ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు?
Duplicate Votes Removal: తెలుగు రాష్ట్రాల్లో ఈసీ చేపట్టిన స్పెషల్ సమ్మరీ రివిజన్లో భారీగా ఓట్లు తొలగింపు? పార్టీలు ఎందుకు ఆందోళన చేయడం లేదు? కాంగ్రెస్ స్పందన వెనుక అసలు వ్యూహం ఏంటి?

Voter List Cleaning AP Telangana: కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చేపట్టిన సమగ్ర ప్రక్షాళన ప్రక్రియ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి సాంకేతికంగా కోటి ఇరవై లక్షలకు పైగా ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతున్నాయి. జాబితా నుంచి తొలగింపునకు గురవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే అయినప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయకపోవడం, సైలెంట్గా ఉండటం వెనుక ఏం జరుగుతోంది?
వాస్తవానికి ఈ గల్లంతు ప్రక్రియ అంతా అర్హులైన ఓటర్లను తొలగించడం కాదని, ఓటర్ల జాబితాను క్లీన్ క్రమంలో జరుగుతున్న సాంకేతిక ప్రక్రియ అని పార్టీలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఉమ్మడి రాష్ట్ర విడిపోయాక , హైదరాబాద్ కేంద్రంగా స్థ స్థిరపడిన లక్షలాది మందికి ఏపీ, తెలంగాణ రెండింటిలోనూ ఓట్లు ఉన్నాయి. దీనికి తోడు మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం, ఆధార్తో ఎపిక్ సీడింగ్ జరగడం వల్ల ఈ డూప్లికేట్ , ఇన్-యాక్టివ్ ఓట్లను ఈసీ వ్యవస్థ పసిగట్టి తొలగిస్తోంది. ఇది ఓటు హక్కును కాలరాయడం కాదని తెలిసే ప్రధాన పార్టీలు దీనిపై వీధిపోరాటాలకు దిగడం లేదు.
సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్
అయితే, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈసీ వద్ద తరచూ ఫిర్యాదులు చేస్తోంది. దీని వెనుక కాంగ్రెస్ పార్టీకి బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. గడిచిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, పట్టణ ప్రాంతాల్లో ఉన్న బోగస్, డబుల్ ఓట్లు ఫలితాలను ప్రభావితం చేశాయని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ, ఇతర పట్టణాల్లోనూ క్రమబద్ధీకరణ జరిగితే క్లీన్ ఓటర్ లిస్ట్ వల్ల తమకే పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుందని కాంగ్రెస్ లెక్కిస్తోంది. అందుకే ప్రతి బూత్ స్థాయిలో తమ బూత్ లెవల్ ఏజెంట్లను అలర్ట్ చేస్తూ, తొలగింపులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
మిస్సయిన ఓట్లకు దరఖాస్తులు
మరోవైపు బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి సైలెంట్గా ఉండటానికి కారణం.. క్షేత్రస్థాయి రియాలిటీయే. ఆయా పార్టీల అంతర్గత సర్వేల ప్రకారం, తొలగింపునకు గురవుతున్న ఓట్లలో అత్యధికం నివాసాలు మారిన వారివి, లేదా డబుల్ ఓటింగ్కు అవకాశం ఉన్నవే. ఒకవేళ పొరపాటున నిజమైన ఓటరు పేరు తొలిగినా, వారిని మళ్లీ ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేయించి ఓటరుగా నమోదు చేయించవచ్చనే సాంకేతిక వెసులుబాటు ఈసీ కల్పిస్తోంది. రచ్చ చేయడం కంటే క్షేత్రస్థాయిలో బిఎల్ఓ ల వద్ద తమ ఏజెంట్ల ద్వారా ఓట్ల పునరుద్ధరణ చేయించుకోవడమే ఉత్తమ మార్గమని పార్టీల భావన.
తమ ఓటర్లను కాపాడుకుంటున్న పార్టీలు
వాస్తవానికి ఎన్నికల సంఘం పారదర్శకంగా ఫారమ్-7 దరఖాస్తులు, క్లెయిమ్స్ , అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను నిర్వహిస్తుండటంతో చట్టపరంగా దీన్ని ప్రశ్నించే అవకాశం తక్కువగా ఉంది. కోటి ఇరవై లక్షల ఓట్ల ప్రక్షాళన అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే క్రమంలో జరుగుతున్న ఒక ప్రక్షాళన. నిరసనలు, ఆందోళనల కంటే నిశ్శబ్దంగా బూత్ స్థాయిలో తమ మద్దతుదారుల ఓట్లు జాబితాలో ఉండేలా చూసుకోవడమే రాజకీంగా ప్రయోజనకరమని భావించి పార్టీలు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















