KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Telangana Congress vs BRS: రాజకీయ ఆరోపణలకు కేటీఆర్ లీగల్ నోటీసులతో సమాధానం ఇస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కోర్టుల వెనుక దాక్కుంటున్నారా? టీ వ్యూహం వర్కవుట్ అవుతుందా?

KTR vs Revanth Political War: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సాగుతున్న ప్రత్యక్ష పోరు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఇంటర్మీడియట్ మార్కుల వివాదంతో ముడిపడిన గ్లోబ్ఎరీనా సంస్థ కేటీఆర్దేనని, అది ఆయన బినామీ కంపెనీ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలపై కేటీఆర్ మరోసారి లీగల్ నోటీసు అస్త్రాన్ని ప్రయోగించారు. 48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే, రేవంత్ రెడ్డి విసురుతున్న తీవ్రమైన రాజకీయ ఆరోపణలను కేటీఆర్ మైదానంలో రాజకీయంగా తిప్పికొట్టకుండా, పదే పదే న్యాయస్థానాలు ,లీగల్ నోటీసుల వెనుక దాక్కుంటున్నారనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది.
గతాన్ని పరిశీలిస్తే కేటీఆర్ ఈ తరహా లీగల్ రూట్ను ఎంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరినప్పుడు , డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ను లక్ష్యంగా చేసుకున్నప్పుడు కూడా ఆయన రాజకీయ సభల్లో రేవంత్ను గట్టిగా దెబ్బతీయడం కంటే కోర్టుల్లో కేసులు వేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వివాదం, బావమరిది ఫామ్హౌస్ రచ్చ, ఫార్ములా-ఈ రేస్ లీగల్ ప్రాసెస్, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల సమయంలోనూ పదుల సంఖ్యలో నాయకులకు లీగల్ నోటీసులు పంపారు. ఒక నాయకుడిగా తన ఇమేజ్ను కాపాడుకోవడానికి ఇది చట్టపరంగా సరైన మార్గమే అయినప్పటికీ, ప్రజాక్షేత్రంలో మాత్రం ఇది ఒక రకమైన రక్షణత్మక శైలి గా కనిపిస్తోంది.
ఇలా నోటీసులు ఇవ్వాలనుకుంటే లెక్క ఉండదు!
రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజా క్షేత్రంలోనే వాటిని ఖండించాలి. రేవంత్ రెడ్డి ప్రజాదరణ పొందిన మాస్ లీడర్ శైలిలో ఘాటైన భాషతో, మీడియా వేదికలపై బహిరంగ దాడి చేస్తుంటే, కేటీఆర్ కూడా తన పద్దతిలో కౌంటర్ ఇస్తున్నపటికీ అదనంగా కార్పొరేట్ పద్ధతిలో లీగల్ నోటీసుల కాగితాలను ముందుకు తెస్తున్నారు. రేవంత్ చేసే ప్రతి ఆరోపణకు మైక్ ముందుకు వచ్చి గంటల తరబడి ఆధారాలతో కౌంటర్ ఇవ్వకుండా, కేవలం లీగల్ టీమ్తో నోటీసులు పంపడం వల్ల.. కేటీఆర్ దగ్గర రాజకీయంగా రేవంత్ను ఢీకొట్టే కంటెంట్ లేదా పవర్ లేదా అనే సందేహం సామాన్య ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజాస్వామ్యంలో కోర్టు నోటీసుల కంటే ప్రజా కోర్టులోనే నిజానిజాలు తేలాలనేది మెజారిటీ ఓటర్ల భావన. ఈ లీగల్ నోటీసుల స్ట్రాటజీ వల్ల రేవంత్ రెడ్డికి రాజకీయంగా మరింత మేలు జరుగుతోందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. కేటీఆర్ నోటీస్ ఇవ్వగానే.. నేను దేనికైనా సిద్ధం, విచారణ జరిపిస్తాం అని రేవంత్ రెడ్డి ఆ ఆరోపణలను మరింత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఫలితంగా, గ్లోబ్ఎరీనా లేదా ఇతర ఆరోపణలు మీడియాలో రోజుల తరబడి నానుతూ, కేటీఆర్కు ప్రతికూల ప్రచారంగా మారుతున్నాయి. ఒక రకంగా కేటీఆర్ పంపే నోటీసులే రేవంత్ రెడ్డి ఆరోపణలకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయనే సత్యాన్ని బీఆర్ఎస్ వ్యూహకర్తలు గుర్తించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
రాజకీయంగా చేసే ఆరోపణన్నింటినీ ప్రజలు నమ్మరు !
మాజీ మంత్రిగా, ఒక సమర్థవంతమైన పాలకుడిగా ఐటీ రంగాన్ని నడిపిన కేటీఆర్.. చట్టపరమైన ప్రక్రియల ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనుకోవడం సాంకేతికంగా సరికావచ్చు. కానీ, తెలంగాణ వంటి హై-ఓల్టేజ్ రాజకీయాలు నడిచే రాష్ట్రంలో కార్పొరేట్ తరహా లీగల్ బెదిరింపులు పాలిటిక్స్లో పనిచేయవు. శత్రువు విసిరిన బాణాన్ని చట్టంతో కాకుండా, అంతకంటే పవర్ ఫుల్ పొలిటికల్ అస్త్రంతో తిప్పికొట్టినప్పుడే కేడర్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేవంత్ రెడ్డి లేవనెత్తుతున్న ప్రతి అంశంపై సభలు, సమావేశాలు పెట్టి ఆధారాలతో ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టకపోతే.. ఆయనకు రాజకీయంగా రేవంత్ను ఎదుర్కొనే సత్తా తగ్గుతోందనే ప్రచారం నిజమేనని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















