Revanth National Leader: పునర్విభజన రాజకీయాల్లో కాంగ్రెస్ తరపున గళం వినిపిస్తున్న రేవంత్ - జాతీయ రాజకీయాల్లోనూ కీలకం అవుతున్నారా?
Revanth : జాతీయ రాజకీయాల్లో రేవంత్ మార్క్ చూపిస్తున్నారు. హైబ్రిడ్ మోడల్తో కాంగ్రెస్ తరపున జాతీయ స్థాయి వాయిస్ వినిపిస్తున్నారు.

Revanth becoming crucial in national politics: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రస్తుతం దక్షిణాది గళంగానే కాకుండా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన వ్యూహకర్త గా అవతరిస్తున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఆయన తెరపైకి తెచ్చిన హైబ్రిడ్ మోడల్ జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.
హైబ్రీడ్ మోడల్ తో నేషనల్ లీడర్గా రేవంత్
దేశ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై పడింది. నియోజకవర్గాల పునర్విభజన వంటి అత్యంత క్లిష్టమైన అంశంపై ఆయన ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ఎజెండాను అందించింది. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆందోళన అందరిలో ఉన్నా, దానికి ప్రత్యామ్నాయం ఏమిటన్న ప్రశ్న ఎవరి దగ్గరా లేదు. ఆ శూన్యాన్ని రేవంత్ రెడ్డి తన వినూత్న ప్రతిపాదనతో భర్తీ చేశారు.
ఏమిటీ రేవంత్ హైబ్రిడ్ మోడల్ ?
డిలిమిటేషన్ ప్రక్రియలో కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనేది రేవంత్ ప్రధాన వాదన. దీనికి పరిష్కారంగా ఆయన 50:50 ఫార్ములా ను ప్రతిపాదించారు. అంటే.. అదనంగా పెంచే సీట్లలో 50 శాతాన్ని జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50 శాతాన్ని ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం (GSDP), సామాజిక అభివృద్ధి సూచికల ఆధారంగా కేటాయించాలి. ఈ మోడల్ వల్ల దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలకు తగిన గుర్తింపు దక్కుతుందని, అభివృద్ధి చెందినందుకు శిక్ష పడదనే భరోసా కలుగుతుందని ఆయన వివరిస్తున్నారు.
కాంగ్రెస్కు దిశానిర్దేశం.. బీజేపీకి చెక్!
గతంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన నేతను ఖరారు చేసేలా పావులు కదిపి జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మరోసారి తన వ్యూహ చతురతను ప్రదర్శించారు. బీజేపీని ఢీకొట్టడంలో కేవలం భావోద్వేగాలే కాకుండా, తార్కికమైన అంశాలు అవసరమని రేవంత్ నిరూపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల మనోభావాలను దెబ్బతీయకుండా, అదే సమయంలో జాతీయ సమగ్రతను కాపాడేలా ఆయన చేస్తున్న వాదన కాంగ్రెస్ హైకమాండ్కు కూడా కొత్త ఊపిరి పోస్తోంది.
ప్రాంతీయ సెంటిమెంట్ను జాతీయ ఎజెండాగా మార్చి..
రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని కేవలం తెలంగాణ సమస్యగా కాకుండా, మొత్తం దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి సమస్యగా మలిచారు. బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని కూడా ఇందులో జోడించారు. మహిళా కోటాను డిలిమిటేషన్తో ముడిపెట్టడం రాజకీయ కుట్ర అని, తక్షణమే 543 స్థానాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచారు. ఈ విశ్లేషణలన్నీ గమనిస్తే, రేవంత్ ఇప్పుడు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా, ఇండియా కూటమిలో ఒక థింక్ ట్యాంక్ గా ఎదుగుతున్నారని అర్థమవుతోంది.
కీలక నేతగా ఎదిగే అవకాశం
నియోజకవర్గాల విభజనపై క్లారిటీ లేక అయోమయంలో ఉన్న విపక్షాలకు రేవంత్ రెడ్డి మోడల్ ఒక స్పష్టమైన మార్గాన్ని చూపింది. ఈ మోడల్లోని సాధ్యాసాధ్యాల కంటే, ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ముందు ఉంచడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం గళమెత్తే ఛాంపియన్గా అవతరిస్తూనే, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త వ్యూహాలను అందిస్తున్న రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మరింత కీలక పాత్ర పోషించే అవకాశం పుష్కలంగా ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















