AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
ABV: మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై విమర్శల వెనుక అసలు వ్యూహమేంటి? 22A భూముల సమస్యపై పోరాటం, సొంత పార్టీ ఆలోచనలు రాజకీయాలను మారుస్తాయా?

ABV New Political Party: మాజీ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ పూర్వ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల ఏపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా 22A నిషేధిత భూముల జాబితా పరిరక్షణ ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన వేధింపులకు, సస్పెన్షన్కు గురై సత్యమేవ జయేతే అంటూ పోరాడిన ఆయన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి చేరకపోవడం, పైగా పాలనా లోపాలపై గళమెత్తడం వెనుక అసలు ప్లాన్ ఏంటనేది ఆసక్తికర చర్చకు దారితీసింది.
టీడీపీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపని చంద్రబాబు
ఏబీ వెంకటేశ్వరరావును టీడీపీ పార్టీలోకి చేర్చుకోనందుకే ఆయన అసంతృప్తితో విమర్శలు చేస్తున్నారు. తాను టీడీపీలో చేరాలని గతంలో అనుకున్నప్పటికీ సరైన స్పందన రాలేదని ఆయనే పలు ఇంటర్యూల్లో చెప్పారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా ఆయన తీసుకోలేదు. అందుకే ఆ తర్వాత ఆయన మరికొంత మంది ఇతరులతో కలిసి సెంటర్ ఫర్ లిబర్టీ అనే వేదిక ద్వారా 22A నిషేధిత భూముల జాబితా కారణంగా నష్టపోతున్న లక్షలాది మంది ప్రజల హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్థాయి నేతలకు అధికారుల వాస్తవాలు సరిగ్గా చేరవేడం లేదని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ భూముల సమస్య ప్రజా ఉద్యమంగా మారడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఆయుధంగా దీనిని మలుచుకున్నారు. రోల్ బ్యాక్ 22A పేరుతో ఉద్యమం చేస్తున్నారు.
కొత్త పార్టీ పెట్టే ఆలోచన
ఇక సొంత పార్టీ ఏర్పాటు ప్రకటన విషయానికి వస్తే, ఏబీ వెంకటేశ్వరరావు తన వైఖరిని స్పష్టం చేశారు. ఏదో ఒక రాజకీయం వెనుక నడవడం కంటే సమాజంలో మార్పు కోసం, పౌర హక్కుల పరిరక్షణ కోసం తమ భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. అధికారం పొందేందుకు కాకపోయినా, ఒక బలమైన వాచ్డాగ్గా, ఒత్తిడి గ్రూప్గా పనిచేయడానికే ఈ నూతన వేదిక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఇలాంటి మాజీ అధికారులను , సానుభూతిపరులను ఎందుకు దూరం చేసుకుంటోందనే ప్రశ్నకు రాజకీయ వ్యూహాలే సమాధానంగా కనిపిస్తున్నాయి. మాజీ అధికారుల స్వేచ్ఛా ప్రకటనలు ప్రభుత్వ నిర్ణయాలకు అవరోధంగా మారడం, లేదా పార్టీకి క్యాడర్ ఆధారిత నాయకత్వమే ప్రాధాన్యత కావడం ఇందుకు కారణం కావచ్చు. అదే సమయంలో, సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ వైపు పనిచేసిన అనుభవం ఉన్న వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని నియంత్రించే లోపాలను పసిగట్టి వేలెత్తి చూపిస్తుండటంతో కూటమి సర్కారుకూ ఇది ఇబ్బందికరంగా పరిణమించింది. తన చట్టపరమైన పోరాటం ముగిసిన తర్వాత, సమాజంలో ఒక ఇండిపెండెంట్ లీడర్గా, ప్రజా సమస్యలపై పోరాడే సివిల్ సొసైటీ వాయిస్గా తనను తాను నిలబెట్టుకునేందుకు వేస్తున్న వ్యూహాత్మక అడుగుగా దీనిని చూడొచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















