఆర్ను రప్పించాలని రేవంత్ టార్గెట్
ఈ వర్షాకాల సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం అత్యంత స్పష్టంగా ఉంది. కేసీఆర్ను నేరుగా అసెంబ్లీకి రప్పించడం ద్వారా, ఆయన సమక్షంలోనే కాళేశ్వరం డిజైన్ లోపాలు, పీసీ ఘోష్ కమిషన్ విచారణ పురోగతి, మరియు రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్ని ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉండటాన్ని రేవంత్ రెడ్డి రాజకీయంగా వాడుకుంటూ.. ప్రతిపక్ష నేతగా సభకు వచ్చి తమ హయాంలో జరిగిన నిర్మాణాలను సమర్థించుకోవాలని సవాల్ విసురుతున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ వర్గాలు కూడా ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాళేశ్వరం అంశంలో సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, ఆరుగాలం కష్టపడే రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైందని సభలో తిప్పికొట్టేందుకు కేటీఆర్, హరీష్ రావులు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే, కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వస్తారా లేదా అనేది ఇంకా ఉత్కంఠగానే మారింది. ఒకవేళ కేసీఆర్ సభకు హాజరైతే రేవంత్-కేసీఆర్ మధ్య జరిగే ప్రత్యక్ష సభ సమరం తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టంగా మారనుంది.
ఇతర సమస్యలనూ ప్రస్తావించాలనుకుంటున్న బీఆర్ఎస్
ఈ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరంపై జరిగే చర్చ ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ రీ-డిజైన్ వైఫల్యం గా ప్రజల్లో శాశ్వతంగా ముద్ర వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఎండిపోతోంది అని నిరూపించేందుకు బీఆర్ఎస్ పోరాడుతోంది. అదే సమయంలో నిరుద్యోగ సమస్యలు సహా రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాలను హైలెట్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు కేవలం చట్టసభల చర్చలకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ గమనాన్ని నిర్దేశించే అత్యంత కీలక పోరాట వేదికగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















