Telangana Polytechnic Students Protest: పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
Telangana Gen Z Protests: తెలంగాణలో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం జెన్ జీని రోడ్డెక్కిస్తుందా?

Telangana Student Agitation Political Impact: తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలలు, విద్యార్థుల్లో జీవో 97 తీవ్ర నిరసన జ్వాలలు రాజేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తెచ్చిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోని శక్తి శాఖ కిందికి పాలిటెక్నిక్ కోర్సులు, డిప్లొమా వ్యవస్థను అనుసంధానించేందుకు జారీ చేసిన ఈ జీవోపై విద్యార్థి లోకం భగ్గుమంది. దశాబ్దాలుగా ఉన్న సాంకేతిక విద్యా మండలి స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని, తమ డిప్లొమా విద్యార్హతల విలువ తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్న విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కుతున్నారు.
జెన్జీని రోడ్డెక్కించే ప్రయత్నంలో బీఆర్ఎస్,బీజేపీ
ఈ విద్యా సంబంధిత నిరసన ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో జెన్ జీ ను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమించాలని చూస్తున్న ప్రధాన ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలకు ఈ పాలిటెక్నిక్ ఆందోళన ఒక ఊహించని రాజకీయ అవకాశాన్ని అందించింది. నిరుద్యోగ రాత పరీక్షల వాయిదాలు, జాబ్ క్యాలెండర్ జాప్యంపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న యువతను, ఈ జీవో 97 వివాదం ద్వారా ఏకం చేసేందుకు ప్రతిపక్షాల విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగుతున్నాయి. తెలంగాణ చరిత్రలో విద్యార్థి ఉద్యమాలకు ప్రభుత్వాన్ని కుదిపేసే శక్తి ఉంది. జెన్ జీ యువత కోపాన్ని రాజకీయంగా సమర్థవంతంగా మలచుకోగలిగితే.. ఈ జీవో 97 నిరసనలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అతిపెద్ద పరీక్షగా మారే అవకాశం ఉంది.
విద్యార్థుల నిరసనలకు పార్టీల మద్దతు
సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెయినింగ్ చేయడంలో సిద్ధహస్తులైన ఈనాటి జెన్ జీ విద్యార్థులు, డిజిటల్ నిరసనలతో పాటు క్షేత్రస్థాయిలో రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ యువ మోర్చా నేతలు ఈ విద్యార్థి పోరాటానికి బహిరంగ మద్దతు ప్రకటిస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను మాత్రమే కాకుండా, దీనిని తెలంగాణవ్యాప్తంగా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశాలకు జోడించి ఒక పెద్ద స్టూడెంట్ వేవ్ గా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందు కోసం విద్యార్థులు ఎక్కడ నిరసన తెలుపుతున్నా బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు మద్దతు పలుకుతున్నారు. హరీష్ రావు స్వయంగా జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. బీజేపీ నేతలు కూడా తమ విద్యార్థి విభాగం ద్వారా ఆందోళనలు చేయిస్తున్నాయి.
ప్రభుత్వాన్ని ఈ ఉద్యమం ఇబ్బంది పెట్టగలుగుతుందా?
అయితే, ఈ ఉద్యమం ప్రభుత్వాన్ని నిజంగానే ఉక్కిరిబిక్కిరి చేయగలుగుతుందా అంటే అది ప్రతిపక్షాల వ్యూహంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా, జీవో 97 వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని, నైపుణ్యాభివృద్ధి పెంచడమే లక్ష్యమని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో విద్యార్థుల్లో ఉన్న అపోహలను, అనుమానాలను తొలగించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తే, ఈ చిన్న నిరసన కాస్తా రాష్ట్రవ్యాప్త జెన్ జీ మూవ్మెంట్ గా రూపాంతరం చెందే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















